- Home
- Sports
- Cricket
- జహీర్ ఖాన్తో ఫ్రాంక్ చేసిన ఇంగ్లాండ్ టీమ్... చిర్రెత్తుకొచ్చిన భారత పేసర్ ఏం చేశాడంటే..
జహీర్ ఖాన్తో ఫ్రాంక్ చేసిన ఇంగ్లాండ్ టీమ్... చిర్రెత్తుకొచ్చిన భారత పేసర్ ఏం చేశాడంటే..
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సౌమ్యులపై ప్లేయర్లు, టీమ్లో ఉన్న సమయంలోనే వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ వంటి దూకుడైన ప్లేయర్లు... ప్రత్యర్థికి నోటితోనే బదులు ఇచ్చేవాళ్లు...

టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, ఇలా ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవ పడిన సందర్భాలు చాలా తక్కువే. తన బౌలింగ్ తాను వేసి, వెళ్లి ఫీల్డింగ్ చేయడమే తన పనిగా ఉండే జహీర్ ఖాన్... సాధ్యమైనంత వరకూ గొడవలకు దూరంగా ఉండేవాడు...
2007 ట్రెంట్బ్రిడ్జ్ టెస్టులో జహీర్ ఖాన్, మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో ఓ ఇంగ్లీష్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు జహీర్ ఖాన్...
‘మేం ఆ మ్యాచ్లో మొదట బౌలింగ్ చేశాం. వాళ్లను తక్కువ స్కోరుకే అవుట్ చేశాం. మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. మొదటి ఇన్నింగ్స్లో మేం చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాం. మాకు ఆధిక్యం రాగానే ఇంగ్లాండ్ ప్లేయర్లు, మా ఏకాగ్రతను దెబ్బ తీయడానికి ప్రయత్నం చేశారు..
స్లిప్లో ఉన్న కొందరు నా పైన జెల్లీ బీన్స్ వేయడం మొదలెట్టారు. మొదట నేను వాటిని అంత పట్టించుకోకుండా బ్యాటుతో తీసేశాను. మళ్లీ వేశారు. మళ్లీ మళ్లీ వేశారు. ఏం జరుగుతుందో నాకు అప్పటికే అర్థమైంది. వెంటనే స్లిప్లో ఉన్న ప్లేయర్లవైపు చూసి ఏదో తిట్టాను..
Zaheer Khan
అక్కడున్న కేవిన్ పీటర్సన్ మొదట స్పందించాడు. అతను ఏదో అన్నాడు, నేను ఏదో అన్నాను. పెద్ద రచ్చే జరిగింది. అంపైర్లు వచ్చి జరిగింది తెలుసుకుని, వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. నేను ఎవ్వర్నీ టార్గెట్ చేయాలనుకోలేదు, కేవిన్ పీటర్సన్ ముందుగా స్పందించాడు. అందుకే అతనిపై అరిచేశాను..’ అంటూ కామెంట్ చేశాడు జహీర్ ఖాన్..
2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన భారత జట్టు, మొదటి టెస్టుని డ్రా చేసుకుంది. ట్రెంట్బ్రిడ్జిలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అలెస్టర్ కుక్ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు..
Kevin Pietersen
దినేశ్ కార్తీక్ 77, వసీం జాఫర్ 62, రాహుల్ ద్రావిడ్ 37, సచిన్ టెండూల్కర్ 91, సౌరవ్ గంగూలీ 79, వీవీఎస్ లక్ష్మణ్ 54 పరుగులు చేయగా అనిల్ కుంబ్లే 30 పరుగులు చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 481 పరుగుల భారీ స్కోరు చేసింది. ధోనీ 5 పరుగులు చేయగా జహీర్ ఖాన్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు..
రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 355 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మైకేల్ వాగన్ 124 పరుగులు చేయగా పాల్ కాలింగ్వుడ్ 63, ఆండ్రూ స్ట్రాస్ 55 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన జహీర్ ఖాన్, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసిన టీమిండియా, 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది..
Image credit: Getty
మూడో టెస్టు కూడా డ్రాగా ముగియడంతో 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది భారత జట్టు. రెండో టెస్టులో 9 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు 3 టెస్టుల్లో 18 వికెట్లు తీసి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలిచాడు.