నన్ను సీఎంని చేయండి.. అప్పుడే రైతులు బాగుపడతారు.. `బిగ్ బాస్7` విన్నర్ పల్లవి ప్రశాంత్ సంచలన స్టేట్మెంట్
`బిగ్ బాస్ 7` విన్నర్ పల్లవి ప్రశాంత్ చేస్తున్న కామెంట్లు వైరల్గా, హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని టార్గెట్ చేశాడు.
రైతుబిడ్డగా, యూట్యూబర్గా గుర్తింపు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్.. `బిగ్ బాస్ తెలుగు 7`లోకి వచ్చి రచ్చ చేశాడు. సైలెంట్గా వచ్చి, పులిలా గేమ్ ఆడుతూ అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. రైతు బిడ్డగా ఫేమస్ అయ్యాడు. తనదైన ఆటతీరుతో ఊహించని క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు. ఏకంగా బిగ్ బాస్ తెలుగు7వ సీజన్ టైటిల్ విన్నర్ అయ్యారు.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో విన్నర్ అయినప్పట్నుంచి ఆయన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన రోజు చేసిన రచ్చ వివాదం అయ్యింది. దీంతో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నెమ్మదిగా దాన్నుంచి బయటపడుతున్నాడు ప్రశాంత్. మళ్లీ తన లైఫ్లోకి వెళ్లిపోయాడు. వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. అలాగే తాను గెలిచిన డబ్బుని పేద రైతులకు సహాయం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ సహాయం కూడా చేశాడు.
ఇక ఇప్పుడు ఆయన మరోసారి వార్తల్లో నిలిచాడు. సంచలనంగా మారాడు. తాను సీఎం అవుతానంటూ సంచలన ప్రకటన చేశాడు. తనని సీఎం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాను సీఎం అయితేనే రైతులు బాగుపడతారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఎన్టీవీ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ఈ సంచలన విషయాలను వెల్లడించారు. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
వీళ్లందరిని(రైతులను) ఆదుకునే దమ్ము సీఎంకి ఉంటుంది. నన్ను సీఎంని చేస్తే నేను ఆదుకుంటా అని చెప్పా. తప్పా అన్నా. 14 ఊర్లు అంటే మామూలు ముచ్చటనా, నాకు వచ్చిందెంత. రూపాయి వస్తే, ఆ రూపాయిని 14ఊర్లకి ఎట్ల పంచుతా అన్నా. ఒకవేళ ఇస్తే, వీడు ఇంతిచ్చిందు, అంతిచ్చిండు అంటారు. అట్లా గాకుండా నన్ను సీఎంని చేస్తే అందరిని ఆదుకుంట కదా` అని వెల్లడించారు.
ఈ సందర్భంగా యువత మేల్కోవాలన్నాడు పల్లవి ప్రశాంత్. యువత బయటకు వస్తే రైతులు బాగుపడతారని తెలిపాడు. రైతుల కోసం యువత ముందుకు రావాలని, ఏ రంగంలోనైనా యువత మేల్కోవాలని తెలిపారు పల్లవి ప్రశాంత్. ఇటీవల ఓ కుటుంబానికి సహాయం చేయడంపై రియాక్ట్ అవుతూ, నాకు లేట్గా డబ్బులు వచ్చాయని, అందుకే లేట్ అయ్యిందన్నారు. ఊరు పెద్దలు ఓ ఫ్యామిలీని చూపించారని, వారికి లక్ష రూపాయలు, ఏడాదికి సరిపడ బియ్యం అందించినట్టు తెలిపారు ప్రశాంత్.