మా నాన్న ముందే సీనియర్ హీరోలిద్దరు నన్ను లేపుకుపోతామన్నారు.. చెంపచెళ్లుమనిపించే సంఘటన బయటపెట్టిన గీతాంజలి
సీనియర్ నటి గీతాంజలి ఆనాటి కామెడీ హీరోలు పద్మనాభం, చలంలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. వాళ్లు చేసిన పనికి చెంప చెళ్లుమనిపించాలనిపించిందట.
సీనియర్ నటి గీతాంజలి తొలితరం హీరోయిన్లలో ఒకరు. ఆమె 13ఏళ్ల వయసులో సినిమా కెరీర్ని ప్రారంభించి హీరోయిన్గా ఓ ఊపు ఊపేసింది. ఎక్కువగా కామెడీ చిత్రాల్లో చేసింది. హీరోయిన్గా అనేక సినిమాలు చేశాక క్రమంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. సైడ్ క్యారెక్టర్స్ ఆ తర్వాత అమ్మ, బామ్మ పాత్రలు చేసి మెప్పించింది.
గీతాంజలి భోళా మనిషి, ఫన్నీగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అందరి విషయంలోనూ ఆమె పాజిటివ్గా ఉంటుంది. అదే క్వాలిటీ ఆమెని దాదాపు నాలుగైదు దశాబ్దాలపాటు సినిమాల్లో ఉండేలా చేసింది. మనసులో ఏదీ ఉంచుకోదు, ఏదున్నా మోహం మీదే చెబుతుంది. అందులో భాగంగా తాను హీరోయిన్గా చేసినప్పుడు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఓపెన్గా చెప్పేసింది.
కృష్ణంరాజు సెట్లో చేసిన పని చెప్పి షాకిచ్చింది. అలాగే కామెడీ హీరోలు పద్మనాభం, చలంలు చేసిన అల్లరి పని కూడా బయటపెట్టింది. ఓ సినిమాలో గీతాంజలి, పద్మనాభం, చలం కలిసి నటించారు. అందులో `నీ కోసం లాగుచున్నది, నిన్ను చూస్తే ఉంటూ నా మనసే లాగుతున్నది` అనే పాట ఉంది. హీరోయిన్ని ఆటపట్టించే పాట. ఇద్దరు పద్మనాభం, చలం ఇద్దరు చేరోవైపు నుంచి తనని లాగి ఆగమాగం చేశారట.
అంతేకాదు గీత నాది అంటే నాది అని పోటీ పడ్డారట. నేను తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్తా అంటూ ఫైట్ చేసుకునే వాళ్లట. ఎక్కడికి ఎత్తుకుపోతారంటే ఎక్కడికైనా దూరంగా ఎత్తుకుపోతామని చెప్పేవారట. సెట్లో గీతాంజలి నాన్న కూడా ఉండేవారట. అయినా ఈ ఇద్దరు ఇలానే అల్లరి చేసేవారని, ఆ సిచ్చువేషన్ చూస్తే లాగి పెట్టి చెంపచెల్లుమనిపించేది అని, కానీ కొట్టలేదని తెలిపింది. అయితే అవన్నీ ఫన్నీగా ఇన్సిడెంట్స్ అని, అప్పుడు ఇబ్బంది పడ్డా, ఇప్పుడు చాలా ఫన్నీగా, మరచిపోలేని మెమరీస్గా ఉన్నాయని వెల్లడించింది గీతాంజలి. పదేళ్ల క్రితం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతాంజలి ఈ విషయాలను వెల్లడించింది.
కాకినాడకి చెందిన గీతాంజలి 1960లో సినిమాల్లోకి వచ్చింది. `రాణిరత్నప్రభ` చిత్రంతో ఆమె మెరిసింది. ఇందులో డాన్సర్గా నటించింది. ఆ నెక్ట్స్ ఇయర్ ఎన్టీఆర్ ఆమెని `సీతా రామకళ్యాణం` చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. `మురళీకృష్ణ` చిత్రంతో బ్రేక్ అందుకుంది గీతాంజలి. ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు అందరు సీనియర్ హీరోలతోనూ కలిసి నటించింది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఆమె సినిమాలు చేసింది. దాదాపు ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె నటుడు రామకృష్ణని పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.