రోహిత్ మీద మాకేం ప్రేమ లేదు.. కోహ్లీపై కోపంతో అలా చేశాం : చేతన్ శర్మ
Chetan Sharma Sting Operation: బీసీసీఐ రహస్యాలను బట్టబయలు చేసిన చేతన్ శర్మ రెండేండ్ల క్రితం కెప్టెన్లను మార్చడం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ మీద తమకేం ప్రేమ లేదని చెప్పాడు.

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ చేతన్ శర్మ తాజాగా ‘జీ న్యూస్’ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో బీసీసీఐ రహస్యాలను బట్టబయలు చేయడం సంచలనం రేపింది. ఈ వీడియోలో చేతన్.. ప్రధానంగా గంగూలీ - కోహ్లీ విభేదాలు, రోహిత్ - కోహ్లీల ఈగో, ఆటగాళ్ల ఫిట్నెస్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
చేతన్ శర్మ మాట్లాడినదాంట్లో అతి ముఖ్యంగా రోహిత్ - కోహ్లీ ల మధ్య కెప్టెన్సీ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయని.. వాళ్లిద్దరూ ఎదురుపడితే మాట్లాడుకోవడం లేదని.. రోహిత్ కు మంచి చేయడానికి బీసీసీఐ కోహ్లీ కెరీర్ ను నాశనం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా విరాట్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు.
ఈ విషయంలో చేతన్ సంచలన విషయాలు వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. ‘మాకు రోహిత్ మీద ప్రేమేం లేదు. మేం కోహ్లీకి వ్యతిరేకంగా ఉన్నందునే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ కు సారథ్య పగ్గాలు అప్పగించాం. దానికి విరాట్ పేలవ ఫామ్ కూడా మాకు కలిసొచ్చింది. వాస్తవానికి ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అయిన కోహ్లీతో మేం అలా వ్యవహరించి ఉండకూడదు.
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు కోహ్లీకి ఈ విషయంలో పునరాలోచించుకోవాలని బీసీసీఐ, సెలక్షన్ కమిటీ, గంగూలీ సూచించాడు. కానీ సౌతాఫ్రికా టూర్ కు ముందు కోహ్లీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని పెద్దది చేసేలా మాట్లాడాడు. గంగూలీ - కోహ్లీ మధ్య ఉన్న విభేదాలకు తోడు ఈ విషయంలో కోహ్లీ అబద్దాలు చెప్పాడు...’అని చెప్పాడు.
అంతేగాక రోహిత్ - కోహ్లీల మధ్య విభేదాలేమీ లేవని కానీ వారి మధ్య ఈగో మాత్రమే ఉందని చేతన్ అన్నాడు. అది కూడా వృత్తిపరమైన అహమే తప్ప వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారని చేతన్ అన్నాడు. కోహ్లీ పేలవ ఫామ్ లో ఉన్నప్పుడు రోహిత్ అండగా నిలిచిన విషయాన్ని కూడా చేతన్ ప్రస్తావించాడు.
కాగా 2021 అక్టోబర్ లో దుబాయ్ వేదికగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ కు ముందే కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ టోర్నీలో భారత్ కనీసం సెమీస్ కు కూడా వెళ్లలేదు. ఆ తర్వాత డిసెంబర్ లో భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లడానికి కొద్దిరోజుల ముందే అతడిని వన్డేల నుంచి తప్పించింది బీసీసీఐ. ఆ సందర్భంగా బీసీసీఐ - కోహ్లీ మధ్య వివాదం భారత క్రికెట్ ను ఓ ఊపు ఊపింది.
ఈ టెస్టు సిరీస్ కు వెళ్లడాని కంటే ముందు కోహ్లీ ప్రెస్ మీట్ లో గంగూలీ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు దాదా... ‘టీ20 కెప్టెన్సీ వదిలేసేప్పుడు మరోసారి ఆలోచించుకోవాలని నేను కోహ్లీకి చెప్పాను..’ అని వ్యాఖ్యానించగా.. అసలు గంగూలీ తనతో ఆ విషయమే చెప్పలదేని, అలా ఎప్పుడు చెప్పాడో తననే అడగాలని ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు.
తాజాగా చేతన్.. ‘‘కోహ్లీ - గంగూలీ మధ్య విభేదాలు ఉండేవి. విరాట్ తాను బీసీసీఐ కంటే ఎక్కువ అని ఫీలయ్యేవాడు. కుంబ్లే కోచ్ గా తప్పుకున్నాక తిరిగి రవిశాస్త్రి టీమిండియా కోచ్ గా ఎంపిక కావడంలో అతడిదే కీలక పాత్ర. తొలుత టీ20 కెప్టెన్సీ నుంచి తాను వైదొలుగుతున్నానని చెప్పినప్పుడు మరోసారి ఆలోచించుకోవాలని దాదా చెప్పాడు. సమావేశంలో మేము 9 మంది ఉన్నాం. మరి గంగూలీ మాటలు కోహ్లీ విన్నాడో లేదో తెలియదు గానీ దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లేముందు ఈ వివాదంలో విలేకరులతో మాట్లాడుతూ కోహ్లీ అబద్దం చెప్పాడు..’’ అని చెప్పి సంచలనాలకు తెరతీశాడు.