జూ.ఎన్టీఆర్ తో భేటీ అయిన మంత్రి పువ్వాడ అజయ్.. ఆ రోజు గ్రాండ్ గా, ఫ్యాన్స్ కి కనుల పండుగే
మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి పురస్కరించుకుని ప్రస్తుతం శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి పురస్కరించుకుని ప్రస్తుతం శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.
బాలకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడలో శతజయంతి వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణాలో కూడా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 28న భారీ ఎత్తున ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక జరగనుంది.
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మరికొందరు ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మంలో ఎన్టీఆర్ 56 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 28న లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు.
ఈమేరకు తారక్ ని ఆహ్వానించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ తాజాగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో సుమారు రూ 4 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనికోసం మంత్రి పువ్వాడ అజయ్, ఎన్నారైలు, ఎన్టీఆర్ అభిమానులు సమకూర్చినట్లు తెలుస్తోంది.
ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ లో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని తారక్ ప్రారంభించనున్నారు. భారీగా అభిమానులతో కనుల పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ కి ఆహ్వానం అందలేదు. దీనితో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కానీ తెలంగాణ మంత్రి స్వయంగా వచ్చి ఎన్టీఆర్ ని ఆహ్వానించడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీతో హైదరాబాద్ లో మే 28న ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.