బాలకృష్ణకి దిమ్మతిరిగే కౌంటర్లిచ్చిన నాగచైతన్య, అఖిల్.. ఇది తెరవెనుక నాగ్ ప్లానేనా?
`అక్కినేని.. తొక్కినేని` అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తాజాగా దీనిపై అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ స్పందించారు. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
బాలకృష్ణ ఇటీవల నిర్వహించిన `వీరసింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అక్కినేని, ఎస్వీరంగారావులపై ఆయన చేసిన కామెంట్లు, హిందీలో ప్రసంగానికి సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్కి సమకాలీకులుగా రాణించిన అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీఆర్లపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్లో దుమారం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు స్పందించారు. నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియా ద్వారా బాలయ్యకి కౌంటర్లిచ్చారు. దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. `నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం` అంటూ బాలయ్యకి చురకలంటించారు. ట్విట్టర్ ద్వారా చైతూ, అఖిల్ ఒకే పోస్ట్ ని అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతుంది. ఇది వివాదాన్ని మరింత హాట్ టాపిక్గా మారింది. దీనిపై బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారనేది మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.
అయితే ఇప్పటి వరకు దీనిపై అక్కినేని నాగార్జున స్పందించలేదు. ఇప్పటికే బాలకృష్ణకి, నాగార్జునకి పడదు, వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. వీరిద్దరు కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. అందుకే వారి మధ్య ఏవో ఉన్నాయని అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే వారి వ్యవహారశైలి ఉంటుంది. అది బాలయ్య వ్యాఖ్యలతో మరింత చర్చనీయాంశంగా మారడంతోపాటు ఆ రూమర్లకి బలాన్ని చేకూరుస్తుంది. ఎన్టీఆర్ తనయుడు అయినంత మాత్రానా బాలకృష్ణ.. అక్కినేనికి సమకాళీకులు కాలేరు. ఏఎన్నార్ ఓ లెజెండ్, తొలితరం దిగ్గజాలలో ఆయన ఒకరు. అలాంటి ఏఎన్నార్ని తీసి పడేసినట్టుగా బాలకృష్ణ మాట్లాడటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.
ఇటీవల `వీరసింహారెడ్డి` సక్సెస్ సెలబ్రేషన్లో బాలకృష్ణ మాట్లాడుతూ, జయరాం అనే రైటర్, ఆర్టిస్టు గురించి చెబుతూ, ఈయన సెట్లో ఉన్నారంటే నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునేవాళ్లం` అని తన నోటి దురుసుని ప్రదర్శించారు బాలయ్య. ఆ ఫ్లోలో నోటికొచ్చింది మాట్లాడుకుంటూ వెళ్లారు. అదే కాదు, ఏపీ ప్రభుత్వంపై, అలాగే హిందీలో స్పీచ్ అంటూ `అమ్మ....`పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి క్రమంగా వైరల్గా మారి, వివాదాలకు దారి తీశాయి. ఇప్పుడు పెద్ద రచ్చ అవుతున్నాయి.
ఏఎన్నార్పై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు స్పందించారు. నాగార్జున ఇంకా స్పందించలేదు. వీరి చేత స్పందింప చేసింది నాగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆయన రియాక్ట్ కాకపోవడమే ఇప్పుడు సరికొత్త చర్చకి తెరలేపుతుంది. తమ మధ్య విభేదాల రూమర్ల నేపథ్యంలో తాను స్పందిస్తే అది మరింత పెరుగుతుందని భావించారా? లేక బాలయ్యలా తాను చులకన కావడం ఎందుకు అనుకుంటున్నారా? ఆయన్ని లెక్కలోకి తీసుకోవడం లేదా? అనేది మరో చర్చనీయాంశంగా మారిన విషయం. అదే సమయంలో నాగ్ ఎలా రియాక్ట్ అవుతారనేది మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
బాలకృష్ణ వరుసగా సక్సెస్లున్నాయి. `అఖండ` బంపర్ హిట్ అందుకుంది. `అన్ స్టాపబుల్` టాక్ షో ఇండియా వైడ్గా పాపులర్ అయ్యింది. నెంబర్ వన్ షోగా రాణిస్తుంది. దీంతో ఆయనలో జోష్ పెరిగిపోయింది. స్టేజ్పై మైక్ దొరికిందంటే తన నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. వెనకా ముందు ఆలోచించడం లేదని చెప్పడానికి ఇవే నిదర్శనం. దీనిపట్ల అటు ఆడియెన్స్ నుంచి, ఇటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను మీమ్స్, ట్రోల్స్ చేసి ఆడుకుంటున్నారు నెటిజన్లు. మరోవైపు దీన్ని ఏపీలో వైసీపీ పార్టీ నేతలు ఆసరగా తీసుకుని బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా బాలయ్య నోటి దురుసు వివాదాలకు కేరాఫ్గా నిలుస్తుండటం గమనార్హం. బాలయ్య ప్రవర్తన ఆయన అభిమానులను ఇరకాటంలో పెడుతుండటం విచారకరం.
బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీరసింహారెడ్డి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించారు. ఈ చిత్రం దాదాపు రూ.130కోట్ల గ్రాస్(70కోట్ల షేర్) సాధించిందని ట్రేడ్ వర్గాల టాక్. అదే సమయంలో వచ్చిన చిరంజీవి `వాల్తేర్ వీరయ్య` వంద కోట్ల షేర్ని దాటింది(200కోట్ల గ్రాస్).