మానసికంగా బాగానే ఉన్నా దయచేసి వేషాలివ్వండి... లెజెండ్ కోటాకు ఈ పరీస్థితా!
టాలీవుడ్ మేటినటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. విలక్షణ నటుడిగా విభిన్న పాత్రలు కోటా చేశారు. మూడు దశాబ్దాలకు పైగా వెండితెరపై తిరుగులేని నటుడిగా కొనసాగిన కోటా.. వేషాల కోసం ఎదురుచూసే పరిస్థితి రావడం విచారకరం. తాజా ఇంటర్వ్యూలో కోటా కొన్ని బాధాకరమైన విషయాలు వెల్లడించారు.
లాక్ డౌన్ సమయంలో పిల్లలు కుటుంబ సభ్యులతో గడిపిన కోటాకు వేరే వ్యాపకం లేకుండా పోయిందట.స్కూల్స్, కాలేజీలు మొదలయ్యాక పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండడం లేదట.
ఏళ్ల తరబడి తీరక లేకుండా షూటింగ్స్ లో పాల్గొన్న నటుడిగా, ఖాళీగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని కోటా తెలియజేశారు. కెరీర్ లో వేషాల కోసం ఎవరినీ నోరు తెరిచి అడగని ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది అన్నారు.
డబ్బులు కాదు, ఏదైనా వేషం ఉంటే చెప్పండి చేస్తాను అని... చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరియు వివి వినాయక్, క్రిష్ లకు ఫోన్ చేసి అడిగారట. క్రిష్ తెరకెక్కిస్తున్న పవన్ మూవీలో అవకాశం ఇవ్వడంతో, చేశానని కోటా అన్నారు.
మీడియా వాళ్ళు తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాశారని, వేషాలు తగ్గిపోవడానికి అది కూడా కారణం అని కోటా పరోక్షంగా తెలియజేశారు. నేను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నా, మాట తీరు కూడా బాగుంది.. వేషాలు ఇవ్వండని కోటా దర్శక నిర్మాతలకు సందేశం పంపారు.
ఇక కొందరు సీనియర్ నటులు, సింగర్స్ బ్రతికి ఉండగానే చనిపోయారని వార్తలు రాస్తున్నారు, అది చాలా బాధాకరం అని కోటా శ్రీనివాసరావు ఆవేదన చెందారు.
తన సంపాదన తనకు ఎంతో తెలుసు అన్న కోట, ఇప్పటికి వరకు సాధించిన విజయాలు, ఆత్మ సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. సామాన్యుడినైన నేను పద్మశ్రీ వరకు ఎదిగానని గర్వంగా చెప్పుకున్నారు.
ఇక కోటా తన హైయెస్ట్ రెమ్యూనరేషన్ గురించి కూడా చెప్పడం విశేషం. రోజుకు ఆయన అత్యధికంగా రూ. 1.5 లక్షలు తీసుకున్నట్లు తెలియజేశారు.
మరి ఇప్పటికైనా కోటా ఆవేదనను అర్థం చేసుకొని, దర్శకులు ఆయనకు అవకాశాలు ఇస్తే గొప్ప నటుడి మాటకు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.