IPL 2020: ఈ సీజన్లో మెరవబోతున్న భారత యంగ్ గన్స్ వీళ్లే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఓ అత్యుత్తమ అవకాశాల వేదిక. ఐపీఎల్ వేదికగా షేన్ వాట్సన్, బ్రెండన్ మెక్కల్లమ్, డేవిడ్ వార్నర్ వంటి ఎంతోమంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్ను గాడిలో పడేసుకున్నారు. ఐపీఎల్ ఇచ్చిన కొండంత ఆత్మవిశ్వాసంతో, జాతీయ జట్ల తరపున అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న దేశవాళీ కుర్రకారు ఐపీఎల్ వేదికగానే ప్రపంచ క్రికెట్కు పరిచయం అవుతున్నారు. యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, పృథ్వీషా, శుబ్మన్ గిల్ వంటి వాళ్లు ఐపీఎల్ ప్రదర్శనలతోనే జాతీయ జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ 2020లో ప్రభంజనం సృష్టించేందుకు ఈసారీ కొందరు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. బయో బబుల్ ఐపీఎల్లో ప్రభావం చూపనున్న భారత అన్క్యాప్డ్ బ్యాట్స్మెన్పై లుక్కేద్దామా..!
ప్లేయర్ : రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్కింగ్స్)
దేశవాళీ సర్క్యూట్లో హిట్టింగ్ చేస్తూనే కంపోస్డ్ షాట్స్ ఆడగలిగే అద్భుతమైన బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్. గత రెండేళ్లలో భారత్-ఏ తరపున అత్యధిక లిస్ట్-ఏ పరుగులు సాధించిన బ్యాట్స్మన్ గైక్వాడ్. 15 ఇన్నింగ్స్ల్లో 843 పరుగులు చేశాడు. తెలివైన క్రికెట్ నాలెడ్జ్ కలిగిన క్రికెటర్గా లెజెండ్ ఎం.ఎస్ ధోనీ నుంచి కితాబు కూడా అందుకున్నాడు రుతురాజ్. సురేశ్ రైనా స్థానంలో నెం. 3 బ్యాట్స్మన్గా ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు రుతురాజ్. అయితే కరోనా బారిన పడిన రుతురాజ్ ఇంకా కోలుకోలేదు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లోనూ గైక్వాడ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మొదటి వారం రోజులు గైక్వాడ్ అందుబాటులో ఉండకపోవచ్చు.
దేవ్దత్ పడిక్కల్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్)
గత సీజన్లో విజయ్ హజారె ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల్లో పడిక్కల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. 20 ఏళ్ల పడిక్కల్ 175.75 స్ట్రయిక్రేట్తో 580 పరుగులు చేశాడు. సగటున ప్రతి రెండు ఇన్నింగ్స్లకు ఓ అర్ధ సెంచరీ బాదాడు. బెంగళూర్లో అరోన్ ఫించ్, జోశ్ ఫిలిప్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. మరో ఓపెనర్ స్థానం కోసం పార్థీవ్ పటేల్తో పడిక్కల్ పోటీపడుతున్నాడు. ఏబీ డివిలియర్స్ వికెట్ కీపర్గా జట్టులో కొనసాగితే పడిక్కల్కు లైన్ క్లియర్ అవుతుంది. దూకుడు, సహనం, సంయమనం, టెక్నిక్, టెంపర్మెంట్ కలిగిన పడిక్కల్ ఈ సీజన్లో పంజా విసిరే అవకాశం బాగా ఉంది. టాప్ ఆర్డర్లో పడిక్కల్ను ప్రయోగించేందుకు విరాట్ కోహ్లి కూడా ఆసక్తిగా ఉన్నాడు.
యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్)
అండర్-19 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా అందరి దృష్టినీ ఆకర్షించాడు యశస్వి జైశ్వాల్. పరిమిత ఓవర్ల ఫార్మాట్ అదరగొట్టే ఈ చిచ్చర పిడుగు, లిస్ట్-ఏ మ్యాచుల్లో 70.81 సగటుతో ఆరుసార్లు 50+ స్కోర్లు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్గా జోస్ బట్లర్ స్థానం సుస్థిరం. మరో ఓపెనర్ స్థానం కోసం రాబిన్ ఉతప్ప, మనన్ వోహ్రాలతో జైశ్వాల్ పోటీపడుతున్నాడు. నెం.3 స్థానంలో రావాలనుకుంటే సంజూ శాంసన్తోనూ పోటీ నెలకొంది. తిరుగులేని టెక్నిక్, పరుగుల వరద పారించే రికార్డుతో కోరుకున్న ఓపెనింగ్ స్థానంలోనే జైస్వాల్ ఆడే అవకాశం ఉంది. అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసినట్టే ఐపీఎల్లోనూ జైస్వాల్ చెరగని ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
ప్లేయర్ : సర్ఫరాజ్ ఖాన్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
సర్ఫరాజ్ ఖాన్ గతంలోనే ఐపీఎల్లో ఓ మెరుపు మెరిసే ప్రయత్నం చేశాడు. కొన్ని కళ్లు చెదిరే ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. కానీ స్వీయ తప్పిదాలు, జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాలతో సర్ఫరాజ్ కెరీర్ వెనక్కి వెళ్లింది. 22 ఏళ్ల సర్ఫరాజ్, దేశీ క్రికెట్లో 301, 226, 78, 25, 177 పరుగుల ఇన్నింగ్స్లతో అత్యుత్తమ ఫామ్లోకి వచ్చాడు. సహజసిద్ధంగానే సర్ఫరాజ్ ఖాన్ దూకుడైన బ్యాట్స్మన్. టీ20 ఫార్మాట్లో సర్ఫరాజ్ ఆకాశమే హద్దుగా ఆడతాడు.
ప్లేయర్ : అబ్దుల్ సమద్ (సన్రైజర్స్ హైదరాబాద్)
దేశవాళీ క్రికెట్లో అబ్దుల్ సమద్ ఓ మంచి మ్యాచ్ ఫినీషర్. వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేక చొరవతో సమద్ను సన్రైజర్స్లోకి తీసుకున్నారు. స్పిన్ బౌలింగ్లో నిర్ధాక్షిణ్యంగా సిక్సర్లు బాదటంలో సమద్ స్పెషలిస్ట్. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటకను కంగుతినిపించినంత పని చేశాడు. గత రంజీ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 112.97 స్ట్రయిక్రేట్ సమద్ సొంతం. మనీశ్ పాండే 4వ స్థానంలోనే కొనసాగితే లోయర్ ఆర్డర్లో రెండు స్థానాలు ఖాళీగా ఉంటాయి. విరాట్ సింగ్, మహ్మద్ నబి, ఫాబియన్ అలెన్లతో అబ్దుల్ సమద్ తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నాడు. బలమైన టాప్ ఆర్డర్ కలిగిన సన్రైజర్స్ హైదరాబాద్ అబ్దుల్ సమద్ రూపంలో మ్యాచ్ ఫినీషర్ను సిద్ధం చేసుకునే పనిలో పడింది.
రవి బిష్నోయ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
అండర్ 19 వరల్డ్కప్లో బంతితో వండర్స్ చేశాడు బిష్నోయ్. బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యి, ఓటమి తప్పదనుకున్న లో స్కోరింగ్ మ్యాచుల్లో రవి బిష్నోయ్ మ్యాజిక్తో యువ భారత్ ఫైనల్లోకి దూసుకొచ్చింది. 19 ఏళ్ల బిష్నోయ్, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో రాజస్థాన్ తరుపున ఆడాడు. 4.37 సగటుతో 12 వికెట్లు పడగొట్టిన రవి బిష్నోయ్ను కరెక్టుగా వాడుకుంటే, పంజాబ్కి గేమ్ ఛేంజర్ అవుతాడు.
ప్రియమ్ గార్న్ (సన్రైజర్స్ హైదరాబాద్)
అండర్ 19 వరల్డ్కప్లో భారత జట్టును ఫైనల్ వరకూ నడిపించిన సారథి ప్రియమ్ గార్గ్. రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి మ్యాచులోనే డబుల్ సెంచరీ బాదిన ప్రియమ్ గార్గ్, 10 మ్యాచుల్లో 814 పరుగులు చేశాడు. రూ. కోటి 90 లక్షలకు పోటీపడి మరీ కొనుగోలు చేసిన ఈ యంగ్ గన్ను సన్రైజర్స్ కరెక్టుగా ఉపయోగిస్తే, కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ దొరికినట్టే.
కార్తిక్ త్యాగి (రాజస్థాన్ రాయల్స్): అండర్ 19 వరల్డ్కప్లో అదరగొట్టిన బౌలర్లలో త్యాగి ఒకడు. 140 కి.మీ. ల మెరుపు వేగంతో బౌలింగ్ చేయగలిగిన ఈ యూపీ పేసర్ను రూ. కోటి 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్. ఇప్పటిదాకా టీ20 మ్యాచ్ ఆడని త్యాగి, ఐపీఎల్లో రాణిస్తే భారత జట్టుకి మరో స్టార్ పేసర్ దొరుకుతాడు.