ప్రేక్షక హృదయాల్లో ఆమె స్థానం పదిలం.. అతిలోకి సుందరి జయంతి స్పెషల్
అతిలోక సుందరి అంటే ఆకాశంలో ఉన్న అందాల దేవత. కానీ మనకు మాత్రం అతిలోకి సుందరి శ్రీదేవినే గుర్తొస్తుంది. అందం అంటే ఆమె. అభినయం అన్నా ఆమే. కనువిందు చేసే రూపం ఆమె సొంతం. అబ్బుర పరిచే నటన ఆమె సొంతం. మొత్తంగా వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఆమె ప్రత్యేకత. అతిలోక సుందరికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీదేవి దాదాపు ఐదు దశాబ్దాలపాటు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ని ఓ ఊపు ఊపారు. స్టార్ హీరోలను మించిన పాపులారిటీతో తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగిన శ్రీదేవి యాభై ఏడవ జయంతి నేడు(గురువారం). ఈ సందర్భంగా ఆమె జీవితంలో కొన్ని హైలైట్స్ చూద్దాం.
శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో 1963, ఆగస్టు 13న జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మా యాంగర్ అయ్యప్పన్. 1967లో శివాజీ గణేషన్ నటించిన `కంధన్ కరుణై` చిత్రంతో బాలనటిగా నటించి సినీ రంగ్ర ప్రవేశం చేశారు. `పూమ్ బట్టా` అనే చిత్రంతో ఉత్తమ నటిగా కేరళ స్టేట్ అవార్డుని అందుకున్నారు.
1969లో `కుమారా సాంభవమ్`చిత్రంతో మలయాళంలోకి, 1970లో `మా నాన్న నిర్ధోషి` చిత్రంతో తెలుగులోకి, 1974లో `భక్త కుంబర` చిత్రంతో కన్నడలోకి,1975లో `జూలీ` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రి ఇచ్చింది. హిందీతోపాటు సౌత్ భాషలన్నింటిలోనూ బాలనటిగా మెప్పించింది. బాలనటిగా తెలుగులో దాదాపు పది సినిమాల్లో నటించింది.
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ రూపొందించిన `మూంద్రూ ముడిచ్చు` చిత్రంతో తొలిసారి హీరోయిన్గా మారింది. ఇందులో కమల్హాసన్, రజనీకాంత్ హీరోలు. ఇందులో రజనీకాంత్ కంటే శ్రీదేవి రెమ్యూనరేషనే అధికం. ఈ చిత్రంతో కమల్, శ్రీదేవి కాంబినేషన్ సెట్ కాగా అనేక చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. అప్పట్లో వీరిద్దరిది సూపర్ హిట్ అండ్ క్రేజీ కాంబినేషన్.
భారతీయ సినీ చరిత్రలో ఓ హీరోయిన్కి హీరోలను మించిన స్టార్ డమ్ తీసుకొచ్చిన ఘనత శ్రీదేవికే దక్కుతుంది. దాదాపు అన్ని భాషల్లో అగ్రనటులందరితోనూ ఆడిపాడింది. ఆడియెన్స్ ని కనువిందు చేసింది. ఇక హీరోయిన్గా తెలుగులో దాదాపు 62 చిత్రాల్లో, తమిళంలో 58 చిత్రాల్లో, హిందీలో 63 సినిమాలు, మలయాళంలో 21 చిత్రాలు చేసింది. కన్నడలోనూ ఆరు సినిమాల్లో మెరిసింది. మొత్తంగా ఐదు దశాబ్దాల కెరీర్లో మూడువందలకుపైగా చిత్రాల్లో నటించారు. `మాలిని ఐయ్యర్` అనే టెలివిజన్లోనూ నటించడం విశేషం. `కబూమ్` టీవీ షోకి జడ్జ్ గా, ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కు డైరెక్టర్గానూ వ్యవహరించారు.
అతిలోక సుందరిగా పిలుచుకుంటున్న ఆమెకి అసలు ఆ పేరు వచ్చింది తెలుగు చిత్రం `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రం ద్వారానే కావడం విశేషం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రమిది. ఇది ఇటీవలే ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంది. తాజాగా శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్పందిస్తూ, మా అందరి గుండెల్లో చిరకాలం నీ స్థానం పదిలం` అని తెలిపారు.
బాలీవుడ్ లో నటించిన `చాల్ బాజ్` చిత్రంలోని `నా జానే కహా సే ఆయి హై` సాంగ్లో నటించేటప్పుడు ఆమె 103 జర్వంతో బాధపడుతున్నారు. అయినా సాంగ్ని త్వరగా పూర్తి చేయాలని కష్టమైనా జ్వరంతోనే షూటింగ్లో పాల్గొంది. నటన పట్ల తనకున్న డెడికేషన్ని చాటుకుంది. అంతేకాదు ప్రముఖ హాలీవుడ్ దర్శక,నిర్మాత స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన `జురాసిక్`లో నటించే అవకాశాన్నికూడా వదులుకుంది. 1985 నుంచి 92 మధ్య కాలంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా శ్రీదేవి నిలిచింది.
శ్రీదేవికి అనేక పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. వారిలో హాలీవుడ్ నిర్మాత అశోక్ అమృత్రాజ్ కూడా ఉన్నారు. శ్రీదేవి బాలీవుడ్, బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తితో ప్రేమాయణం సాగించారని, వీరిద్దరు రహస్యంగా పెళ్ళి చేసుకున్నారని వినిపించింది. ఇది పెద్ద దుమారమే రేపింది. చివరికి నిర్మాత బోనీ కపూర్ని 1996 జూన్ 2న వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు ఉన్నారు. జాన్వీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
1993లో రూపొందిన `బాజీగర్` చిత్రంలో తొలుత శ్రీదేవినే హీరోయిన్గా తీసుకున్నారు. ఆమెచే ద్విపాత్రాభినయం చేయిద్దామనుకున్నారు. కానీ అతిలోక సుందరిని విలన్గా నటించిన షారూఖ్ చంపేసే సీన్ ఉంది. దాన్ని అభిమానులు జీర్ణించుకోలేరని భావించిన దర్శకుడు శిల్పాశెట్టి, కాజోల్ని తీసుకున్నారు. అంతేకాదు రేఖ నటించిన అనేక చిత్రాలకు శ్రీదేవి డబ్బింగ్ చెప్పడం విశేషం.
తెలుగులో `పదహారేళ్ళ వయసు`, `కార్తీక దీపం`, `వేటగాడు`, `చుట్టాలొస్తున్నారు జాగ్రత్త`, `సర్దార్ పాపారాయుడు`, `గజదొంగ`, `మోసగాడు`, `ఆకలిరాజ్యం`, `గడసరి అత్త సొగసరి కోడలు`, `గురు శిష్యులు`, `కొండవీటి సింహం`, `ప్రేమాభిషేకం`, `ఇల్లాలు`, `సత్యం శివం`, `త్రిశూలం`, `అనురాగ దేవత`, `బొబ్బిలి పులి`, `జస్టీస్ చౌదరి`, `కృష్ణార్జునులు`, `కృష్ణవతారం`, `అడవి సింహాలు`, `కిరాయి కోటిగాడు`, `తేనే మనసులు`, `పచ్చని కాపురం`, `వజ్రాయుధం`, `ఒక రాధ ఇద్దరు కృష్ణులు`, `ఆఖరి పోరాటం`, `జగదేశ వీరుడు అతిలోక సుందరి`, `క్షణ క్షణం`, `గోవిందా గోవిందా` వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి మెస్మరైజ్ చేసింది.
ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీదేవికి మరణాంతరం జాతీయ అవార్డు వచ్చింది. ఆమె చివరగా నటించిన `మామ్` సినిమాకిగానూ గతేడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని కేంద్ర ప్రభుత్వం అందించింది. దీంతోపాటు అనేక అంతర్జాతీయ అవార్డులు ఆమెని వరించాయి. శ్రీదేవి దుబాయ్లో ఓ హోటల్లో 2018 ఫిబ్రవరి 24న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.