తన షోలను ఎవరూ చూడటం లేదట.. నెటిజన్లతో నాగబాబు ఆవేదన
నెటిజన్ల ముందు నాగబాబు తన గోడు వెల్లబోసుకున్నారు. తాను ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదట. తన షోలని ఎవరూ చూడటం లేదని నెటిజన్తో మొర పెట్టుకున్నాడు నాగబాబు. మరి ఆ కథేంటో చూస్తే..
నాగబాబు టీవీ షోస్లో `జబర్దస్త్`తో బాగా పేరు తెచ్చుకున్నారు. రోజా, నాగబాబు జడ్జ్ లుగా ఆ షోకే కళ వచ్చింది. తనపై కమెడీయన్లు ఎన్ని జోకులేసినా, తాను ఎన్ని జోకులేసినా అవి బాగా పండేవి. షోని రక్తికట్టించేవి.
కానీ మరో టీవీ ఛానెల్లో ఆఫర్ రావడంతో `జబర్దస్త్`ని వదిలేశాడు నాగబాబు. ఆ షోకి అంతగా ఆదరణ లేకపోవడంతో కొన్నాళ్ల తర్వాత దాన్ని క్లోజ్ చేశారు. దీంతో తన చేతుల్లో ఉన్న ఆఫర్స్ అన్నీ పోవడంతో నాగబాబు ఖాళీగానే ఉంటున్నారు.
అడపాదడపా పలు సినిమాల్లో నటిస్తున్నారు. అది కూడా చాలా సెలక్లీవ్గానే వస్తున్నాయి. దీంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించారు. విలన్గా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్లో విలన్గా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే చాలా రోజులుగా ఆయన తన సొంత యూట్యూబ్ ఛానెల్లో `ఖుషీ ఖుషీగా` అనే స్టాండప్ కామెడీ షోని నిర్వహిస్తున్నారు. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ షో రన్ అవుతుంది. చీకటి గదుల్లో చిత్రీకరించినట్టుగా ఉంటుందీ షో. అయితే దీనికి పెద్దగా వ్యూస్ రావడం లేదట. ఈ విషయాన్ని ఏకంగా నాగబాబునే చెప్పాడు. ఓ నెటిజన్కి చెబుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇన్స్టాగ్రామ్ లైవ్ ఛాట్లో పాల్గొన్న నాగబాబు వారితో పలు అంశాలు ముచ్చటించారు. అందులో భాగంగా ఓ అభిమాని `ఖుషీ ఖుషీగా షో చూస్తున్నంత సేపు అసలు టైం తెలియదు. అప్పుడే ఫైనల్కి వచ్చిందా? అని పేర్కొన్నాడు. దీనికి నాగబాబు కౌంటర్గా స్పందిస్తూ, `మీరు ఇలా అంటారు. చూసి షేర్ మాత్రం చేయరు. వ్యూస్ ఎక్కడ అండి వ్యూస్` అంటూ సెటైర్ వేశాడు.
దీంతో ఈ షోకి పెద్దగా వ్యూస్ రావడం లేదని, నాగబాబు షోని ఎవరూ చూడటం లేదని స్పష్టమవుతుంది. పరోక్షంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పుకురావడం విశేషం. అయినప్పటికీ ఈ షో ద్వారా చాలా మంది కొత్త కమెడీయన్లు వెలుగులోకి వస్తారని మాత్రం నాగబాబు చెబుతున్నారు. ఇప్పటికే కొంత మందికి ఇతర మెయిన్ స్ట్రీమ్ టీవీ షోస్లో ఆఫర్స్ వచ్చాయి.