ఎనిమిది నెలల్లో.. పది మందికిపైగా నటుల ఆత్మహత్య
ప్రేమ విఫలం.. అవకాశాలు లేకపోవడం.. వేధింపులు.. మానసిక ఒత్తిడి.. మోసం చేయడం.. ఆర్థిక ఇబ్బందులు.. ఇలా కారణాలేమైనా..ఇటీవల సినీ, టీవీ ఆర్టిస్టులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడ్డ దక్షిణాది భాషలకు చెందిన నటులతోపాటు హిందీ వంటి ఉత్తరాదికి చెందిన నటులెవరో చూద్దాం.
ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిపై ప్రధానంగా ఆరోపణలున్నాయి. డ్రగ్స్ మాఫియా, మానసిక ఒత్తిడి, మనీ లాండరింగ్ వంటి కోణాలతోపాటు ఆయనది ఆత్మహత్యనా? హత్యనా అనే కోణంలో సిబిఐ ఈ కేసు విచారణ జరుపుతుంది. ప్రస్తుతం ఇది బాలీవుడ్లో పెద్ద దుమారం రేపుతుంది. ఆయన జూన్ 14న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మూడు రోజుల క్రితం తెలుగు సీరియల్ నటి, `మనసు మమత`,`మౌనరాగం` సీరియల్ ఫేమ్ కొండవల్లి శ్రావణి ఈ నెల 8న హైదరాబాద్లోని తన ఫ్లాట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. టిక్టాక్ ద్వారా పరిచయం అయిన దేవరాజ్ అనే యువకుడు తనని ప్రేమించి మోసం చేశాడనే, తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ డబ్బులాగుతున్నాడని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
హిందీకి చెందిన పాపులర్ బుల్లితెర నటుడు సమీర్ శర్మ ఆగస్ట్ 6న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని తన అపార్ట్ మెంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆయన రెండు రోజులు క్రితమే మరణించినట్టు పోలీసులు భావించారు. సమీర్ ఆత్మహత్యకు గల కారణాలు మానసిక ఒత్తిడే అని తెలుస్తుంది. పూర్తి కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. ఆయన `కహానీ ఘర్ ఘర్ కీ`, `మే రిష్తే హై ప్యార్ కే`, `లెఫ్ట్ రైట్ లెఫ్ట్`, `ఏక్ బార్ ఫిర్` వంటి సీరియల్లో నటించారు.
కన్నడ నటుడు, ఫిట్నెస్ ట్రైనర్ సుశీల్ గౌడ కూడా జులైలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నాటక లోని మాధ్యలోగల తన గ్రామం ఇందువలులో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుశీల్ గౌడ ఆత్మహత్యకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఆయన సినిమాలతోపాటు, పలు సీరియల్స్ లో కూడా నటించారు.
ముంబయికి చెందిన టీవీ నటి సెజల్ శర్మ ఈ ఏడాది జనవరి 25న ఆత్మహత్యకు పాల్పడింది. `దిల్తో హ్యాపీ హై జీ`తో గుర్తింపు తెచ్చుకున్న సెజల్ శర్మ తన జీవితంలో చోటు చేసుకున్న అనుకోని సంఘటన వల్ల ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ప్రస్తుతం సెజల్ వర్మ కేసు కూడా విచారణ దశలో ఉంది.
హిందీ టీవీ నటుడు మన్మీత్ గ్రెవల్ మే 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా వైరస్ విజృంభన వల్ల షూటింగ్లు లేకపోవడం, పైగా అవకాశాలు తగ్గడం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. భార్య ఇంట్లో ఉండగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. దీనిపై ఇంకా విచారణ జరుగుతుంది. ఆయన `ఆదత్ సే మాజ్బూర్, `కుల్దీపక్` వంటి సీరియల్స్ లో నటించారు.
మరాఠి చిత్ర నటుడు అశుతోష్ భక్రే జులై 30న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాందేడ్లోని తన నివాసంలో అశుతోష్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మానసిక ఒత్తిడే కారణమని తెలుస్తుంది. `భాకర్`,`ఇచ్చర్ తర్లా పక్కా` చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన భార మయూరి దేశ్ముఖ్ మరాఠి సినిమాల్లో పాపులర్ నటిగా రాణిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది.
భోజ్పురి నటి అనుపమ పథాక్ సైతం ఇటీవల ముంబయిలో ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఆర్థికంగా, మానసికంగా మోసపోయానని పేర్కొంటూ ఓ వీడియోని ఫేస్బుక్లో పంచుకుని ఆగస్ట్ 8న ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.
తమిళ సినీ, టీవీ నటి పద్మజ మార్చి 2న ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దగా అవకాశాలు రాకపోవడం, భర్తతో గొడవలు వంటి కారణాలతో మానసికంగా కృంగిపోయిన పద్మజ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. దీనిపై కూడా విచారణ జరుగుతుంది. తమ సోదరిమణులకు ఆమె పంపిన వీడియో పెద్ద దుమారం సృష్టించింది.
బెంగుళూరుకు చెందిన కన్నడ నటి చందన మే 28న ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరులోని తన నివాసంలో విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దినేష్ అనే వ్యక్తిని ప్రేమించి మోసపోయాననే కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. వీరితోపాటు గుంటూరుకు చెందిన మాజీ నటి మద్దెల సబీరా సినిమా అవకాశాలు లేకపోవడంతో జులై 23న సూసైడ్ చేసుకున్నారు. ఇటీవల కేవలం ఈ ఎనిమిది నెలల్లోనే పది మందికిపైగా నటులు ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరం. అందులో కరోనా ఓ కారణంగా కావడం మరింత బాధాకరం.