దిల్రాజు గెలకడం వల్లే `జవాన్` పోయింది.. దర్శకుడు బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు..
రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి.. తాజాగా `జవాన్` సినిమా రిజల్ట్ పై స్పందించారు. నిర్మాత దిల్రాజు పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కారణంగా సినిమా పోయిందని వ్యాఖ్యానించారు.
రైటర్గా పేరుతెచ్చుకున్న బీవీఎస్ రవి దర్శకుడిగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గోపీచంద్ హీరోగా నటించిన `వాండెట్` చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన ఆ సినిమాతో పరాజయాన్ని చవిచూశారు. అనంతరం సాయిధరమ్ తేజ్తో `జవాన్` సినిమాని తీశారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా `జవాన్` ఫెయిల్యూర్పై ఆయన రియాక్ట్ అయ్యారు. ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి మాట్లాడుతూ, షాకింగ్ కామెంట్స్ చేశారు.
దిల్రాజు కారణంగా సినిమా పోయిందన్నారు. ఆయన సినిమాని గెలికాడని, కలగూర గంపలాగా చేశాడని, దీంతో సినిమా రూపు రేఖలే మారపోయాయని తెలిపారు. ఆయన చెబుతూ, దిల్రాజుకి ఫ్యామిలీ సబ్జెక్ట్ లపై పట్టుంది, కానీ థ్రిల్లర్స్, యాక్షన్, హర్రర్ సినిమాలపై అంతగా పట్టులేదని చెప్పారు. `జవాన్` ఫస్ట్ కట్ సమయంలోనే చూశాడని, అది చూసి సినిమాని మొత్తం మార్చేశారన్నారని చెప్పారు. అక్కడి నుంచి దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు.
ఆయన అంతా చేసి చూడవయ్య అంతా కరెక్ట్ చేసి పెట్టాను, ఫస్టాఫ్ యావరేజ్గా ఉంటుంది, సెకండాఫ్ బాగుంటుందన్నారు. కానీ అంతా ఫస్ట్ ఆఫ్ బాగుంది, సెకండాఫ్ బాలేదంటున్నారని, క్లైమాక్స్ పోయిందంటున్నాని చెప్పా. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే విషయాన్ని బీవీఎస్ రవి తెలిపారు. దిల్రాజు తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, ఆయన దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. ఆయనలో చాల పేషెన్సీ ఉంటుందన్నారు. కానీ `జవాన్` సినిమా రాజుగారు గెలికాడనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
అయితే `జవాన్` ఫ్లాప్కి `ధృవ` కూడా ఓ కారణంగా తెలిపారు. తమ సినిమా కథ, అది దగ్గరగా ఉన్నాయన్నారు. కానీ తమిళ మాతృక `తని ఒరువన్` ట్రైలర్ రాకముందే మా చిత్ర కథని సాయిధరమ్ తేజ్కి చెప్పానని, కానీ అదే సమయంలో 'ధృవ' రీమేక్ చేయడం, మాకు దెబ్బ పడిందన్నారు. అది మా సినిమాకు దగ్గరి పోలికలు వుండటంతో సాయిధరమ్ తేజ్ దానికి ముందు వెళ్లడం మంచిదికాదన్నాడు. నాకు ఫ్యామిలీ ముఖ్యం అని చెప్పడంతో చేసేది లేక ఆలస్యంగా రిలీజ్ చేశాం. అది కూడా పెద్ద మైనస్ అయ్యిందన్నారు బీవీఎస్ రవి.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్గా నటించగా, స్నేహ భర్త ప్రసన్న విలన్గా నటించారు. దిల్రాజు పర్యవేక్షణలో కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే గతేడాది `థాంక్యూ` చిత్రాన్ని రూపొందించారు. దీనికి బీవీఎస్ రవి కథ అందించారు. `శ్రీనివాస కల్యాణం` సక్సెస్ అయి వుంటే 'థాంక్యూ' తనే చేసేవాడని తెలిపాడు. ఆ కారణం వల్లనే ఈ ప్రాజెక్ట్ విక్రమ్ కుమార్ వద్దకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు.