బయటపడ్డ త్రివిక్రమ్, సునీల్ పెళ్లిళ్ల వెనుకున్న క్రేజీ సీక్రెట్.. వీరి స్నేహానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి
మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్, కమెడియన్, నటుడు సునీల్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఎంతటి బెస్ట్ ఫ్రెండ్సో తాజాగా మరోసారి నిరూపితమయ్యింది. అందుకు నిదర్శనమే వారి పెళ్లి.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమెడియన్ సునీల్.. బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. ఏ సందర్భం వచ్చినా తమ స్నేహాన్ని బయటపెడుతుంటారు. ప్రారంభంలో కలిసి సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. సరైన కథ వస్తే మళ్లీ సినిమా చేయాలని ఇద్దరూ అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు త్రివిక్రమ్ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సునీల్.. విలన్గా, కమెడియన్గా బలమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తన స్టయిల్లో తాను బిజీగా ఉన్నాడు.
అయితే ఇండస్ట్రీకి రాక ముందు, ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రారంభంలోనూ ఈ ఇద్దరు కలిసే ఉన్నారు. హైదరాబాద్లోని పంజాగుట్ల సమీపంలో ఒకే రూమ్లో ఉన్నారు. చాలా కాలం పాటు ఈ ఇద్దరు అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యారు. ఆ రూమ్లో ఎన్నో బాధలు చూశారు, ఆనందాలు చూశారు. అందుకు గుర్తుగా ఆ రూమ్ని ఇప్పటికీ అలానే ఉంచి రెంట్ కడుతున్నారు. అంత గొప్ప స్నేహం వీరిద్దరిది. అయితే ఆ స్నేహాన్ని పెళ్లి రూపంలోనూ చూపించడం విశేషం.
త్రివిక్రమ్, సునీల్ పెళ్లి కూడా ఒకేసారి జరగడం ఓ విశేషమైతే, ఒకే రోజు, కొన్ని గంటల వ్యవధిలోనే జరగడం మరో విశేషం. అది కూడా హైదరాబాద్లోనే కావడం ఇంకో విశేషం. త్రివిక్రమ్.. 2002లో అక్టోబర్ 11న సాయి సౌజన్యని పెళ్లిచేసుకున్నారు. ఆమె క్లాసికల్ డాన్సర్. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమార్తె. వీరి వివాహం మధ్యాహ్నం శ్రీనగర్ లోని సత్య సాయి నిగమమాగంలో జరిగింది. అప్పుడే త్రివిక్రమ్ `నువ్వే నువ్వే` చిత్రంతో దర్శకుడిగా మారారు.
సరిగ్గా అదే రోజు అక్టోబర్ 11నే సునీల్ వివాహం శృతితో జరిగింది. సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్లోని శిల్పారామం వద్ద గల సైబర్ గార్డెన్లో జరిగింది. వీరి పెళ్లికి కూడా సినీ ప్రముఖులు భారీగానే హాజరయ్యారు. అప్పుడే నటుడిగా నిలబడుతున్నాడు సునీల్. కమెడీయన్గా అలరిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు స్నేహితులు పెళ్లిళ్ల విషయంలోనూ తమ స్నేహాన్ని చాటుకున్నారు. కానీ ఒకరి పెళ్లి మరొకరు చూసుకోలేకపోవడం బాధాకరం.
అయితే ఈ ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిగిందనేది సినీ పెద్దలకు, ముందు జనరేషన్ వాళ్లకి తెలిసే ఉంటుంది. కానీ నేటి తరానికి మాత్రం ఆసక్తికర విషయమనే చెప్పాలి. అందుకే వీరి మ్యారేజ్కి సంబంధించిన ఓ వార్తా క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వార్తా పత్రికలో ఈ ఇద్దరు పెళ్లిళ్ల న్యూస్ని కవర్ చేశారు. దీంతో ఇది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా రాణిస్తున్నారు. చివరగా ఆయన `అల వైకుంఠపురములో` చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం మహేష్బాబుతో `గుంటూరు కారం` సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతికి విడుదల కాబోతుంది. మరోవైపు సునీల్.. కమెడియన్గా స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. అట్నుంచి హీరోగా టర్న్ తీసుకుని మెప్పించారు. మళ్లీ ఇప్పుడు కమెడియన్గా, విలన్ పాత్రలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నెగటివ్ రోల్స్ కి కేరాఫ్గా నిలుస్తున్నాడు. ఇటీవల `జైలర్` చిత్రంలో కామెడీ రోల్ చేశాడు. ఇప్పుడు `మార్క్ ఆంటోనీ`తో ఈ శుక్రవారం రాబోతున్నాడు.