వాడు ఆదుకుంటాడనుకుంటే హ్యాండిచ్చాడు, అప్పట్లో తన అప్పులపై నాగబాబు ఆసక్తికర వ్యాఖలు
ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నాగబాబు డబ్బులు, సంపాదన గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధాల కంటే కూడా డబ్బులే ముఖ్యమన్న నాగబాబు, సంపాదన లేకపోతే పిల్లలు కూడా లెక్క చేయరు అన్నారు.
మెగా బ్రదర్స్ లో నాగబాబుది ఫెయిల్యూర్ స్టోరీ. ముగ్గురు బ్రదర్స్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్స్ గా ఎదగగా నాగబాబు చాల క్రింద ఉండిపోయారు. హీరోగా సక్సెస్ కాకపోయినా నిర్మాతగా ఎదగాలని నాగబాబు భావించారు. అలా కూడా ఆయన విజయం సాధించలేదు. చిరంజీవి దగ్గర నుండి రామ్ చరణ్ వరకు నాగబాబు నిర్మించిన అన్ని చిత్రాలు ప్లాప్ అయ్యాయి.
ఆయన నిర్మించిన చివరి చిత్రం నాపేరు సూర్య కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది. ఆ మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న నాగబాబు మరోమారు సెంటిమెంట్ రిపీట్ చేశారు. ఐతే నాగబాబును పూర్తిగా ముంచేసిన సినిమా మాత్రం ఆరెంజ్. ఆ సినిమా పరాజయం నాగబాబును ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తీసింది.
మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ తన మూడో చిత్రంగా ఆరెంజ్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా మంచి ఫార్మ్ లో ఉన్నారు. ఆరెంజ్ మూవీ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్. దీనితో మూవీ భారీ విజయం సాధించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ఆ చిత్రం ఘోర పరాజయం పాలైంది.
ఆ సినిమా మిగిల్చిన నష్టాలతో అప్పులపాలైన నాగబాబు అప్పటి తన కష్టాలు వివరించడం జరిగింది. చేసిన అప్పులు చూస్తే చాలా భయం వేసేది. వాటిని ఎలా తీర్చాలో కూడా అర్థం అయ్యేది కాదు. అన్నీ మేనేజ్ చేస్తాడని ఒకడిని నమ్మితే వాడు హ్యాండిచ్చాడు అన్నాడు.
డబ్బు అనేది చాల ముఖ్యం, బంధాలు ఉండాలి కానీ వాటి కంటే కూడా డబ్బులే ముఖ్యం. సంపాదన లేకపోతే కనీసం పిల్లలు కూడా లెక్క చేయరు. ఎవరైనా డబ్బులు సంపాదించవచ్చని నాగబాబు ఆ వీడియోలో తెలిపారు. ఆర్థిక విషయాలపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంతగా ఇబ్బందిపడ్డారో తెలుస్తుంది.