నాగార్జున కారణంగా నా కెరీరే పోయింది.. దర్శకుడు వీరభద్రం చౌదరి సంచలన వ్యాఖ్యలు
దర్శకుడు వీరభద్రం చౌదరి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. `భాయ్` సినిమా తర్వాత సినిమాలు తగ్గించిన ఆయన తాజాగా నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడు వీరభద్రం చౌదరి.. నాగార్జునతో `భాయ్` సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా పరాజయం చెందింది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో రీచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించింది. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఈ సినిమాతో దర్శకుడు వీరభద్రం చౌదరికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. నాగార్జున కూడా తాను బాగానే చేశానని, తన మిస్టేక్ ఏం లేదనట్టుగా అప్పట్లో చెప్పడంతో ఈ సినిమా ఫ్లాప్కి కారణంగా దర్శకుడే అనే సందేశం వెళ్లిపోయింది.
తాజాగా దీనిపై స్పందించారు దర్శకుడు వీరభద్రం చౌదరి. ఆయన ఓ యూట్యూబ్ (అంజి టాక్స్)ఇంటర్వ్యూలో ముచ్చటించారు. నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. `భాయ్` సినిమాతో తన కెరీర్ ఆగిపోయిందన్నారు. మొదటి సినిమా `ఆహానా పెళ్లంట` సూపర్ హిట్ అయ్యిందని, ఆ తర్వాత `పూలరంగడు` మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందన్నారు. హాయిగా సాగిపోతున్న జీవితంలో `భాయ్` పెద్ద బ్రేక్ వేసిందని, ఫ్లైట్లో వెళ్తున్న వాళ్లని మధ్యలో ఒక్కసారిగా తోసేస్తే ఎలా ఉంటుందో తన పరిస్థితి అలా మారిపోయిందన్నారు.
తాను మొదట ఈ సినిమా కథని కామెడీ ఎంటర్టైనర్గా చేయాలనుకున్నారట. హిలేరియస్ కథనే చేశానని, కానీ నాగార్జున హీరో అనేసరికి రకరకాల డెవలప్మెంట్ల కారణంగా సీరియస్గా మారిపోయిందన్నారు. ఫస్ట్ నేను చెప్పిన `భాయ్` కథ సరదాగా, జోవియల్గా ఉంటుందని, కామెడీగా సాగుతూ చివర్లో సీరియస్గా మారుతుందని, ఎప్పుడైతే నాగార్జున హీరో అనుకున్నామో, ఆ తర్వాత డెవలప్మెంట్ కారణంగా ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతూ వచ్చిందని, పూర్తి సీరియస్గా మారిపోయిందన్నారు. ఆడియెన్స్ కామెడీ ఉంటుందని ఆశించారు, కానీ సీరియస్గా సాగడంతో వారికి రీచ్ కాలేదు. దీంతో ఘోరంగా పరాజయం చెందిందన్నారు.
అయితే నాగార్జున తన తప్పేం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనే ప్రశ్నకి వీరభద్రం చౌదరి రియాక్ట్ అవుతూ, తప్పు జరిగింది. సినిమా ఫ్లాప్ అయ్యింది. దానిపై ఇప్పుడేం మాట్లాడలేం. తప్పు ఏ రూపంలో జరిగినా తప్పే, దానిపై ఒకరిపై నెట్టలేమన్నారు. ఒక సినిమా ఆడినా, ఆడకపోయినా డైరెక్టరే బాధ్యుడన్నారు. సక్సెస్ మన చేతుల్లో ఉండదని, ఉంటే అన్ని సూపర్ హిట్లే తీస్తామన్నారు. `ఆహానా పెళ్లంట`, `పూలరంగడు` తన సినిమాలే అని, `భాయ్` కూడా తన సినిమానే అని, ముగ్గురు పిల్లలున్నప్పుడు ఒకడు సరిగా చదవడం లేదంటే మిస్టేక్ మనదే అని తెలిపారు దర్శకుడు.
`భాయ్` సినిమాని అనుకున్న బడ్జెట్లోనే తీశామని, కథ కూడా అందరికి నచ్చిందని, నచ్చే నాగార్జున గారు కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్ చేయించారని, బయట నిర్మాతలు వచ్చినా నాగార్జునే నిర్మించారని, కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యిందన్నారు. జనరల్గా ఓ కథని మొదట ఎంతో ఎగ్జైట్మెంట్తో తీసుకొస్తామని, హీరోకి, నిర్మాతలకు చెప్పాక చేసే మార్పుల కారణంగా కథలో అసలు క్రీమ్ మిస్ అవుతుందని, దీని కారణంగా రిజల్ట్ తేడా కొడుతుందన్నారు దర్శకుడు. నా కెరీర్ మొత్తంలో అతిగా బాధపడింది ఉదయ్ కిరణ్తో చేయాల్సిన తొలి సినిమా ఆగిపోయినప్పుడు, ఆ తర్వాత `భాయ్` రిజల్ట్ కి అన్నారు. ఆ సమయంలో తాను చాలా డిప్రెషన్లోకి వెళ్లినట్టు చెప్పారు వీరభద్రం చౌదరి. తర్వాత ఏడాది కష్టపడి చేస్తే `చుట్టలబ్బాయి` వచ్చిందన్నారు. ఇప్పుడు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన `దిల్వాలా` అనే సినిమాని తీస్తున్నారు.