ఆదిపురుష్ కథని ప్రభాస్ ఫోన్లో విని ఓకే చేశాడట!
సినిమా కథని డైరెక్ట్ గా, ఫేస్ టూ ఫేస్ కూర్చొని వింటేనే ఆ హీరోకి సంతృప్తి కలుగుతుంది. అదే సమయంలో దర్శకుడు తాను అనుకున్న కథని హవభావాలతో వివరించగలడు. సినిమా చేయాలనే పాజిటివ్ దృక్పథం డైరెక్ట్ మీటింగ్లోనే ఉంటుంది. కానీ అదే ఫోన్లో వింటే.. సగం ఇంట్రెస్ట్ అక్కడే పోతుంది.
ప్రభాస్ నటించబోతున్న `ఆదిపురుష్` విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ప్రభాస్ ఈ సినిమా కథని మొదట ఫోన్లోనే విన్నాడట. లాక్డౌన్ కారణంగా ప్రభాస్ ఈ స్టోరీని ఫోన్లోనే విని ఓకే చేశాడని దర్శకుడు ఓం రౌత్ వెల్లడించారు.
`నేను కాలేజ్లో చదువుకునే టైమ్ నుంచి `ఆదిపురుష్` కథ గురించి ఆలోచించే వాడిని. ఈ సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. ఇలాంటి కథని గతంలో రాశా.
లాక్డౌన్ సమయంలో నా ఆలోచనని మరోసారి బయటకు తీశాను. పాత కథని బయటకు తీసి రీ వర్క్ చేశా. ప్రభాస్కి మొదట ఫోన్లో కథ వివరించగా, అందులో మంచిని ఆయన చూశారు. ఓకే చెప్పారు. అన్లాక్ దశ రాగానే హైదరాబాద్ వెళ్ళి పూర్తి కథని చెప్పాను` అని ఓం రౌత్ వెల్లడించారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. 2022లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రావణ్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతుండటం విశేషం. రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.
సీత పాత్ర కోసం అన్వేషణ జరుగుతుంది. దీపికా పదుకొనె, కియారా అద్వానీ, కీర్తిసురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 21వ చిత్రంలోనూ దీపికా హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్`లో నటిస్తున్నారు.