Ind Vs Nz: అతడు చేసిన తప్పేంటి..? కివీస్ తో టెస్టులకు తెలుగు కుర్రాడిని ఎంపికచేయకపోవడంపై అజయ్ జడేజా మండిపాటు
Hanuma Vihari: న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ కు తెలుగు కుర్రాడు హనుమ విహారిని ఎంపికచేయకపోవడంపై భారత మాజీ క్రికెటర్.. సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు.
ఈ నెల 25 నుంచి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో మొదలుకాబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే జట్టును ప్రకటించగా.. వారిలో తుది జట్టులో ఆడేదెవరనే విషయంపై తుది కసరత్తు జరుగుతున్నది.
అయితే ఈ టెస్టు సిరీస్ కోసం తెలుగు కుర్రాడు హనుమ విహారిని ఎంపికచేయకపోవడంపై భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా.. సెలెక్టర్లపై మండిపడ్డాడు. అతడు చేసిన తప్పేంటని అసహనం వ్యక్తం చేశాడు.
జడేజా మాట్లాడుతూ.. ‘పాపం విహారి.. అతడిని తలుచుకుంటే బాధేస్తుంది. గత కొంతకాలంగా టీమిండియాతో పర్యటిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడు చేసిన తప్పేంటి..?
విహారి దక్షిణాఫ్రికాతో జరిగే ఇండియా-ఏ పర్యటనకు ఎందుకు వెళ్లాలి..? అతడు న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో ఎందుకు ఆడకూడదు..? అది కుదరకపోతే అతడిని ఇండియా-ఏ పర్యటనకూ పంపకుండా ఉండాల్సింది.
ఇన్ని రోజులు జట్టుతో కలిసి ఉన్న ఆటగాడు వెళ్లి ఇండియా-ఏ కు ఆడుతుంటే.. మరోవైపు కొత్త కుర్రాళ్లు వచ్చి జట్టు తరఫున ఆడుతుండటం వంటివి క్రికెట్ అభిమానులకు గందరగోళానికి గురి చేస్తాయి..’ అని తెలిపాడు.
28 ఏండ్ల ఈ కాకినాడ (ఆంధ్రప్రదేశ్) కుర్రాడు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సభ్యుడు. సిడ్నీ టెస్టులో భారత్ ను ఓటమి నుంచి తప్పించడానికి అతడు.. అశ్విన్ తో కలిసి పోరాటం చేశాడు.
ఆ మ్యాచ్ లో ఓటమి అంచుల్లో ఉన్న భారత్ ను విహారి.. (161 బంతుల్లో 23), అశ్విన్ (128 బంతుల్లో 39) తో కలిసి ఆదుకున్నారు. చివరికి ఆ మ్యాచ్ డ్రా గా ముగియడంలో విహారి పాత్ర కీలకం. ఆ టెస్టులో గాయమైనా.. నొప్పిని ఓర్చుకుని మరీ బ్యాటింగ్ చేశాడు విహారి.
కానీ ఆ సిరీస్ తర్వాత అతడు మళ్లీ టీమిండియాకు ఆడలేదు. ఈ ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా విహారి తిరిగి భారత జట్టుకు ఎంపికవుతాడని భావించినా అతడికి అవకాశం రాలేదు.
ఇక తాజాగా జరుగుతున్న న్యూజిలాండ్ తో సిరీస్ లో విరాట్ కోహ్లి తో పాటు పలువురు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటుండంతో ఈసారైనా సెలెక్టర్లు అతడి వైపు మొగ్గు చూపుతారని ఆశించినా అతడికి నిరాశే ఎదురైంది.
కాగా.. విహారిని న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికచేయకపోవడం పై సెలెక్టర్లపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అతడిని దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత-ఏ జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ హనుమ విహారి నిరూపించుకుంటే త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ లో అవకాశం దక్కవచ్చునని తెలుస్తున్నది.