`కన్యాదానం` వివాదంలో అలియాభట్.. అర్చకులు, కంగనా ఫైర్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్
`ఆర్ఆర్ఆర్`(RRR movie) భామ అలియా భట్(alia bhatt) వివాదంలో ఇరుక్కుంది. `కన్యాదానం`(kanyadaanam) చిక్కుల్లో పడింది. ఎరక్కపోయి ఇరుక్కున్నంత పనైంది. మరి అలియా భట్ ఈ `కన్యాదానం` వివాదంలో పడటం ఏంటని అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళితే.
ఓ యాడ్ ఇప్పుడు అలియా భట్ని ఇబ్బందుల్లో పడేసింది. అలియా భట్ ఓ నగల ప్రకటనలో నటించింది. ఓ ప్రముఖ నగల, వస్త్రాల బ్రాండ్కి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సదరు కంపెనీ అలియాభట్పై యాడ్ని షూట్ చేసింది. దాన్ని ఇటీవల విడుదల చేశారు.
అయితే అలియా `ఆర్ఆర్ఆర్` నటి కావడం, బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్ కావడంతో ఆ యాడ్ జనాల్లోకి బాగా వెళ్లింది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. ఈ యాడ్లో హిందూ వివాహ క్రతువులో ఎంతో ప్రయారిటీ ఉన్న కన్యాదానం ప్రస్తావనుంది. పెళ్లికూతుర్ని `దానం` చేయడాన్ని అలియా ప్రశ్నిస్తుంది. అలియా ఈ యాడ్లో కన్యాదానం గురించి మాట్లాడిన తీరు విమర్శలకు గురవుతుంది. పలువురు హిందూ సంప్రాదాయ వాదులు ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు.
అందులో ప్రధానంగా అలియాపై, ఆ నగల సంస్థపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో, కన్యాదానం గురించి ఓ యాడ్ ఏజెన్సీ వచ్చి హిందువులకి నీతులు చెప్పటం హాస్యాస్పదమన్నారు. వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతి, నాగరికత కొనసాగుతున్నాయన్నారు. పెళ్లికూతురుని మహాలక్ష్మీ స్వరూపంగా భావించే సాంప్రదాయం మన దేశంలో ఉందని ఆయన గుర్తు చేశారు. కన్యాదానాన్ని తప్పుబడుతూ రూపొందించిన యాడ్ను తక్షణం వెనక్కి తీసుకోవాలని రంగరాజన్ డిమాండ్ చేశారు. మరి దీనిపై అలియా, సదరు నగల సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సైతం ఘాటుగా స్పందించింది. ఓ కమర్షియల్ యాడ్లో మతాన్ని, సంప్రాదాయాలను ప్రస్థావని తీసుకురావడం, దానిలో అలియా నటించడం పట్ల కంగనా ఫైర్ అయ్యింది. అలియాపై పెద్ద సందేశంతో విరుచుకుపడింది. `అన్ని బ్రాండ్లకు వినయపూర్వకమైన అభ్యర్థన..వస్తువులను విక్రయించడానికి మతం, మైనారిటీ, మెజారిటీ రాజకీయాలను ఉపయోగించవద్దు. వివేకవంతమైన భావనలు, ప్రకటనలతో అమాయక వినియోగ దారులను మోసగించడం ఆపండి. గ్రంథాలలో మహిళలను పూజిస్తారు. వారిని విలువైన ఉనికికి మూలంగా చూడటం వల్ల ఎలాంటి హానీ ఉండదు` అని పేర్కొంది.
ఇంకా కంగనా చెబుతూ, హిందూ ఆచారాలను అవహేళన చేయడం మానేయాలని పేర్కొంది. `మేం తరచుగా అమరవీరుడి తండ్రిని టీవీల్లో చూస్తుంటాం. సరిహద్దుల్లో కోల్పోయినప్పుడు, వారు గర్జిస్తారు. చింతించకండి, నాకు మరో కుమారుడు ఉన్నాడు` అని గర్వంగా చెబుతాడు` అని తెలిపింది కంగనా.
అయితే కొంత మంది అలియా చేసిన దాన్ని వ్యతిరేకిస్తుంటే, మరికొంత మంది సపోర్ట్ చేస్తున్నారు. వివాదం చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్చని తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతోపాటు మరికొందరు దీన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అలియా యాడ్ని మీమ్స్ గా మార్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు అలియా నేషనల్ వైడ్గా ట్రెండింగ్గా మారింది.
అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె రామ్చరణ్ సరసన సీత పాత్రలో కనిపించబోతుంది. మరోవైపు హిందీలో `బ్రహ్మాస్త్ర`, `గంగూబాయి కథియవాడి`, `డార్లింగ్స్`, `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.