నిర్మాతలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు: నటి సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇండస్ట్రీలో కొత్త వివాదానికి తెర తీసింది. ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం) విషయంలో చాలా కాలంగా చర్చ ఉన్నా సుశాంత్ మరణం తరువాత ఆ చర్చ తీవ్రమైంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఇండస్ట్రీ మాఫియాపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీలో కూడా అలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వారసత్వం అనేది అన్ని రంగాల్లో ఉన్న సినీ రంగంలో ఇది చాలా ఎక్కువ. వారసులుగా పరిచయం అయిన వారికోసం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారన్న అపవాదు చాలా కాలంగా ఉంది. హీరోల విషయంలోనే కాదు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ల విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి.
తాజాగా కోలీవుడ్ నటి విద్యా ప్రదీప్ తన అనుభవాలను ట్విటర్ వేదికగా పంచుకుంది. సుశాంత్ సింగ్ మరణంతో కలత చెందిన విద్యా తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదురైన అనుభవాలను ఆ సందర్భంగా తాను అనుభవించిన మనో వేదనను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇండస్ట్రీలో తనను టార్చర్కు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది విద్యా. అవళ్ పేర్ తమిళరసి సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ విద్యా ప్రదీప్. ఆ తరువాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన శైవం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
పసంగ 2, మారి 2, తడం, పొన్ మగల్ వందాల్ లాంటి చిత్రాల్లో నటించిన ఈ భామ తనకు ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. తనను ఎలాంటి కారణంగా చెప్పకుండా ఒకేసారి ఆరు సినిమాల నుంచి తొలగించటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి వెల్లిపోయిందట. ఒక్కసారిగా గుండె భారంగా మారటంతో ఇక సినిమాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయించకున్నట్టుగా తెలిపింది విద్యా.
తనకు సినిమాలు సరిపడవని నిర్ణయించుకొని చదువు మీద దృష్టి పెట్టిందట. అయితే అదే సమయంలో తడం సినిమాలో అవకాశం రావటంతో తిరిగి సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేని వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పిన విద్యా.. నిర్మాతలు తలుచుకుంటే ఏమైనా చెస్తారని చెప్పింది.