- Home
- Entertainment
- Oscar Tributes: కోట శ్రీనివాసరావుని ప్రత్యేకంగా గౌరవించిన ఆస్కార్.. ఈ ముగ్గురి దిగ్గజాలకు అకాడమీ నివాళ్లు
Oscar Tributes: కోట శ్రీనివాసరావుని ప్రత్యేకంగా గౌరవించిన ఆస్కార్.. ఈ ముగ్గురి దిగ్గజాలకు అకాడమీ నివాళ్లు
Oscar Tributes: ఆస్కార్ అవార్డులు వేడుక ఈ సోమవారం ఉదయం గ్రాండ్ గా జరిగింది. ఇందులో మన తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురు దిగ్గజ నటులకు ఆస్కార్ నివాళ్లు అర్పించింది.

కోటశ్రీనివాసరావుకి ఆస్కార్ నివాళి
98వ ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం ఉదయం(అమెరికాలో ఆదివారం సాయంత్రం) ఘనంగా జరిగింది. ఇందులో ప్రియాంక చోప్రా హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. అలాగే దీపికా పదుకొనె రెడ్ కార్పెట్పై మెరిసింది. మన భారతీయ సినిమాలకు అవార్డులు రాకపోయినా, భారతీయ నటీమణులు ఆస్కార్ ఈవెంట్లో సందడి చేయడం విశేషం. అంతేకాదు మన దిగ్గజ నటులను ఆస్కార్ ప్రత్యేకంగా గౌరవించింది. తెలుగు నుంచి విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుని అకాడమీ వేడుక గుర్తు చేసుకుంటూ నివాళ్లు అర్పించింది.
ఘనంగా ఆస్కార్ అవార్డుల వేడుక
ప్రపంచ సినీ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అకాడమీ గౌరవించింది. లాస్ ఏంజెలెస్లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయ సినీ అభిమానులకు ప్రత్యేకమైన భావోద్వేగాన్ని అందించింది.
భారతీయ దిగ్గజాలను గుర్తు చేసుకున్న ఆస్కార్
ఈ వేడుకలో ప్రత్యేకంగా నిర్వహించిన ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. గత ఏడాది మన నుంచి దూరమైన(చనిపోయిన) సినీ ప్రముఖులను స్మరించుకుంటూ వారి సేవలను అకాడమీ గుర్తుచేసుకుంది. ఈ జాబితాలో భారతీయ సినీ రంగానికి అపార సేవలు చేసిన పలువురు దిగ్గజాలకు కూడా చోటు దక్కింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుతో పాటు హిందీ చిత్రసీమ లెజెండ్స్ ధర్మేంద్ర, మనోజ్ కుమార్, అలాగే దక్షిణ భారత సినీ ప్రపంచంలో చిరస్మరణీయమైన నటి బి. సరోజా దేవి పేర్లు అకాడమీ అధికారిక వెబ్సైట్లో చోటు సంపాదించాయి.
తెలుగులో విలక్షణ నటుడిగా రాణించిన కోట శ్రీనివాస రావు
ఆస్కార్ కార్యక్రమం ప్రారంభంలో దివంగత సినీ ప్రముఖులకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రతో పాటు కొందరు భారతీయ నటీనటుల దృశ్యాలు కనిపించలేదు. అనంతరం ఆస్కార్ అవార్డుల అధికారిక వెబ్సైట్లో మాత్రం వారి పేర్లను ప్రత్యేకంగా చేర్చారు. సమయాభావం కారణంగా ట్రిబ్యూట్ వీడియోలో కొద్దిమందినే చూపించారని హాలీవుడ్ మీడియా పేర్కొంది. తెలుగు ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకు పైగా తన నటనతో అలరించిన కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో 2025 జూలై 13న కన్నుమూశారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన విలన్గా, కామెడీ విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక రకాల పాత్రల్లో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.
ధర్మేంద్రకి ప్రత్యేక నివాళి
ఇక హిందీ సినీ రంగంలో మహానటుడిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో 2025 నవంబర్ 24న తుదిశ్వాస విడిచారు. ఆయనకు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దేశభక్తి సినిమాలతో ప్రసిద్ధి చెందిన నటుడు మనోజ్ కుమార్ ఏప్రిల్ 4న కన్నుమూశారు. అలాగే దక్షిణ భారత సినీ రంగంలో సుదీర్ఘ కాలం తన నటనతో వెలుగొందిన నటి బి. సరోజా దేవి జూలై 14న పరమపదించారు. ఈ విధంగా భారతీయ సినీ దిగ్గజాల సేవలను ఆస్కార్ గుర్తుచేసుకోవడం భారతీయ అభిమానులకు గర్వకారణంగా చెప్పొచ్చు.

