మా బిల్డింగ్ వివాదం.: రూ. 60లక్షలు అవకతవకలు? నేరం కొన్న నాగబాబుదా? అమ్మిన నరేష్ దా?
టాలీవుడ్ లో కొంతమంది నటులు వర్గాలు ఏర్పడి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. క్రమశిక్షణా సంఘాన్ని, ఇండస్ట్రీ పెద్దలను ఖాతరు చేయకుండా ఎవరికి వారు బహిరంగంగా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ, 'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు.
తాజాగా నాగబాబు చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి తెరలేపాయి. 2017లో మా బిల్డింగ్ అమ్మకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మా ఎన్నికలు నేపథ్యంలో పరిశ్రమ పెద్దల మధ్య కాన్ఫిడెన్షియల్ గా జరిగిన జూమ్ మీటింగ్ లో మోహన్ బాబు, గతంలో ఉన్న మా బిల్డింగ్ ఎందుకు అమ్మేశారని సీరియస్ అయ్యారు.
మోహన్ బాబు జూమ్ మీటింగ్ వీడియో ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. మోహన్ బాబు వ్యాఖ్యలకు నాగబాబు ఈ విధంగా స్పందించారు. ఎవడో గొట్టం గాడు అడిగితే నేను స్పందించే వాడిని కాదు, మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి అడిగారు కాబట్టి వివరణ ఇవ్వాల్సి వస్తుంది అంటూ.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
2007లో మా అధ్యక్షుడిగా ఉన్న నేను, మా బిల్డింగ్ కొనుగోలు చేయడం జరిగింది. బిల్డింగ్ కొనడం, ఇంటీరియర్ డిజైనింగ్, మరి కొన్ని ఖర్చులతో కలిపి రూ. 90లక్షల వరకు మా బిల్డింగ్ కోసం ఖర్చు చేసినట్లు నాగబాబు తెలిపారు.
maa elections
2017లో శివాజీ రాజా అధ్యక్షుడిగా, నరేష్ సెక్రెటరీగా ఉన్నారు. ఆ సమయంలో కేవలం రూ. 30లక్షలకు మా బిల్డింగ్ అమ్మివేశారు. అసలు ధర కంటే అది చాలా తక్కువ రేటు. అంచనా వేసిన ధరకంటే రూ. 60 లక్షలు తక్కువకు ఎందుకు మా బిల్డింగ్ అమ్మారో... నరేష్, శివాజీ రాజాలను మోహన్ బాబు అడిగాలని, 14ఏళ్ళ క్రితం అధ్యక్షుడిగా ఉన్న నన్ను టార్గెట్ చేస్తే, పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
నాగబాబు ఇదే వీడియోలో... బిల్డింగ్ ప్రస్తుత ధర గురించి మాట్లాడుతూ... కేవలం స్థలం వాల్యూ రూ.1.4 కోట్లు అంటూ అంచనా వేశారు. నాగబాబు వ్యాఖ్యల నేపథ్యంలో 2017లో అధ్యక్షుడిగా ఉన్న నరేష్ స్పందించారు.
అమ్మింది బిల్డింగ్ కాదని, కేవలం ప్లాట్ మాత్రమే అన్నారు. డైరెక్టర్స్, రైటర్స్ అసోసియేషన్స్ ఉన్న బిల్డింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ప్లాట్, ఫెంట్ హౌస్. దానికి సరిగా అద్దెలు రావడం లేదు. సింగిల్ వాల్ హౌస్, అలాగే పక్కనే మురుగు కాలువ కావడంతో ఆర్టిస్ట్స్ ఇబ్బంది పడేవారు. దీనితో ఆ ఫ్లాట్ అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నాం.
పేపర్లో అనేక ప్రకటనలు ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు రూ.30 లక్షలకు అసోసియేషన్ కోసం ఎంతో కాలం శ్రమించిన పరిశ్రమకు చెందిన వ్యక్తికే దానిని విక్రయించడం జరిగింది. వర్షం పడితే ఆ హౌస్ లోకి నీళ్లు వస్తాయి. నాగబాబు ఇంజనీర్ కాదు కదా.. ఆయన తెలియక కొన్నారు. ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వెళ్లి చూడండి. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను అడిగండి. ఇంకా దీని గురించి ఏదైనా సందేహాలు ఉంటే, మా అసోసియేషన్ కి వెళ్లి అక్కడ వివరాలు తీసుకొని మాట్లాడండి. నాగబాబు ఎంత ట్రాన్స్పరెంట్ గా కొన్నారో, అంతే ట్రాన్స్పరెంట్ గా మేము అమ్మాము. సెక్రటరీగా ఉన్న నరేష్ రిజిస్ట్రేషన్ సైన్ చేశారని వివరణ ఇచ్చారు.
ఆ బిల్డింగ్/ప్లాట్ కొన్న నాగబాబు, అమ్మిన శివాజీ రాజా వ్యాఖ్యలు గమనిస్తే... రూ. 60లక్షల అవకతవకలు జరిగినట్లు అర్థం అవుతుంది. అంటే 2007లో ఆ ప్రాపర్టీ మార్కెట్ రేటు కంటే అధిక ధరకు నాగబాబు కొని ఉండాలి. ఎందుకంటే 2007లో 70లక్షలకు వెచ్చించి కొన్న ప్రాపర్టీని 2017లో రూ. 30లక్షలకు కూడా ఎవరూ కొనడానికి ముందు రాలేదంటే, సందేహం కలుగుతుంది.
అది నిజం కానీ పక్షంలో లోపాయకారి ఒప్పందంపై మార్కెట్ రేటు కంటే అతి తక్కువ ధరకు శివాజీ రాజా, నరేష్ ఓ వ్యక్తికి కేవలం రూ. 30లక్షలకే ఆ ప్రాపర్టీ కట్టబెట్టి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ లో నిజం ఏదైనా ఆ బిల్డింగ్ కొనుగోలు లేదా అమ్మకం విషయంలో రూ. 60లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇంకా ఎన్నికలకు నెల రోజుల సమయం ఉంది. ఈ వ్యవధిలో మా బిల్డింగ్ వివాదం ఎన్ని మలుపులు తీసుకోనుందో, ఎందరిని ఈ ఊబిలోకి లాగనుందో చూడాలి. అసలు మోహన్ బాబు నాగబాబు పేరు చెప్పుకున్నా, ఆయన ఈ వివాదం తెరపైకి తెస్తూ, వీడియో చేశారు.