జయప్రకాష్ రెడ్డి జీవితంలో ఆసక్తికర విశేషాలు..
జయప్రకాష్ రెడ్డి విలక్షణ నటుడిగా టాలీవుడ్లో చెరగని ముద్ర వేసుకుని ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయన గుండెపోటుతో మరణించడంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ దుఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా జయప్రకాష్రెడ్డి జీవితంలోని పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.
జయప్రకాష్ రెడ్డి నటుడు కావడానికి తండ్రి సాంబిరెడ్డినే కారణం. `దున్నపోతుల్లాగా అడ్డగాడిదల్లాగా తిరగక పోతే ఏదైనా మంచి నాటకం రాసి రిహార్సల్ చేసుకోవచ్చుగా` మందలించడంతో తాన నటకాలపై దృష్టి పెట్టానని జయప్రకాష్ రెడ్డి తెలిపారు. నట జీవితానికి వాళ్ళ నాన్నే ఆదర్శమట.
నాటకాల్లో `రుద్రమదేవి` నాటకంలో అంబదేవుడు ఆయన పోషించిన తొలి పాత్ర. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్లో `స్టేజీ రాచరికం` అనే నాటకంలో చెలికత్తే వేషం వేశారు. అందుకుగానూ ఉత్తమనటిగా బహుమతి రావడం విశేషం.
గుంటూరు మున్సిపల్ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉద్యోగం చేసేటప్పుడు ఆయన్ని డ్రిల్లు మాస్టారు అనుకునేవాళ్ళట.
సినిమాల్లోకి ఎంటర్ కావడానికి నల్గొండలో వేసిన `గప్చుప్` నాటిక బీజం వేసిందట. ఆ నాటకం చూసిన దాసరి నారాయణరావు.. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు పరిచయం చేశారు.
రామానాయుడికి జయప్రకాష్ రెడ్డి నాటకం నచ్చడంతో `బ్రహ్మాపుత్రడు` సినిమాలో పోలీస్ వేషం ఇచ్చారు. సినిమాల్లో తొలిపాత్ర పోలీస్ వేషం కావడం విశేషం. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా పోలీసే.
మొదట్లో ఎన్ని సినిమాలు చేసినా ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవట. ఇతరులు, స్నేహితుల వద్ద అప్పుచేసేవాడట. మానేసిన టీచర్ ఉద్యోగం మళ్ళీ ప్రారంభించి, ఉదయాన్నే ట్యూషన్లు కూడా చెప్పేవారట. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు.
మళ్ళీ రామానాయుడుగారే ఆఫర్ చేశారట. కానీ జయప్రకాష్ రెడ్డి కాదనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తప్పని పరిస్థితుల్లో రామానాయుడిని కలవగా, వెంకటేష్ హీరోగా రూపొందిన `ప్రేమించుకుందాం రా` చిత్రంలో హీరోయిన్ తండ్రిగా, ఫ్యాక్షినిస్ట్ పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్రకి మొదటగా బాలీవుడ్ నటులు అమ్రిష్పురి, నానా పటేకర్లని అనుకున్నారట. ఈ సినిమా జయప్రకాష్ రెడ్డి జీవితాన్నే మలుపు తిప్పింది. ప్యాక్షన్ విలన్గా టాలీవుడ్లో స్థిరపడి పోయేలా చేసింది. అంతేకాదు రాయలసీమ యాసకి వన్నె తెచ్చేలా చేసింది.
జయప్రకాష్ రెడ్డికి కామెడీ చేయడం ఇష్టమట. ఆయన హాస్యం పండించిన తొలి చిత్రం `జంబలకిడిపంబ`. దీంతోపాటు `జంబలకిడి పంబ`, `చిత్ర భళారే విచిత్రం`, `నీకోసం`, `రెడీ`, `డీ`, `ఆనందం` చిత్రాల్లో కామెడీ విలన్గా ఆకట్టుకున్నారు.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్గా, కమెడీయన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం జయప్రకాష్రెడ్డి స్టయిల్. తమిళంలో ఆరు, కన్నడలో ఆరు సినిమాల్లో నటించారు.
`బ్రహ్మ పుత్రుడు`, `బొబ్బిలిరాజా`, `ప్రేమఖైదీ`, `ప్రేమించుకుందాం రా`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు`, `జయం మనదేరా`, `విజయరామరాజు`, `చెన్నకేశవరెడ్డి`, `పలనాటి బ్రహ్మనాయుడు`, `నిజం`, `సీతయ్య`, `ఛత్రపతి`, `కిక్`, `నమో వెంకటేశాయా`, `ఊసరవెల్లి`, `బిందాస్`, `గబ్బర్ సింగ్`, `నాయక్`, `బాద్షా`, `రేసుగుర్రం`, `మనం`, `పటాస్`, `టెంపర్`, `సరైనోడు`, `ఖైదీ నెం.150`, `జై సింహా`, `రాజా ది గ్రేట్` వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. చివరగా ఆయన `సరిలేరు నీకెవ్వరు`లో మెరిసారు.
రామ్చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన `బ్రూస్లీ`లో ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
జయప్రకాష్ రెడ్డి నిర్మాతగానూ మారారు. ఆయన ధవళ సత్యం దర్శకత్వంలో ఏకపాత్రాభినయం చేస్తూ `అలెగ్జాండర్` అనే చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రంగస్థల నటుడిగా నాకు నాటకాలంటే ప్రాణం. అదే నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చింది. నటుడిని చేసింది. వన్ మ్యాన్ షో చేయాలని రచయిత పూసలకు చెప్పగా, ఆయన అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. వంద నిమిషాల నిడివితో కూడిన కథతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 66 ప్రదర్శనలు ఇచ్చాన`ని తెలిపారు.