ఎన్టీఆర్ పెట్టిన కండీషన్ను బ్రేక్ చేసిన కైకాల సత్యనారాయణ... ‘దాన వీర శూర కర్ణ’ సమయంలో...
Kaikala Satyanarayana: తెలుగు సినిమాను మూడు దశాబ్దాలకు పైగా మకుటం లేని మహారాజుగా ఏలిన నటుడు సీనియర్ ఎన్టీఆర్. ఆయన ఏదైనా సినిమా తీస్తే, అందులో నటించే నటుల విషయంలో కూడా రూల్స్, కండీషన్స్ పెట్టేవారు. వాళ్లంతా వాటిని తూ.చ. తప్పకుండా ఆచరించాల్సిందే. అయితే కైకాల సత్యనారాయణ మాత్రం ఓసారి ఎన్టీఆర్ పెట్టిన రూల్ను అతిక్రమించారు...
తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ దర్శక నిర్మాతగా, త్రిపాత్రాభినయం చేస్తూ రూపొందించిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకి ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది...
ఆ సినిమా సమయంలోనే, ‘సూపర్ స్టార్’ కృష్ణ, శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో ‘కురుక్షేత్రం’ అనే సినిమా కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి తెరకెక్కడంతో నటీనటుల విషయంలో కాల్షీట్ల సమస్య తలెత్తింది...
దీన్ని ముందుగానే అంచనా వేసిన సీనియర్ ఎన్టీఆర్, ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో నటించే నటీనటులెవ్వరూ, ‘కురుక్షేత్రం’లో నటించకూడదని షరతు విధించారు...
అంతేకాదు, ‘దాన వీర శూర కర్ణ’ సినిమా షూటింగ్ అయినంత కాలం ఏ నటుడూ కూడా మాంసాహారం తినకూడదు. మదాల రంగారావును అర్జునుడి పాత్ర కోసం ఎంచుకున్నారు ఎన్టీఆర్...
అయితే ‘ఎర్రమల్లెలు’, ‘స్వరాజ్యం’ వంటి కమ్యూనిస్ట్ సినిమాల్లో నటించిన మదాల రంగారావు, మాంసాహారాన్ని వదిలేయడానికి అంగీకరించలేదు.
దీంతో ఆయన స్థానంలో నందమూరి హరికృష్ణను అర్జునుడిగా నటింపచేశారు ఎన్టీఆర్.. తాను పెట్టిన రూల్స్ అండ్ కండీషన్స్ విషయంలో అంత నిక్చచ్ఛిగా ఉండేవారు రామారావు...
అయితే కైకాల సత్యనారాయణ అప్పటికే ‘కురుక్షేత్రం’ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. దాంతో ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో నటించాలా? వద్దా? అనే సంశయించారు కైకాల సత్యనారాయణ.
అయితే కైకాల సత్యనారాయణ వంటి నటుడిని వదులుకోవడం ఇష్టం లేని ఎన్టీ రామారావు, ఆయనకి మాత్రం రెండు సినిమాల్లోనూ నటించేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే ఆయనతో పాటు సీ నారాయణ రెడ్డి, గుమ్మడి వెంకటేశ్వర్ రావులు కూడా రెండు సినిమాల్లో నటించారు...
కేవలం 43 రోజుల్లో నిర్మించిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో భీముడిగా నటించిన కైకాల సత్యనారాయణ, కృష్ణ, శోభన్బాబు నటించిన ‘కురుక్షేత్రం’ సినిమాలో దుర్యోదనుడి పాత్రలో కనిపించారు..
‘దానవీర శూర కర్ణ’ టాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఒకటిగా నిలవగా, ‘కురుక్షేత్రం’ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అనుకున్న బడ్జెట్ దాటిపోవడంతో నిర్మాత అంజనేయులు, ‘కురుక్షేత్రం’ సినిమాను మధ్యలోనే నిలిపివేయాలని భావించారు. అయితే సినిమాను పరువు సమస్యగా తీసుకున్న కృష్ణ, నిర్మాతగా మారి, ‘కురుక్షేత్రం’ మూవీని పూర్తి చేయించారు.
1977, జనవరి 14న ఒకే రోజున రెండు భారీ బడ్జెట్ సినిమాలు ‘దాన వీర శూర కర్ణ’, ‘కురుక్షేత్రం’ విడుదల కాగా, ఈ రెండింట్లోనూ సత్యనారాయణ చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది..