BCCI: బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా 1983 ప్రపంచకప్ హీరో..? ఆ కేంద్రమంత్రి చేతిలోనే మంత్రదండం..
BCCI Elections: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఈనెల 18న కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈసారి ఆ అవకాశం 1983 వన్డే ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోజర్ బిన్నీకి దక్కేలా ఉందని తెలుస్తున్నది.
బీసీసీఐలో ఎన్నికల కోలాహలం మొదలైంది. బీసీసీఐ తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీతో పాటు పలు టాప్ పోస్టులు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారనే ఆసక్తి సర్వత్రా మొదలైంది.
అయితే ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే తిరిగి ఆ పదవిలో కూర్చోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు గంగూలనీ కాదని కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కు ఆ బాధ్యతలు అప్పజెప్పనున్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఆ పీఠానికి సంబంధించిన ‘సమీకరణాలు’ మారినట్టు తెలుస్తున్నది.
గంగూలీ, జై షా లను కాదని 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని కీలక సభ్యుడు రోజర్ బిన్నీ తదుపరి బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ‘తెరవెనుక మంత్రాంగం’ అంతా సిద్ధమైనట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
గతంలో జాతీయ సెలక్టర్ గా కూడా పనిచేసిన ఈ ఆల్ రౌండర్ పేరు గురువారం బీసీసీఐ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ లో కనిపించింది. బీసీసీఐ నిర్వహించబోయే వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) కోసం కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) తరఫున రోజర్ బిన్నీ పేరు కూడా ఉంది. గతంలో ఈ సమావేశానికి కేఎస్పీఏ తరఫున సెక్రటరీ సంతోష్ మీనన్ ఈ సమావేశాలకు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు బిన్నీ పేరు కనిపిస్తుండటం గమనార్హం.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మేరకు.. ‘గురువారం ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రస్తుతం బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ తో పాటు మాజీ అడ్మినిస్ట్రేటర్స్ కూడా హాజరయ్యారు. అయితే బీసీసీఐలో తదుపరి అధ్యక్షుడెవరు..? ఆఫీస్ బేరర్స్ ఎవరు..? అన్న విషయాలన్నీ ఓ టాప్ క్యాబినెట్ మినిస్టర్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఆ కేంద్ర మంత్రి ఎంత చెబితే బీసీసీఐలో అంతే. తదుపరి అధ్యక్ష, ఇతర పోస్టులపై ఆయన నిర్ణయమే ఫైనల్..’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
మరి ఈ టాప్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఎవరు..? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా రేసులోని రోజర్ బిన్నీ రావడం ఆశ్చర్యకరమే. తాజా పరిణామానుల బట్టి గంగూలీని భారత్ తరఫున ఐసీసీ రిప్రజెంటేటివ్ గా పంపిస్తూ.. జై షా, ఇతర పోస్టులను యథాతథంగా ఉంచుతూ బిన్నీకి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఈనెల 18న స్పష్టత రానున్నది.
బీసీసీఐ ఎన్నికల విషయానికొస్తే.. అక్టోబర్ 11, 12న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 13న ఆ నామినేషన్లను పరిశిలించి పోటీలో ఎవరున్నారనేది 14న వెల్లడిస్తారు. అక్టోబర్ 18న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.