ఫీల్డింగ్ చేస్తూ బాల్ను బౌండరీలోకి తన్నిన వీరేంద్ర సెహ్వాగ్... అంపైర్ ఏం చేశాడంటే...
వీరేంద్ర సెహ్వాగ్... బ్యాటింగ్లో వీరబాదుడు చూపించే బ్యాట్స్మెన్. టెస్టులను వన్డేల్లా, వన్డేలను టీ20ల్లా ఆడే వీరేంద్ర సెహ్వాగ్, బౌలింగ్లోనూ స్పిన్తో వికెట్లు తీసేవాడు. అయితే ఫీల్డింగ్లో మాత్రం వీరూ, ఓ మ్యాచ్లో ఉద్దేశపూర్వకంగా చేసిన మిస్ ఫీల్డ్, పెనాల్టీ పడడానికి కారణమైంది...
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ను పక్కనబెట్టడానికి వాడిన అస్త్రం కూడా ఇదే... ఫీల్డింగ్లో నెమ్మదిగా కదులుతాడని...
అయితే వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో టెస్టుల్లో 91, వన్డేల్లో 93 క్యాచులు అందుకున్నాడు. బౌలింగ్లో వన్డేల్లో 96, టెస్టుల్లో 40 వికెట్లు పడగొట్టాడంటే... అది మామూలు విషయం కాదు...
అయితే 2010లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కావాలని ఫీల్డింగ్లో తప్పిదం చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. సౌతాఫ్రికా, ఇండియా మధ్య 2010లో కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో టెస్టులో జరిగిందీ సంఘటన...
Laxman-Sehwag
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అల్వీరో పీటర్సన్ 100 పరుగులు చేయగా, హషీమ్ ఆమ్లా 114 పరుగులు చేశాడు... మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయ్యారు.
ఇండియా తొలి ఇన్నింగ్స్లో 643/6 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 174 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 165 పరుగులు చేయగా సచిన్ టెండూల్కర్ 106 పరుగులు చేశాడు...
వీవీఎస్ లక్ష్మణ్ 260 బంతుల్లో 16 ఫోర్లతో 143, మహేంద్ర సింగ్ ధోనీ 187 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు...
రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన హర్భజన్ సింగ్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు మిగిలిన బ్యాట్స్మెన్ ముప్పుతిప్పలు పడుతుంటే, హషీమ్ ఆమ్లా మాత్రం ఓ ఎండ్లో వికెట్లకు అడ్డుగా నిలిచిపోయాడు...
Harbhajan Singh
180 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో హషీమ్ ఆమ్లా, పార్నెల్తో కలిసి 8వ వికెట్కి 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఎంతో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మిస్తుండడంతో దాదాపు 25 ఓవర్ల పాటు వికెట్ దక్కలేదు.
ఇషాంత్ శర్మ వేసిన ఓ ఓవర్లో హషీమ్ ఆమ్లా షాట్ ఆడి సింగిల్ తీసి, స్ట్రైయిక్ ఉంచుకోవాలని చూశాడు. అయితే ఆమ్లాకి స్ట్రైయిక్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో సెహ్వాగ్ బంతిని ఆపకుండా, బౌండరీలోకి తన్నాడు...
ఉద్దేశపూర్వకుండా ఫీల్డర్ బంతిని బౌండరీకి తరలించడం క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. దీంతో అంపైర్లు, టీమిండియాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఇలా క్రికెట్లో ఫీల్డింగ్ తప్పిదం కారణంగా పెనాల్టీ పడడం భారత్కి అదే మొదటిసారి...
ఎట్టకేలకు 64 బంతుల్లో 22 పరుగులు చేసిన పార్నెల్ను ఇషాంత్ శర్మ అవుట్ చేయడంతో సౌతాఫ్రికా ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 290 పరుగులకి ఆలౌట్ అయ్యింది. హషీమ్ ఆమ్లా 394 బంతుల్లో 16 ఫోర్లతో 123 పరుగులు చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్ తరుపున టెస్టుల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ బాదిన హస్మతుల్లా షాహిదీ, జింబాబ్వేతో జరిగిన టెస్టులో బౌండరీ లైన్కి ముందు ఆగిన బంతిని తీసుకునేందుకు, గీత అవతల కాలు పెట్టాడు. ఇలా ఉద్దేశపూర్వకంగా బౌండరీ ఇచ్చినందుకు ఆఫ్ఘాన్కి ఈ ఏడాదిలోనే కూడా ఐదు పరుగుల పెనాల్టీ పడింది.