- Home
- Entertainment
- Janaki: చెల్లిని కోల్పోయాను, జానకి మరణంపై పి సుశీల ఎమోషనల్ కామెంట్స్, కన్నీటి పర్యంతం అయిన గాయని
Janaki: చెల్లిని కోల్పోయాను, జానకి మరణంపై పి సుశీల ఎమోషనల్ కామెంట్స్, కన్నీటి పర్యంతం అయిన గాయని
Janaki: జానకి లేని సంగీత ప్రపంచాన్ని ఊహించుకోలేం. జానకమ్మ లాంటి గొప్ప గాయని గొంతు వినే అదృష్టం ఈ తరానికి దక్కింది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన వేలాది పాటలు ఎప్పటికీ బతికే ఉంటాయి.

జానకితో తనకున్న అనుబంధం..
ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూయడంతో ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు ఆమెకు తుది నివాళులు అర్పించారు. భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు అద్భుతమైన గాయనీమణులు ఎస్. జానకి, పి. సుశీల. సమకాలీనులైన వీరిద్దరూ తమ కోకిల కంఠంతో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల మనసు దోచుకున్నారు. ఇప్పుడు జానకితో తనకున్న అనుబంధం, స్నేహం, విభేదాల గురించి పి. సుశీల పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
50 ఏళ్లకు పైగా అనుబంధం
ఎస్. జానకి మరణం తన వ్యక్తిగత నష్టమని పి. సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. "50 ఏళ్లకు పైగా నాతో అనుబంధం ఉన్న నా ప్రాణ స్నేహితురాలు జానకి మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె ఇక లేరంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది" అని సుశీల ఓ సోషల్ మీడియా వీడియోలో తన బాధను పంచుకున్నారు.
చెల్లిని కోల్పోయాను
మరో సందేశంలో, ఆ రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటని సుశీల అభివర్ణించారు. "నేను ఒక గొప్ప సహోద్యోగిని మాత్రమే కాదు, నా నిజమైన స్నేహితురాలిని, చెల్లిని కోల్పోయాను. మేమిద్దరం దాదాపు ఐదు దశాబ్దాలుగా సంగీతంలో కలిసి ప్రయాణించాం, ఎన్నో భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడాం" అని ఆమె చెప్పారు. "ఆమెకు సాటి రాగలవారు ఎవరూ లేరు. దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో ఆమె స్థాయి గాయకులు మనకు లేరు" అని ఆమె అన్నారు. "'సింగారవలే దేవ' పాటను ఆమె పాడినట్టుగా మరెవరూ పాడలేరు. ఆ పాట ఆమెను నేపథ్య గానంలో శిఖరాగ్రానికి తీసుకెళ్లింది" అని సీనియర్ గాయని పి. సుశీల గుర్తుచేసుకున్నారు.
మా మధ్య గొడవలు పెట్టారు
"మేము కలిసి ఉన్నన్ని రోజులు చాలామంది మమ్మల్ని టార్గెట్ చేశారు. నా మీద ఆమెకు, ఆమె మీద నాకు చాడీలు చెప్పి మా మధ్య గొడవలు పెట్టి తమాషా చూశారు. ఇప్పుడు వాళ్లు చల్లగా ఉండాలి. ఇదంతా చేసి వాళ్లేం సాధించారు? ఆమెకు చావు లేదు. దేవుడి దగ్గరికి వెళ్లింది. ఈ అదృష్టం అందరికీ దక్కదు. ప్రజలు పుణ్యం చేసుకున్నారు కాబట్టే ఆమె మధురమైన గొంతు వినే అవకాశం దక్కింది" అని పి. సుశీల ఆవేదనగా మాట్లాడారు.
మనసువిప్పి మాట్లాడిన సుశీల..
ఎస్. జానకి, పి. సుశీల కలిసి ఎన్నో పాటలు పాడారు. కన్నడలో 'చదురంగ' సినిమాలోని 'మమతెయ తోటద మల్లిగెయె' పాట, 'చక్రవ్యూహ' చిత్రంలోని 'నిజ హెళువెను అమ్మ నిన్న కండరె ప్రీతి' వంటి ఎన్నో పాటలకు వీరిద్దరూ గొంతు కలిపారు. సుశీల మాట్లాడుతూ "జానకి లేకుండా సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం అసాధ్యం. జానకమ్మ లాంటి గొప్ప గాయని గొంతు వినే భాగ్యం ఈ తరానికి దక్కింది. ఆమె భౌతికంగా మనతో లేకపోయినా, ఆమె పాడిన వేలాది అమర గీతాలు అలాగే ఉంటాయి. ఈ ప్రపంచం ఉన్నంత వరకు జానకికి మరణం లేదు" అని తన సహ గాయని ఎస్. జానకి గురించి పి. సుశీల మనసువిప్పి మాట్లాడారు.
