- Home
- Entertainment
- Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున.. కట్ చేస్తే సినిమా ఫ్లాప్
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున.. కట్ చేస్తే సినిమా ఫ్లాప్
మహేష్ బాబు హీరోగా వచ్చిన `యువరాజు` మూవీ నేటితో 26ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా ఓపెనింగ్కి సంబంధించిన అరుదైన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

మహేష్ బాబు కెరీర్లో `యువరాజు` స్పెషల్
మహేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు. బాలనటుడిగా నిరూపించుకున్న ఆయన `రాజకుమారుడు` మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది. యావరేజ్గా ఆడింది. అయితే ఆ తర్వాత భారీ స్థాయిలో మూవీని రూపొందించారు. అదే `యువరాజు`. ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితాన్ని పక్కన పెడితే, ఇది మహేష్ బాబు కెరీర్లోనే ప్రత్యేకమైన మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా సమయంలో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయి. అవేంటో చూస్తే.
యువరాజు మూవీ విశేషాలు
`యువరాజు` మూవీకి దర్శకుడు వైవీఎస్ చౌదరీ. అప్పట్లో ఈ దర్శకుడు మంచి ఫామ్లో ఉన్నాడు. కచ్చితంగా హిట్ ఇస్తాడనే నమ్మకం అందరిలో ఉంది. దీంతో చైదరీని నమ్మి ఈ మూవీ ఆఫర్ చేశాడు కృష్ణ. మహేష్ బాబుకి తగ్గట్టుగానే రొమాంటిక్ లవ్ స్టోరీ, ఫ్యామిలీడ్రామా మేళవింపుతో ఈ సినిమాని రూపొందించారు. ఇందులో మహేష్ కి జోడీగా సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా నటించారు. 2000 ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలైంది. నేడు మంగళవారంతో ఈ మూవీ 26ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
`యువరాజు` ఓపెనింగ్లో పవన్ కళ్యాణ్
మహేష్ బాబుకి ప్రిన్స్ అనే ట్యాగ్ వచ్చింది ఈ మూవీతోనే. అయితే ఈ సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో చాలా గ్రాండ్గా జరిగింది. దీనికి ఏకంగా బిగ్ స్టార్స్ వచ్చారు. అప్పట్లో టాప్లో ఉన్న వెంకటేష్, నాగార్జున ఈ ఓపెనింగ్లో పాల్గొన్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావడం విశేషం. వీరితోపాటు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, రామానాయుడు, కెఎల్ నారాయణ కూడా అటెండ్ అయ్యారు. ఇలా బిగ్ స్టార్స్ గెస్ట్ లుగా `యువరాజు` సినిమా ప్రారంభమైంది.
`యువరాజు` ఓపెనింగ్ మూవీ రేర్ ఫోటోలు
ఇందులో హీరోహీరోయిన్లపై వెంకటేష్ క్లాప్ కొట్టారు. తాజాగా దీనికి సంబంధించిన అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. సూపర్ స్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. అదే ఏడాది `వంశీ`తో మరో పరాజయాన్ని అందుకున్నాడు మహేష్. ఆ తర్వాత `మురారి`తో హిట్ అందుకున్నాడు. `ఒక్కడు`తో బ్రేక్ అందుకొని స్టార్ అయిపోయాడు. `పోకిరి`తో సూపర్ స్టార్ అయ్యాడు. `దూకుడు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `శ్రీమంతుడు, `భరత్ అనే నేను`, `మహర్షి` వంటి చిత్రాలో విజయాలు అందుకున్నాడు.
`వారణాసి`తో రాబోతున్న మహేష్ బాబు
ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు మహేష్ బాబు. ఇది గ్లోబల్ ట్రోటర్గా, టైమ్ ట్రోటర్ కాన్సెప్ట్ తో రాబోతుంది. ఇందులో మహేష్ బాబు అంతర్జాతీయ సాహసికుడిగా కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్లోకి వెళ్లనున్నారు. రామాయాణం ఎపిసోడ్ని కూడా ఇందులో చూపించబోతున్నారు రాజమౌళి. కాసేపు ఆయన రాముడిగా కనిపించనున్నారు. లంకా దహనం ప్రధానంగా ఈ రామాయణం ఎపిసోడ్ సాగుతుందని సమాచారం. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని కేఎల్ నారాయణ నిర్మిస్తుండటం విశేషం. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.

