కోహ్లీ వల్లే టెస్టుల్లో టాప్లోకి టీమిండియా! డ్రా కోసం ఆడమని చెప్పిన ధోనీ మాటలు పట్టించుకోకుండా..
టీమిండియాకి మాత్రమే కాదు, వరల్డ్ టెస్టు క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. 69 టెస్టుల్లో 40 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, వరుసగా ఐదేళ్ల పాటు టీమిండియాని టాప్ టీమ్గా నిలిపాడు. కోహ్లీ కెప్టెన్సీలో విదేశాల్లో అద్భుత విజయాలు అందుకుంది భారత జట్టు...
మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టుల నుంచి తప్పుకోవడంతో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ... అనిల్ కుంబ్లే నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియాని నెం.1 టీమ్గా మలచగలిగాడు ఎంఎస్ ధోనీ...
అయితే ఆ తర్వాత వరుస పరాజయాలతో భారత జట్టు ర్యాంకింగ్ పడిపోతూ వచ్చింది. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2-0 తేడాతో ఓడింది. ఈ సిరీస్ మధ్యలోనే మెల్బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ధోనీ, టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు..
చివరి టెస్టుకి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి ఏడాదిలోనే టీమిండియాని మళ్లీ నెం.1 టెస్టు టీమ్గా నిలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జరిగిన ఓ సంఘటనను తన ఆటోబయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’లో బయటపెట్టాడు అప్పటి భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...
dhoni kohli
‘‘2014లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్ టెస్టు జరుగుతోంది. ఆ మ్యాచ్లో గాయం కారణంగా ధోనీ ఆడలేదు, కోహ్లీ తాత్కాలిక కెప్టెన్గా ఉన్నాడు. ఆఖరి రోజు ఆస్ట్రేలియా 360+ పరుగుల టార్గెట్ని పెట్టింది. తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 115 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో టార్గెట్ని చేధించాలని కోహ్లీ ఫిక్స్ అయ్యాడు...
అయితే కెప్టెన్ ధోనీ ఆలోచన మాత్రం వేరేగా ఉంది. ఆఖరి రోజు 360 పరుగుల టార్గెట్ని చేధించడం కష్టమని మాహీ అనుకున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత హోటల్కి వెళ్లే సమయంలో బస్సులో విరాట్ కోహ్లీతో ధోనీ మాట్లాడాడు...
‘చూడు విరాట్, నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఈ టార్గెట్ని ఛేజ్ చేయగలవు. నువ్వు ఆ సత్తా ఉన్న ప్లేయర్వే, మా అందరికీ ఆ విషయం తెలుసు. అయితే ఓ కెప్టెన్గా నువ్వు మిగిలిన ప్లేయర్ల గురించి కూడా ఆలోచించాలి...
మిగిలిన ప్లేయర్లు నీలా టార్గెట్ కోసం ఆడగలరా? ఆఖరి రోజు 360 కొట్టగలరా? నిర్ణయం తీసుకునేటప్పుడు టీమ్లోని మిగిలిన ప్లేయర్ల గురించి కూడా ఆలోచించాలి...’ అని విరాట్తో అన్నాడు ధోనీ...
దానికి విరాట్... ‘మనం ప్రయత్నిస్తేనే కదా.. చేయగలమో లేదో తెలుస్తుంది. ఇంతకుముందు మనం ఎప్పుడూ ఆఖరి రోజు 360 పరుగుల టార్గెట్ని ఛేదించలేదు, ఎందుకంటే ఎప్పుడూ మనం ట్రై చేయలేదు.... ఈసారి ప్రయత్నించి చూద్దాం. టీమ్ ఎంత బలంగా ఉందో మనకి అర్థమవుతుంది...’ అని చెప్పాడు...
ఆ మాటలు వినగానే ధోనీకి ఓ నమ్మకం వచ్చింది. ధోనీ టెస్టు రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ టీమిండియా టెస్టుల్లో నెం.1 టీమ్ అవుతుందని ముందుగానే ఊహించాం. ఎందుకంటే అతని ఆలోచనావిధానం అలాంటిది...
గెలవడానికి ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు కానీ డ్రా కోసం ఆడకూడదని విరాట్ అనుకుంటాడు. అలాంటిది టీమ్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ పడిపోవడాన్ని విరాట్ గమనించాడు. టెస్టుల్లో ఫిట్నెస్పై తీవ్రంగా ఫోకస్ పెట్టాడు...
తాను ఫిట్గా ఉంటే, మిగిలిన ప్లేయర్లకు రోల్ మోడల్గా మారవచ్చని తన ఫిట్నెస్పై తీవ్రమైన కృషి చేశాడు. అతను అనుకున్నట్టే చాలామంది భారత ప్లేయర్లు, ఫిట్నెస్ని సీరియస్గా తీసుకోవడం మొదలెట్టారు. అది టీమిండియా ఆటతీరునే మార్చేసింది... ఆ క్రెడిట్ మొత్తం విరాట్కి దక్కాల్సిందే....’’ అంటూ రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్...
ఆడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఆఖరి రోజు 363 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, శిఖర్ ధావన్ (9), ఛతేశ్వర్ పూజారా (21) వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే విరాట్ కోహ్లీ, మురళీ విజయ్ కలిసి మూడో వికెట్కి 185 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
Murali Vijay
99 పరుగులు చేసిన మురళీ విజయ్ అవుటైన తర్వాత అజింకా రహానే డకౌట్ కాగా రోహిత్ శర్మ 6, సాహా 13, షమీ 6, వరుణ్ అరోన్ 1, ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యారు. దీంతో ఒకానొక స్థితితో 242/2 స్కోరుతో ఉన్న టీమిండియా, 315 పరుగులకి ఆలౌట్ అయ్యి 48 పరుగుల తేడాతో ఓడింది..
తొలి ఇన్నింగ్స్లో 115 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో 175 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్తో 141 పరుగులు చేశాడు.. మురళీ విజయ్ 99 పరుగులు చేసి, 1 పరుగు తేడాతో సెంచరీ మిస్ కాగా ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ 7 వికెట్లు పడగొట్టాడు..