Rohit Sharma: గాయంపై స్పందించిన హిట్మ్యాన్.. ఆసియా కప్ ముందు టీమిండియాకు కొత్త టెన్షన్
WI vs IND: టీమిండియా సారథి రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడు. విండీస్ తో మూడో టీ20 ఆడుతూ నడుము కండరాలు పట్టేయడంతో రోహిత్ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడ్డాడు.
భారత జట్టుకు సారథిగా నియమితుడయ్యాక ఓ సిరీస్ కు ఆడుతూ ఓ సిరీస్ కు విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడు. వెస్టిండీస్ తో మూడో టీ20 సందర్బంగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్.. నడుము కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బందిపడ్డాడు.
నిన్నటి మ్యాచ్ లో 164 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్.. 5 బంతుల్లో 11 పరుగులు చేశాడు. అల్జారీ జోసెఫ్ వేసిన రెండో ఓవర్లో మొదటి బంతికి సిక్సర్ బాదిన అతడు..మూడో బంతిని బౌండరీకి తరలించాడు. కానీ నాలుగో బంతి తర్వాత క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. నడుము కండరాలు పట్టేయడంతో అతడు ఇబ్బందిపడ్దాడు.
దీంతో టీమిండియా ఫిజియో కమలేష్ జైన్ వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో రోహిత్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అయితే రోహిత్ ఆడకున్నా సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ లు దాటిగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు.
అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తన గాయం గురించి మాట్లాడాడు. తనకిప్పుడు బాగానే ఉన్నా నాలుగో టీ20 నాటికి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. రోహిత్ మాట్లాడుతూ.. ‘నాకైతే ఇప్పుడు బాగానే ఉంది. కానీ తర్వాత మ్యాచ్ (ఆగస్టు 6న)కు అందుబాటులో ఉంటానా..? లేదా..? అని ఇప్పుడే చెప్పలేను. దానికింకా సమయముంది. ఆలోపు నేను పూర్తిగా కోలుకుంటానని భావిస్తున్నా..’ అని తెలిపాడు.
రోహిత్ స్పందన అలా ఉంటే బీసీసీఐ మాత్రం.. ‘రోహిత్ కు నడుం కండారలు పట్టేయడంతో ఇబ్బందిపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితిని బీసీసీఐ వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తున్నది..’ అని ట్విటర్ లో పేర్కొనడం గమనార్హం.
Asia Cup 2018
రోహిత్ కు వెన్నునొప్పి రావడంతో టీమిండియా ఫ్యాన్స్ లో కొత్త భయాలు మొదలయ్యాయి. ఆసియా కప్ ముందుున్న నేపథ్యంలో అతడు ఆ టోర్నీకి దూరమైతాడా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అదీగాక ఆ టోర్నీకి మరో మూడు వారాలే సమయముంది. దీంతో విండీస్ తో మిగిలిన రెండు మ్యాచులు ఆడకున్నా హిట్ మ్యాన్ విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడోనని ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది.