ప్లాన్ బీ కి వెళ్తున్న అల్లు అర్జున్.. నెక్ట్స్ సినిమాలపై ఫోకస్.. `పుష్ప2`ని పక్కన పెట్టినట్టేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు రూట్ మొత్తాన్ని ఛేంజ్ చేయబోతున్నారట. ప్లాన్ బీని ఇంప్లిమెంట్ చేయబోతున్నారట. అందుకే `పుష్ప2` ని పక్కన పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
`పుష్ప`(Pushpa)తో అల్లు అర్జున్(Allu Arjun)కి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు దర్శకుడు సుకుమార్(Sukumar). `పుష్ప` రిజల్ట్ తో నిజంగానే ఐకాన్ స్టార్ అయ్యారు. అంతేకాదు ఆయనకు పాన్ ఇండియా స్టార్ అనేది భోనస్గా వచ్చింది. ఈ సినిమా సంచలన విజయం సాధించి అన్ని వర్గాలను షాక్కి గురి చేసింది. దీంతో ఇప్పుడు `పుష్ప2` కోసం అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
`పుష్ప` మొదటి భాగం విడుదలై ఆర్నెళ్లు పూర్తయ్యింది. ఇంకా రెండో భాగం(పుష్పః ది రూల్) స్టార్ట్ కాలేదు. ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. సుకుమార్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదని, ఇంకా వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. `పుష్ప` సక్సెస్తో రెండో భాగంపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి. బన్నీ మ్యానరిజం ఇండియా దాటిపోయింది. దీంతో అందరిని సంతృప్తి పరచాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సిందే.
`ఆర్ఆర్ఆర్`, `కేజీఎఫ్2` రికార్డులను బ్రేక్ చేయాలంటే ఇప్పట్లో కేవలం `పుష్ప 2` వల్లే అవుతుందని అంతా నమ్ముతున్నారు. బాలీవుడ్ సైతం `పుష్పః ది రూల్`పై అంచనాలు పెట్టుకుంది. నార్త్ ఆడియెన్స్ చాలా ఆశిస్తున్నారు. అందుకోసమే సుకుమార్ కథలో చాలా మార్పులు చేస్తున్నారని, లార్జ్ స్కేల్లో స్క్రిప్ట్ ని మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ని కూడా డబుల్ చేశారట. అందుకే రెండో భాగం విషయంలో మరింత కేర్, టైమ్ తీసుకుంటున్నారట. బన్నీ కూడా ఈ విషయంలో సుకుమార్ని ఫోర్స్ చేయడం లేదని సమచారం.
ఇదిలా ఉంటే `పుష్ప2` స్క్రిప్ట్ ఫైనలైజ్ కావడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉందని, బన్నీ మరో నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐకాన్ స్టార్ ప్లాన్ బీని ఇంప్లిమెంట్ చేస్తున్నారని సమాచారం. ప్లాన్ ఏ `పుష్ప2` పూర్తి చేసుకుని వచ్చే హిట్, క్రేజ్, ఇమేజ్ తర్వాత ఆ స్థాయిలో నెక్ట్స్ సినిమాని ప్లాన్ చేసుకోవాలనుకున్నారట. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. దీంతో ప్లాన్ బీకి వెళ్తున్నట్టు సమాచారం.
బన్నీ ప్లాన్ బీ ప్రకారం `పుష్ప2` వర్క్ పూర్తయ్యే లోపు మధ్యలో మరో సినిమా చేయాలనుకుంటున్నారట. ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. బన్నీ కమిట్మెంట్స్ లో బోయపాటి మూవీ, వేణు శ్రీరామ్, కొరటాల శివ, ఏఆర్ మురుగదాస్, హరీష్ శంకర్, త్రివిక్రమ్(Trivikram) వంటి ప్రాజెక్ట్ లున్నాయి. ఇందులో బోయపాటి.. నెక్ట్స్ రామ్ పోతినేని సినిమాతో బిజీ అయ్యారు. హరీష్ శంకర్..పవన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొరటాల.. ఎన్టీఆర్ సినిమాలో ఉన్నారు. త్రివిక్రమ్..మహేష్ సినిమా చేస్తున్నారు. మురుగదాస్తో ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
దీంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న వేణు శ్రీరామ్ `ఐకాన్` మూవీని మళ్లీ పట్టాలెక్కిస్తారా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. `ఐకాన్`ని ఎప్పుడో పక్కన పెట్టారు బన్నీ. మళ్లీ ఆ సినిమా చేస్తారా? అనేది డౌట్. ఇది కాకుండా ఇంకా ఏ ప్రాజెక్ట్ చేస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బన్నీ ముంబయిలో హల్చల్ చేస్తున్నారు. ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలీని కలిశాడు. ఇటీవల ముంబయిలో మరోసారి మెరిశారు. మరి హిందీ ప్రాజెక్ట్ ని ఏమైనా ట్రాక్లోకి తీసుకురాబోతున్నారా? అనేది ప్రశ్నగా మారింది.
ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతుంది. బన్నీ నెక్ట్స్ ఏంటి? అనేది అభిమానులను తొలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చారు. త్రివిక్రమ్తో మరో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నారట. ప్రస్తుతం మహేష్తో మాటల మాంత్రికుడు చేయబోతున్న మూవీ అనంతరం బన్నీతోనే ఉంటుందని ఓ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే చివరగా బన్నీ.. త్రివిక్రమ్తో `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించారు. ఇది నాన్ `బాహుబలి` రికార్డులను తిరగరాసింది. సుమారు రూ.250కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అనంతరం బన్నీ `పుష్ప` చేసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఆ హిట్ కాంబినేషన్ని రిపీట్ చేయబోతున్నట్టు సమాచారం. వీరి కాంబినేషన్లో ఇప్పటికే `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` సినిమాలు వచ్చి విజయాలు సాధించాయి. ఒక హ్యాట్రిక్ పూర్తయ్యింది. మరో హ్యాట్రిక్కి ప్లాన్ జరుగుతుందని సమాచారం.
ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన `పుష్ప` చిత్రం గతేడాది డిసెంబర్ 17న చాలా క్లిష్టమైన సమయంలో విడుదలైంది. ఈ సినిమా విడుదల ముందు రోజు వరకు దర్శకుడు సుకుమార్ సినిమాపై వర్క్ చేశారు. కానీ ఎన్నో సందేహాల మధ్య విడుదలైన `పుష్పః ది రైజ్`కి మొదట డివైడ్ టాక్ వచ్చినా, తర్వాత నెమ్మదిగా పుంజుకొని భారీ విజయాన్ని సాధించింది. ఇది కేవలం హిందీలోనే వంద కోట్లు చేసింది. ఏపీలో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆ సినిమా అంతటి విజయాన్ని సాధించడం విశేషంగా చెప్పొచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 350కోట్లు(గ్రాస్) వసూలు చేయడం విశేషం.
మరి బన్నీ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం `పుష్ప2` గ్యాప్లో మరో సినిమా చేస్తాడా? లేక స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేంత వరకు వెయిట్ చేసి అదే సినిమాని పట్టాలెక్కిస్తాడా?అనేది చూడాలి. `పుష్ప`లో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో ఫహద్ ఫాజిల్ విలన్గా నటించగా, అనసూయ, సునీల్, ధనుంజయ్ కీలక పాత్రలు పోషించారు. రెండో భాగంలో విజయ్ సేతుపతి నటించే ఛాన్స్ ఉందంటున్నారు.