- Home
- Entertainment
- కీర్తి సురేష్ని పట్టుకుని మహేష్ పొలిటికల్ డైలాగ్.. జగన్పై సెటైరా?.. కొత్త రచ్చ షురూ?
కీర్తి సురేష్ని పట్టుకుని మహేష్ పొలిటికల్ డైలాగ్.. జగన్పై సెటైరా?.. కొత్త రచ్చ షురూ?
మహేష్బాబు నటించిన `సర్కారు వారి పాట` చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. ఇందులో మాస్, క్లాస్ డైలాగ్లతో మోతమోగించాడు మహేష్. అయితే ఓ పొలిటికల్ డైలాగ్ మాత్రం ఇప్పుడు రచ్చ లేపుతుంది.

మహేష్బాబు(Maheshbabu) హీరోగా, కీర్తిసురేష్(Keerthy Suresh) కథానాయికగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata). పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదలైంది. ట్రైలర్ మాస్, క్లాస్ టచ్తో సాగుతూ దుమ్మురేపుతుంది. మహేష్ మరోసారి విశ్వరూపం చూపించారు. తనపై తనే సెటైర్లు వేసుకుంటూ రెచ్చిపోయారు. మరోవైపు పొలిటికల్ సెటైర్లు కూడా పెల్చాడు. దీంతోపాటు చివర్లో ఆయన చెప్పిన శోభనం డైలాగ్ సైతం దుమారం రేపుతుంది.
అయితే `సర్కారు వారి పాట`(SVP Trailer) ట్రైలర్లో హీరోయిన్ కీర్తిసురేష్ని ఉద్దేశించి `నేను విన్నాను.. నేను ఉన్నాను` అనే డైలాగ్ కొట్టారు. ఈ డైలాగ్పై ఇప్పుడు రచ్చ స్టార్ట్ అయ్యింది. పొలిటికల్ రంగు పులుముకుంటోంది. ఈ డైలాగ్ పాదయాత్ర సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) కొట్టిన డైలాగ్. పాదయాత్రలో భాగంగా జనం బాధలు తాను విన్నానని, వాళ్లకి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చే ఉద్దేశంలో ఆయన `నేను విన్నాను, నేను ఉన్నాను` అనే డైలాగ్ కొట్టారు.
అంతకు ముందు ఈ డైలాగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాడినట్టుగా ప్రచారం జరిగింది. వైఎస్ రాజశేఖర్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన `యాత్ర` చిత్రంలోనూ దర్శకుడు మహి వి రాఘవ ఈ డైలాగ్ని పెట్టారు. అందులో నటించిన మమ్ముట్టి చేత ఈ డైలాగ్ చెప్పించడంతో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఆ డైలాగ్ని `సర్కారు వారి పాట`లో మహేష్ చెప్పడం దుమారం రేపుతుంది.
హీరోయిన్ కీర్తిసురేష్ ముందు మహేష్ ఈ డైలాగ్ చెప్పడమే అనేక అనుమానాలకు తావిస్తుంది. జస్ట్ ఫన్ కోసం అలా చెప్పాడా? లేక జగన్పై మహేష్ సెటైర్లు వేశారా? అనేది ఆరాతీస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే పార్టీల పరంగా ఏపీలో తన బావ(గల్ల జయదేవ్) టీడీపీ. వైఎస్ఆర్ పార్టీకి అపోజిట్. బావ కోసం అప్పట్లో మహేష్ ఎన్నికల ప్రచారం కూడా చేశారు.
మరోవైపు ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ టికెట్ రేట్ల సమస్య పరిష్కారం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో మహేష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ని ఆయన సమస్యని పరిష్కరించాలని వేడుకున్నారు. పాజిటివ్గా మాట్లాడారు.
దీంతో ఇప్పుడు అదే జగన్ చెప్పిన డైలాగ్ని తన సినిమాలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరి దీని వెనకాల ఏదైనా రాజకీయ ఉద్దేశాలున్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ట్రైలర్లో మహేష్ తనపైన తానే సెటైర్లు వేసుకున్నారు. తన ఏజ్ ఇంకా తక్కువగా కనిపిస్తుందని, పెళ్లి వయసు రాలేదని, అంతా అలానే చూస్తున్నారని చెప్పారు. తన గ్లామర్ని మెయింటేన్ చేయడం దూల తీరిపోతుందని తనపై గట్టి సెటైర్ వేసుకున్నాడు మహేష్.
ఇదే కాదు చివర్లో కొన్ని బూతు డైలాగులు కూడా పెట్టారు. `వంద వయాగ్రాలు వేసుకుని శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికొచ్చినట్టు వచ్చారు` అంటూ యాక్షన్ ఎపిసోడ్లో చెప్పే డైలాగ్ సైతం దుమారం రేపుతుంది. మహేష్ నుంచి ఇలాంటి డైలాగ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి దీన్ని ఫ్యాన్స్, జనరల్ ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.