ఏం చిన్న పిల్లలా ఆటలనుకుంటున్నావా..? ఇషాన్ చేసిన పనికి గవాస్కర్ ఆగ్రహం
INDvsNZ: టీమిండియా యువ వికెట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేసిన ఓ పని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు ఆగ్రహం తెప్పించింది. ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యుండి ఇలా చేయడమేంటని సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్.. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాది.. భారత్ తరఫున ద్విశతకం చేసిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే నిన్నటి మ్యాచ్ లో ఇషాన్.. కివీస్ బ్యాటింగ్ చేస్తుండగా చేసిన పని అభిమానులకు, ఆటగాళ్లకు నవ్వు తెప్పించగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు మాత్రం కోపం తెప్పించింది. ఇదేం చిన్నపిల్లల ఆట కాదని, అసలు అతడు ఆడేది క్రికెట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంతకూ ఇషాన్ ఏం చేశాడంటే.. కివీస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో నాలుగో బంతికి కివీస్ సారథి టామ్ లాథమ్.. డిఫెన్స్ ఆడబోయిన బంతి కాస్తా మిస్ అయింది. అయితే లాథమ్ పూర్తి క్రీజులోకి వచ్చి బంతిని ఆడబోయాడు. అదే క్రమంలో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో టీమిండియా ఆటగాళ్లు హిట్ వికెట్ తాకాడేమో అని అంపైర్ కు అప్పీల్ చేశారు.
కానీ టీవీ రిప్లేలో మాత్రం లాథమ్ పూర్తి నియంత్రణలో ఉన్నాడు. వికెట్ల వెనుక ఉన్న ఇషానే.. ఎవరూ చూడటం లేదని గ్లవ్స్ తో బెయిల్స్ ను పడగొట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఔట్ అని అప్పీల్ చేశాడు. టీవీ అంపైర్ రివ్యూలో ఇది స్పష్టంగా తేలింది. థర్డ్ అంపైర్ గా నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో ఇషాన్ తో పాటు లాథమ్, టీమిండియా క్రికెటర్ల ముఖాల్లో నవ్వులు విరబూశాయి.
అయితే కామెంట్రీ రూమ్ లో ఉన్న సునీల్ గవాస్కర్ మాత్రం ఇషాన్ చర్యను ఖండించాడు. టీవీ రిప్లే చూసిన తర్వాత.. ‘అసలు అతడు ఏం చేస్తున్నాడు..? అది క్రికెట్టే కాదు. ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యుండి ఇలా చేస్తే ఎలా..?’ అని వాపోయాడు.
సన్నీతో పాటు కామెంట్రీ చెబుతున్న మురళీ కార్తీక్ కూడా ఇషాన్ చర్యపై అసంతృప్తిగా వ్యక్తం చేశాడు. ఒకవేళ ఇషాన్ ఇది ఫన్ కోసం చేసిఉంటే అతడు అంపైర్ కు అప్పీల్ చేయకుండా ఉంటే బాగుండేదని, ఇలా చేసి టైమ్ వేస్ట్ చేయడం ఏమీ బాగోలేదని అన్నాడు. మ్యాచ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ఆటగాళ్లు ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ చేస్తుంటారని, వాటిని చూసీ చూడనట్టు వదిలేయాలని వీడియోలు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక డబుల్ సెంచరీ చేసిన తర్వాత లంకతో వన్డే సిరీస్ లో టీమ్ మేనేజ్మెంట్ ఇషాన్ ను ఆడించలేదు. తిరిగి అతడు కివీస్ తో సిరీస్ కు జట్టులోకి వచ్చాడు. నిన్న ఉప్పల్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి దారుణంగా విఫలమయ్యాడు. కెఎల్ రాహుల్ గైర్హాజరీతో కిషన్ కు వికెట్ కీపింగ్ ఛాన్స్ కూడా వచ్చింది.