కరోనా కన్నా ప్రమాదకర సంగీతం.. నాగబాబు సెటైర్ బాలయ్య మీదేనా?
సీనియర్ నటుడు నాగబాబు ఇటీవల తరుచూ వివాదాల్లో తలదూరుస్తున్నాడు. జనసేన నేతగా కూడా యాక్టివ్గా ఉన్న నాగబాబు.. సినిమా విషయాలతో పాటు రాజకీయాల మీద కూడా కౌంటర్లు వేస్తున్నాడు. ఇటీవల బాలకృష్ణను ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున బరిలో నిలిచిన మెగా బ్రదర్ ఎన్నికల్లో దారుణమైన ఓటమి ఎదురు కావటంతో కొంత కాలం పాటు సైలెంట్ అయ్యాడు. ఆ తరువాత ఈ మధ్యే తిరిగి వార్తల్లో కనిపిస్తున్నాడు.
ఆర్థికంగా దెబ్బతిన్న నాగబాబును ఈటీవీ జబర్దస్త్ షో ఎంతో ఆదుకుంది. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చి షో నిర్వహకులపై విమర్శలు చేయటంతో నాగాబాబు మీద కూడా భారీగా విమర్శలు వినిపించాయి. షోలో ఉన్నంత కాలం ఏం మాట్లాడకుండా మరో అవకాశం రాగానే ఇలాంటి మాట్లాటం సరికాదన్న వాదన వినిపించింది.
ఆ తరువాత గాడ్సే జయంతి సందర్భంగా ఆయన్ను పొగుడుతూ నాగబాబు చేసిన కామెంట్స్ తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. నాగబాబు గాంధీని అవమానించాడంటూ కాంగ్రెస్ వర్గాలు విమర్శలు చేశాయి. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని నాగబాబు చెప్పిన ఎవరూ పట్టించుకోలేదు.
దానికి కొనసాగింపుగా కరెన్సీ నోట్ల మీద భగత్సింగ్, సుభాస్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వారి ఫోటోలను కూడా చూడలనుందంటూ మరో వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చాడు. దీంతో ఈ మధ్యకాలంగా నాగబాబు పేరు గట్టిగానే వార్తల్లో వినిపించింది.
అన్నింటికి మించి చిరంజీవి ఇంట్లో మీటింగ్పై బాలయ్య కామెంట్స్, దానికి కౌంటర్గా నాగబాబు రిలీజ్ చేసి వీడియో ఓ రేంజ్లో ప్రకంపనలు సృష్టించాయి. ఏకంగా బాలయ్యకు నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇవ్వటం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది.
అయితే తాజాగా మరోసారి బాలయ్యను నాగబాబు టార్గెట్ చేశాడన్న అభిప్రాయం వ్యక్తం మవుతోంది. బుధవారం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ మంగళవారం ఓ పాటను రిలీజ్ చేశాడు. తన తండ్రి నటించిన క్లాసిక్ సాంగ్ శివ శంకరీ పాటను తాను స్వయంగా ఆలపించి రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ పాటపైనే నాగబాబు సెటైర్ వేసినట్టుగా భావిస్తున్నారు.
ఈ రోజు ట్వీటర్ వేదికగా నాగబాబు ఓ కామెంట్ చేశాడు. కరోనా జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం సర్క్యూలేట్ అవుతుందిరా అయ్యా. జాగ్రత్తరా అయ్యా.. దండం పెడతాను... అయ్యబాబోయ్ చిన్న పిల్లలని ఓల్డ్ ఏజ్ వాళ్ళని,హెల్త్ బాగలేని వాళ్ళని సంగీతం వినకుండా చూసుకోండి. విన్నారంటే ఏదేన జరగొచ్చు... అయినా ఎందయ్యా ఇది.. ఇది నేను చూళ్లే..ఎక్కడ ఇనలే` అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు.
అయితే తరువాత ఏం జరిగిందో ఏమోగాని ట్వీట్ చేసిన గంటకే ఆ ట్వీట్ను తన పేజ్ నుంచి డిలీట్ చేశాడు నాగబాబు. అయితే అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజెన్లు ఇప్పుడు ఆ కామెంట్ను తెగ వైరల్ చేస్తున్నారు.