దేవుడి వల్లనే నేరాలు, పెద్ద దేవాలయాల్లో స్కామ్ లు...వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పూరి
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మతం, దైవం అనే విషయాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడే అన్ని నేరాలకు కారణం అన్న పూరి దేవాలయాలలో స్కామ్ లు జరుగున్నాయి అన్నారు . మతానికి, దైవానికి వ్యతిరేకంగా పూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏదైనా కొత్తగా చేయాలనే పూరి జగన్నాధ్ నిజంగా కొత్తగా ఫిలాసఫీ వినిపిస్తున్నాడు. మ్యూసింగ్స్ పేరుతో ఆయన వినిపిస్తున్న సూక్తులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అదే సమయంలో కొన్ని వివాస్పదం కూడా అవుతున్నాయి. .
పేదవాడికి ఓటు హక్కు ఉండకూడదన్న ఆయన, తన బాగోగులు తాను చూసుకోలేనివాడికి నాయకుడిని నిర్ణయించే హక్కు లేదన్నారు. అలాగే దేశంలో రిజర్వేషన్ ఎత్తివేయాలని, సంక్షేమ పథకాలు ఆపివేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్ని సోమరులను చేస్తున్నాయన్న అర్థంలో ఆయన చెప్పగా దళిత సంఘాలు మండిపడ్డాయి.
తాజాగా ఆయన తన మ్యూసింగ్స్ ద్వారా దేవుడు, మతం అనే విషయాన్ని చర్చించారు. చాల దేశాలలో ప్రజలు మతాన్ని వదిలేస్తున్నారు అన్నారు. మతాన్ని సీరియస్ గా తీసుకోని దేశాలలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది. కానీ దేవుడిని సీరియస్ గా నమ్మే దేశాలలో నేరాల రేటు ఎక్కువగా ఉందని చెప్పారు.
మన ఇష్టదైవం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాడిని చంపేయాలని అనిపిస్తుంది. అంటే దేవుడనే భావన మనిషిని రాక్షసుడ్ని చేస్తుంది. యుద్ధాలలో కంటే మత ఘర్షణల వలనే ఎక్కువ మంది చనిపోయారని చెప్పారు.
ఇక గుడికి వెళ్లే వాళ్లంతా మనశ్శాంతి కోసం వెళతారు. అంటే వాళ్లకు మనశ్శాంతి లేదని అర్థం. అనేక కోరికకలు కోరుకుంటారు. అసలు నేరాలు కూడా దేవుడు వలనే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద దేవాలయాలలో స్కాములు జరుగుతున్నాయి అన్నారు.
నిజంగా దేవుడు మిమ్ముల్ని కాపాడడానికే పుట్టాడు అనుకుంటే ఆయన పని ఆయనను చేసుకోనివ్వండి. మీరు దేవుడ్ని పట్టించుకోక పోతే ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతాడు, కావాలంటే ఓ సారి ట్రై చేయండి అన్నారు. మీ పని మీరు చేసుకుంటూ ఆయన్ని డిస్టర్బ్ చేయకండి. పనే దైవం అని పూరి ముగించారు.