ఈసారి కూడా ఇంగ్లాండ్కి కష్టమే... డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్ రేసులో ఆ మూడు జట్లు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మొదటి సీజన్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. టేబుల్ టాపర్గా ఫైనల్కి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా, ఆఖరాటలో బోల్తాపడి రన్నరప్తో సరిపెట్టుకుంది. తొలి సీజన్ పూర్తికాగానే రెండో సీజన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది....
గత సీజన్లో అత్యధికంగా 21 టెస్టు మ్యాచులు ఆడింది ఇంగ్లాండ్. రెండో స్థానంలో ఉన్న టీమిండియా కంటే 4 మ్యాచులు ఎక్కువ. ఎక్కువ మ్యాచులు ఆడడం వల్ల విజయాల శాతంపై ఆ ప్రభావం పడింది.
21 మ్యాచుల్లో 11 మ్యాచుల్లో గెలిచి 7 టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, మూడు టెస్టులను డ్రాగా ముగించింది. దీంతో ఇంగ్లాండ్ విజయాల శాతం 64.1 శాతానికి పడిపోవడంతో ఫైనల్కి అర్హత సాధించలేకపోయింది...
వాస్తవానికి పాయింట్ల పద్ధతిని ప్రామాణికంగా తీసుకుని ఉంటే టీమిండియా తర్వాత అత్యధిక విజయాలు సాధించిన ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ చేరి ఉండేది. కానీ విజయాలు కాకుండా విజయాల శాతం లెక్కలోకి తీసుకోవడంతో మిగిలిన జట్ల కంటే ఎక్కువ మ్యాచులు ఆడడం ఇంగ్లాండ్ ఫైనల్ అవకాశాలను తక్కువ చేశాయి...
ఈసారి కూడా ఇంగ్లాండ్ జట్టు టోర్నీలో 21 మ్యాచులు ఆడనుంది. ఇందులో స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరీస్లు ఆడుతుంది. ఆగస్టు 4 నుంచి స్వదేశంలో టీమిండియాతో ఆడే ఐదు టెస్టుల సిరీస్, డబ్ల్యూటీసీ 2021-23 టోర్నీలో మొదటి సిరీస్...
ఇంగ్లాండ్ తర్వాత టీమిండియా, డబ్ల్యూటీసీ టోర్నీలో 19 టెస్టులు ఆడబోతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 18 టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా 15, పాకిస్తాన్ 14, న్యూజిలాండ్ 13, వెస్టిండీస్ 13, శ్రీలంక 13, బంగ్లాదేశ్ 12 టెస్టులు ఆడనున్నాయి.
విజయాల శాతం ప్రతిపాదికగా ఫైనల్ పోటీదారులను నిర్ణయిస్తుండడంతో ఎన్ని తక్కువ మ్యాచులు ఆడితే, అంత ఎక్కువగా ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది.
12 మ్యాచుల్లో 8 మ్యాచులు గెలిచి, 4 ఓడినా, డ్రాలు చేసుకున్నా విజయాల శాతం 60 శాతానికి పైగా ఉంటుంది. అదే సమయంలో 21 టెస్టులు ఆడి 10 టెస్టులు గెలిచినా విజయాల శాతం 50 శాతం కంటే తక్కువగా ఉంటుంది...
శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు ప్రస్తుతం ఫామ్లో లేవు. బంగ్లాదేశ్, వెస్టిండీస్ ప్రదర్శన టెస్టుల్లో చెప్పుకోదగినంత గొప్పగా అయితే ఏం లేదు. ఇక మిగిలింది పాకిస్తాన్... పాకిస్తాన్ స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
స్వదేశంలో పాక్ బలమైన జట్టే అయినా ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లను వాళ్లు ఓడగొట్టగలరా? అనేది చూడాలి. విదేశాల్లో వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో టెస్టు సిరీస్లు ఆడుతుంది. వీటిపైన విజయాలు సాధించినా, పాక్ ఫైనల్ చేరాలంటే సంచలన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ఫైనల్ రేసులో మిగిలింది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టీమిండియా జట్లే. ఆసీస్కి యాషెస్ సిరీస్ కీలకం కానుండగా ఆ తర్వాత భారత్లో టీమిండియాతో టెస్టు సిరీస్ ఒక్కటీ కాస్త ఛాలెంజింగ్గా ఉండబోతోంది... మిగిలిన సిరీస్ల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
న్యూజిలాండ్ ఆడే టెస్టులు తక్కువే. అందులో క్లిష్టమైనవి, కష్టమైనవి తక్కువే కావడంతో మరోసారి కివీస్ ఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్లో స్వదేశంలో టీమిండియాను 2-0తేడాతో ఓడించిన న్యూజిలాండ్, ఈసారి భారత్లో రెండు టెస్టులు ఆడనుంది.
భారత ఉపఖండ పిచ్లపై న్యూజిలాండ్ విజయాలు సాధిస్తే, నిజంగానే కివీస్ జట్టు వరల్డ్ నెం.1 టీమ్గా కీర్తించబడుతుంది. అయితే కేన్ విలియంసన్ అండ్ టీమ్ ఇండియాలోని స్పిన్ పిచ్లపై ఎలా నిలబడగలరనేది ఇంట్రెస్టింగ్గా మారింది.