Women's IPL: త్వరలోనే మహిళల ఐపీఎల్..? సూపర్ హింట్ ఇచ్చిన బీసీసీఐ చీఫ్
Sourav Ganguly: భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త..? ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఆటతో పాటు వినోదాన్ని పంచుతున్న బీసీసీఐ.. తాజాగా మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు కూడా కసరత్తులు చేస్తున్నది.

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ సుదీర్ఘ అభ్యర్థన త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నదా..? వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇందుకు సంబంధించిన కార్యాచరణ వెల్లడి కానున్నదా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు.
తాజాగా బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంగూలీ.. ఇండియాలో ఉమెన్స్ ఐపీఎల్ కోసం కసరత్తులు చేస్తున్నామని వ్యాఖ్యానించాడు.
గంగూలీ మాట్లాడుతూ.. ‘మహిళల ఐపీఎల్ నిర్వహించాలని మా (బీసీసీఐ) మైండ్ లో ఉంది. అయితే దానిని ఎలా నిర్వహిస్తాం..? అందుకోసం మేమేం చేయబోతున్నామనే విషయాలపై వచ్చే మూడు, నాలుగు నెలల్లో అన్ని వివరాలు వెల్లడిస్తాం..’ అని అన్నాడు.
ఇండియాలో ఐపీఎల్ తో పాటు ఫుట్బాల్ లీగ్, కబడ్డీ లీగ్ లు విజయవంతమైన నేపథ్యంలో మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించాలనే డిమాండ్ ఊపందుకుంది. గత కొద్దిరోజులుగా టీమిండియాకు చెందిన పలువురు తాజా మాజీ మహిళా క్రికెటర్లు కూడా దీనిపై తమ గళం వినిపించారు.
పురుషులతో పాటు మహిళల ఐపీఎల్ ను కూడా నిర్వహించాలని వాళ్లు బీసీసీఐని కోరారు. అయితే ఈ విషయమై ఇన్నాళ్లు మౌనం దాల్చిన బీసీసీఐ.. తాజాగా మాత్రం దానిని నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నది.
ముఖ్యంగా భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్.. బిగ్ బాష్ లీగ్ లో అదిరిపోయే ప్రదర్శన చేసిన తర్వాత.. ఇండియాలో కూడా మహిళల ఐపీఎల్ పెట్టాల్సిందేనన్న డిమాండ్ ఊపందుకుంది.
ఇటీవలే ముగిసిన మహిళల బిగ్ బాష్ లీగ్ లో హర్మన్ప్రీత్ కౌర్.. బ్యాటింగ్ లో 406 పరుగులు చేయడమే గాక బౌలింగ్ లో 15 వికెట్లు తీసుకుంది. ఈ టోర్నీలో ఆమె అత్యద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకుంది.
హర్మన్ప్రీత్ ప్రదర్శనపై గంగూలీ మాట్లాడుతూ... ‘బిగ్ బాష్ లీగ్ లో హర్మన్ప్రీత్ బాగా ఆడటం నాకు సంతోషాన్ని కలిగించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి పిచ్ లపై కూడా ఆమె చాలా బాగా రాణిస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె ఆస్ట్రేలియా పై ఆడుతూ.. 171 పరుగులు చేసింది. ఒక యువ క్రికెటర్ గా అదీ ఆసీస్ వంటి పటిష్ట జట్టుమీద ఆ ప్రదర్శన చేయడం మాములు విషయం కానేకాదు..’ అని అన్నాడు.
హర్మన్ప్రీత్ కౌర్ తో పాటు షఫాలీ వర్మ, స్మృతి మంధానా లు కూడా విదేశీ లీగ్ లు, టీ20లలో మెరుస్తున్నారు. పురుషుల క్రికెట్ లో ఐపీఎల్ లో అనేది భారత జట్టుకు ఒక వరంలా మారింది. దీని కారణంగానే భారత బెంచ్ కూడా బలోపేతమైంది. మహిళల క్రికెట్ లో కూడా వుమెన్స్ ఐపీఎల్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.