ఆ రోజు బ్రెండన్ మెక్కల్లమ్ను కాలర్ పట్టుకుని, కొట్టాలని అనుకున్నా... - రవిచంద్రన్ అశ్విన్
భారత జట్టులో మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్గా విరాట్ కోహ్లీకి గుర్తింపు వచ్చింది కానీ రవిచంద్రన్ అశ్విన్కి అంతకుమించి కోపం ఎక్కువ. ఫీల్డ్లో కానీ, మీడియా సమావేశంల్లో కానీ అశ్విన్ కోపాన్ని చాలా ఈజీగా గమనించవచ్చు. మనడ్కింగ్ వివాదం తర్వాత కోపం తగ్గించుకున్న అశ్విన్, ఒక మ్యాచ్ సమయంలో బ్రెండన్ మెక్కల్లమ్ను కాలర్ పట్టుకుని, కొట్టాలని అనుకున్నాడట.
ఐపీఎల్ 2014లో జరిగిందీ సంఘటన. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్తో తలబడింది సీఎస్కే. ఇరు జట్లు హోరాహోరీగా తలబడ్డాయి.
పంజాబ్ విధించిన 227 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్కి సురేశ్ రైనా మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మొదటి బంతికే సిక్సర్ బాదిన రైనా, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
25 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేసిన సురేశ్ రైనా... 348 స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. రైనా ఐపీఎల్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ల్లో ఇది కూడా ఒకటి. సురేశ్ రైనా బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఈజీగా టార్గెట్ను చేధించేలా కనిపించింది సీఎస్కే.
అయితే నాన్స్ట్రైయికింగ్ ఎండ్లో ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బ్రెండ్ మెక్కల్లమ్తో ఏర్పడిన సమన్వయ లోపం కారణంగా సురేశ్ రైనా రనౌట్ అయ్యాడు. ఈ సంఘటన గురించి తాజాగా మాట్లాడాడు రవిచంద్రన్ అశ్విన్.
సురేశ్ రైనాతో కలిసి ఫేస్బుక్ వేదికగా నిర్వహించిన లైవ్లో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్... ‘ఆ మ్యాచ్ నీకు ఇంకా గుర్తింది అనుకుంటా. ఆ రోజు నువ్వు ముంబైలో ఓ వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా బ్యాటింగ్ చేశావు. పంజాబ్పై 230 టార్గెట్ను ఆరు ఓవర్లలోనే సగం దాకా తెచ్చేశావు....
బౌలింగ్ ఎవరు వేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ చెలరేగిపోయావు. ఆ రోజు నువ్వు అవుటైన తర్వాత నాకు చెప్పలేనంత కోపం వచ్చింది.
నువ్వు అవుట్ కావడానికి కారణమైన ఆ బ్రెండన్ మెక్కల్లమ్ను గల్లా పట్టుకుని పైకి లేపి, కొట్టాలనిపించింది. అయితే తర్వాతి ఓవర్లనే బజ్ (బ్రెండన్ మెక్కల్లమ్) కూడా రనౌట్ అయ్యాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు.
2014 క్వాలిఫైయర్ 2లో పంజాబ్ తరుపున ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 122 పరుగులు చేయగా మనన్ వోహ్రా 34, డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 38 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగుల భారీ స్కోరు చేసింది పంజాబ్.
227 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన సీఎస్కే డ్వేన్ స్మిత్ 7, డుప్లిసిస్ డకౌట్ వికెట్లను త్వరగా కోల్పోయింది. అయితే వన్డౌన్లో వచ్చిన సురేశ్ రైనా 25 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగిపోయాడు. తాను ఎదుర్కొన్న 4.1 ఓవర్లలోనే 87 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అయితే మెక్కల్లమ్ సరిగా స్పందించకపోవడంతో జార్జ్ బెయిలీ త్రోకి రైనా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో 16 బంతుల్లో 11 పరుగులు చేసిన మెక్కల్లమ్ కూడా రనౌట్ అయ్యాడు. జడేజా 27, ఎమ్మెస్ ధోనీ 42 పరుగులు చేసినా 20 ఓవర్లలో 202 పరుగులే చేయగలిగింది సీఎస్కే.
‘భారత జట్టు తరుపున సురేశ్ రైనా, మాహీ భాయ్ 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ ఎన్నో సార్లు మ్యాచులు గెలిపించారు. ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తే, చాలా మ్యాచుల్లో పరుగులు చేయడానికి కావాల్సినన్ని బంతులు దొరకవు.
క్రీజులోకి వచ్చాక సెటిల్ అవ్వడానికి సమయం కూడా ఉండదు. అందుకే రాగానే భారీ షాట్లు కొట్టడానికి ప్రయత్నించి రైనా అవుట్ అయ్యేవాడు. అది అంత తేలికైన పని కాదు. అయితే మాహీ భాయ్ ఈ పనిని అద్భుతంగా చేసేవాడు’ అంటూ వివరించాడు రవిచంద్రన్ అశ్విన్.