నటరాజన్ వెనక వీరేంద్ర సెహ్వాగ్... ‘నట్టూ’ సక్సెస్ స్టోరీ గురించి వీరూ ఏం చెప్పాడంటే...
టి. నటరాజన్... భారత జట్టులో ఓ సంచలనం. ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన నటరాజన్... అద్బుతమైన యార్కర్లతో అందర్నీ ఆకట్టుకున్నాడు. పెద్దగా దేశవాళీ క్రికెట్ ఆడకుండానే ఐపీఎల్లో మెరిసిన నటరాజన్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి తీసుకొచ్చింది భారత మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు వీరూ.
‘పంజాబ్ జట్టులో కొందరు తమిళనాడు ప్లేయర్లు నాకు నటరాజన్ గురించి చెప్పారు. వాళ్లు మరీ అంత స్పెషల్గా చెప్పడంతో నటరాజన్ బౌలింగ్ వీడియోలు చూశాను..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోసం అతన్ని తీసుకున్నప్పుడు చాలా సంతోషించాను.. అయితే చాలామంది కనీసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడని ప్లేయర్ను తీసుకున్నందుకు నన్ను విమర్శించారు...
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అతని ఆట చూసి ఓ ప్లేయర్కి అంత ధర పెట్టడం అందర్నీ షాక్కి గురి చేసింది. అయితే ధర గురించి మేం బాధపడలేదు...
నటరాజన్లో టాలెంట్ ఉందని నాకు తెలుసు. అతనో అద్భుతమైన బౌలర్. డెత్ ఓవర్లో అస్త్రంలా పనిచేస్తాడు... పంజాబ్కి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్లు లేకపోవడంతో నటరాజన్ను తీసుకున్నాం...
కానీ బ్యాడ్లక్ ఆ ఏడాది గాయం కారణంగా అతను పెద్దగా ఐపీఎల్ ఆడలేకపోయాడు... అయితే అతను ఆడిన మ్యాచుల్లో మాత్రమే పంజాబ్ గెలిచింది, మిగిలిన వాటిలో ఓడిపోయింది...
మొదటి టీమిండియా తరుపున టీ20లు ఆడతాడని అనుకున్నా, కానీ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు....’ అని చెప్పుకొచ్చాడు వీరంద్ర సెహ్వాగ్.
యార్కర్లతో అదరగొడుతున్న నటరాజన్, ఇలాగే ఆడుతూ టీమిండియాలో స్టార్ బౌలర్గా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
2017 ఐపీఎల్ సీజన్లో టి నటరాజన్ను రూ.3 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఆ సీజన్లో అతని బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు మాత్రమే...
2017 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున 6 మ్యాచులు ఆడిన నటరాజన్... కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు...
2018 సీజన్లో రూ.40 లక్షలకు నటరాజన్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్, రెండు సీజన్లలో నటరాజన్కి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈ సీజన్లో భువనేశ్వర్ కుమార్ గాయపడడం, సిద్ధార్థ్ కౌల్ పెద్దగా రాణించకపోవడంతో అన్యూహ్యంగా జట్టులోకి వచ్చాడు నటరాజన్.
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున 16 మ్యాచులు ఆడిన నటరాజన్ 16 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో ఓవర్కి ఆరుకి ఆరు యార్కర్లు వేసి, సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, బ్రెట్లీ వంటి మాజీ క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు నట్టూ.
ఐపీఎల్ 2020 తర్వాత ఆసీస్ టూర్కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో నటరాజన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో వన్డే ఆరంగ్రేటం చేసిన నట్టూ, ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడిని విడదీశాడు.