జీరో టు హీరో సుశాంత్ ఇన్సిపిరేషనల్ జర్నీ.. కానీ!
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో దిగ్బ్రాంతి కలిగించింది. కెరీర్ పరంగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. ఆదివారం మధ్యాహ్నం ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు సుశాంత్.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ బీహార్లోని పాట్నాలో 1986 జనవరి 21న జన్మించాడు. చిన్నతనం నుంచి ఎంతో యాక్టివ్గా ఉండే సుశాంత్ చదువులోనూ అందరికంటే ముందే ఉండేవాడు. సుశాంత్ సోదరి మితు సింగ్ రాష్ట్రస్థాయి క్రికెటర్.
చిన్నతనంలో నటుడు కావాలన్న ఆలోచనలేని సుశాంత్ ఇంజనీరింగ్కు సంబంధించి 11 ఎంట్రెన్స్ టెస్ట్ లు రాసి అన్నింటిలోనూ విజయం సాధించాడు. ఫైనల్గా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ జాయిన్ అయ్యాడు.
ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే షైమాక్ దావర్ ఇన్సిస్టిట్యూట్లో డ్యాన్స్ నేర్చుకునేందుకు జాయిన్ అయ్యాడు. డ్యాన్సర్గా మంచి గుర్తింపు వస్తుండటంతో ఆ సమయంలో ఆయన నటన పట్ల ఆసక్తి పెరిగింది. దీంతో బారీ జాన్ డ్రామా క్లాసెస్లోనూ జాయిన్ అయ్యాడు సుశాంత్. అదే సమయంలో యాక్టింగ్ క్లాసెస్లోనూ జాయిన్ అయ్యాడు. ఇలా ఎంతో కష్టపడి నటుడి గుర్తింపు తెచ్చుకున్నాడు.
2005లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంంలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా తొలి పర్ఫామెన్స్ ఇచ్చాడు సుశాంత్. ఆ తరువాత పలు వేదిక మీద డ్యాన్స్ పర్పామెన్స్లు ఇచ్చాడు, అప్పటి వరకు పాట్నాలోనే ఉన్న సుశాంత్ సినిమా అవకాశాల కోసం ముంబైకి మకాం మార్చాడు.
2008లో తొలిసారిగా బాలాజీ టెలిఫిలింస్ నిర్మాణంలో బుల్లితెర మీద అవకాశం వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు టెలివిజన్ రంగంలో పనిచేసిన సుశాంత్ బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. అదే ఇమేజ్తో వెండితెర మీద అడుగుపెట్టాడు సుశాంత్.
2013లో కై పో చే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు సుశాంత్. తొలి సినిమాతో మంచిగుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ తరువాత శుద్ద్ దేశీ రొమాన్స్ సినిమాతో లవర్ భాయ్ ఇమేజ్ అందుకున్నాడు. కెరీర్లో పీకే, కేథార్నాథ్, చిచోరే, లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. సుశాంత్ నటించిన దిల్ బెచర సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ధోని బయోపిక్ సుశాంత్ కెరీర్నే మలుపు తిప్పిన సినిమా. ఈ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు సుశాంత్. అయితే ఆ తరువాత అదే ఫాం కొనసాగించటంలో కాస్త తడబడ్డాడు. ఆ ఒత్తిడి కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్న అనుమానాలు కూడా వ్యక్తంమవుతున్నాయి.