- Home
- Entertainment
- NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్ రేట్తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్ రేట్తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
ఎన్టీఆర్ కి కెరీర్ ప్రారంభంలో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ గురించి తాజాగా నిర్మాత నల్లమలపు బుజ్జి వెల్లడించారు. ఎన్టీఆర్ మూవీ ఒకటి రెండు కోట్లతో తీస్తే రూ.30కోట్లు రాబట్టిందట.

కెరీర్ బిగినింగ్లో ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ కెరీర్ ప్రారంభంలో మామూలుగా ఉండేది కాదు. ఆయన సినిమాల ఫంక్షన్లకి వేలు కాదు, లక్షల్లో అభిమానులు వచ్చేవారు. సీనియర్ ఎన్టీఆర్ రూపం, నందమూరి ఫ్యామిలీ వారసుడు కావడం, టీడీపీ శ్రేణులు ఇలా అంతా కలిసి వచ్చేవారు. దీంతో ఈవెంట్లు కిక్కిరిసిపోయేవి. అయితే ఆ క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీడీపీ శ్రేణుల నుంచి కొంత వ్యతిరేకత, నందమూరి ఫ్యామిలీలో అభిమానులు రెండుగా విడిపోవడంతో ఆ ఊపు తగ్గింది.
ఆదికి 24ఏళ్లు
అలాంటి టైమ్లో ఆయన మాస్ హీరోగా నటించిన మూవీ `ఆది`. స్టూడెంట్ నెం 1` వంటి హిట్ తర్వాత వచ్చిన చిత్రమిది. మధ్యలో `సుబ్బు` ఆడలేదు. కానీ అప్పట్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు విశేష ఆదరణ ఉండేది. `ఆది` సినిమా అదే జోనర్ కథ. ఒక్కసారి తొడగొట్టు అన్న అనే డైలాగ్ థియేటర్లని షేక్ చేసింది. వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి చావ్లా హీరోయిన్గా నటించింది. 2002 మార్చి 28న విడుదలైంది. బాక్సాఫీసుని షేక్ చేసింది. ఈ మూవీ విడుదలై నేటికి 24ఏళ్లు.
ఆది మూవీ రికార్డులు
అప్పట్లో `ఆది` సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ, కాదు, ఇండస్ట్రీ హిట్గా చెప్పొచ్చు. ఈ మూవీ కేవలం రెండు కోట్లతో రూపొందింది. బెల్లంకొండ సురేష్ దీన్ని నిర్మించారు. థియేట్రికల్గా ఇది ఏకంగా రూ.30కోట్లు రాబట్టింది. అయితే ఈ మూవీ టికెట్ రేట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. లోయర్ క్లాస్ కేవలం రూ.5. క్లాస్ ఏ టికెట్ రేట్ రూ.35. అలాంటి రేట్లతో ఈ సినిమా ముప్పై కోట్లని రాబట్టిందంటే మామూలు విషయం కాదు. డిస్ట్రిబ్యూషన్ షేర్ దాదాపు రూ.19కోట్లు వచ్చిందట. ఆల్మోస్ట్ 10 రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ ప్రొడక్షన్లో నిర్మాత నల్లమలపు బుజ్జి భాగం అయ్యారు. ఆయనే ఈ విషయాన్ని తెలిపారు.
ఎన్టీఆర్ డేట్స్ ఇస్తే డబ్బులు మిగులుతాయి
ఆయన మాట్లాడుతూ, `2002లో హైయ్యెస్ట్ టికెట్ రేట్ రూ.35, లీస్ట్ రేట్ రూ.5. ఆ రేట్లతోనే `ఆది` మూవీ రూ.30కోట్లు రాబట్టింది. కేవలం దీని బడ్జెట్ రెండు కోట్లు మాత్రమే. అప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చాడంటే డబ్బు మిగులుతుందనే క్రేజ్ ఉండేది. చాలా స్టోరీస్ కొడాలి నాని విని ఓకే చేసినవే` అని నల్లమలపు బుజ్జి వెల్లడించారు. అప్పట్లో ఎన్టీఆర్ రేంజ్ని, క్రేజ్ని ఆయన వెల్లడించారు. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. హీరో ఎవరైనా కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడుతున్నాయి. లేదంటే కష్టమే. బాగా ఆడిన సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగా మారిపోతుంది.
డ్రాగన్తో రాబోతున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ చివరగా `వార్ 2`తో వచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరో హీరోగా నటించారు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనికి `డ్రాగన్` అనే టైటిల్ ని అనుకుంటున్నారట. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. 1970 కోల్ కత్తా పాలిటికల్, మాఫియా బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం సాగుతుందని, ఇందులో మాఫియా లీడర్గా ఎన్టీఆర్ కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.

