- Home
- Sports
- Cricket
- వరల్డ్ ఛాంపియన్షిప్ది ఏముంది.. మాకు యాషెసే ముఖ్యం.. స్టీవ్ స్మిత్ షాకింగ్ కామెంట్స్
వరల్డ్ ఛాంపియన్షిప్ది ఏముంది.. మాకు యాషెసే ముఖ్యం.. స్టీవ్ స్మిత్ షాకింగ్ కామెంట్స్
Ashes 2023: ఆసీస్ వరల్డ్ ఛాంపియన్షిప్ గదను గెలుచుకున్నా తమకు దీని కంటే ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ అంటేనే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని అంటున్నాడు స్టీవ్ స్మిత్..

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ సారథి, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తాజాగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచిన ఆసీస్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. భారత్ తో జరిగిన ఈ మ్యాచ్ లో స్మిత్.. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ (121) చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్ లో కూడా 37 పరుగులు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్.. ట్రావిస్ హెడ్ తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆ జట్టు 469 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ లో రాణించినా.. ఆసీస్ వరల్డ్ ఛాంపియన్షిప్ గదను గెలుచుకున్నా తమకు దీని కంటే ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ అంటేనే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యాషెస్ సిరీస్ ప్రారంభం నేపథ్యంలో ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ... ‘గత వారం మాకు చాలా బాగా గడిచింది. మేం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచాం. ఇది రెండేండ్ల కష్టానికి ఫలితం. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచినందుకు గర్వంగా ఉంది.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ లో గెలిచి వరల్డ్ ఛాంపియన్స్ అయినా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లకు యాషెస్ సిరీస్ చాలా కీలకం. ఇరు జట్ల క్రికెటర్లు ఈ సిరీస్ కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం మేం చాలా కష్టపడతాం. ఇది చాలా ఎగ్జయిటింగ్ గా సాగుతుంది..’అని చెప్పుకొచ్చాడు.
యాషెస్ ఇరు జట్లకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ప్రశ్నించగా.. ‘మీరు చరిత్ర చూడండి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు ఇది చాలా పెద్ద సిరీస్. ఈ సిరీస్ గెలిచేందుకు ఇరు జట్లలోని ఆటగాళ్లు వాళ్ల టీమ్ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఇక ఈసారి ఈ సిరీస్ మరింత ఎగ్జయిటింగ్ గా సాగనుంది. ఇంగ్లాండ్ దూకుడు మీద ఉంది. మాకు దూకుడు కొత్తేం కాదు. ఈ సిరీస్ ఇరు జట్ల అభిమానులకు ఫుల్ మీల్స్ వంటిది..’అని చెప్పుకొచ్చాడు.
కాగా బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్.. లంచ్ బ్రేక్ సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. జాక్ క్రాలే (61), ఓలీ పోప్ (31) రాణించగా బెన్ డకెట్ (12) విఫలయ్యాడు. ఆసీస్ బౌలర్లలో హెజిల్వుడ్, బొలాండ్, నాథన్ లియన్ లు తలా ఓ వికెట్ తీశారు. జో రూట్ (20 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.