ఫేమ్ను పొందడం వ్యాధి వంటిది.. నేను దాన్నుంచి బయటపడాలనుకుంటున్నా : కోహ్లీ ఇన్స్టా స్టోరీ వైరల్
Virat Kohli: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా పలు ఆసక్తికర పోస్టులు చేసుకొచ్చాడు. అధికంగా వచ్చే కీర్తి వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ అని రాసి ఉన్న కోట్స్ ను కోహ్లీ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ లో 230 మిలియన్ల (సుమారు 23 కోట్లు) మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్స్టాలో కోహ్లీ ఏదైనా పెయిడ్ పోస్ట్ పెడితే తీసుకునే పారితోషికం కూడా కోట్లల్లోనే ఉంటుంది. మ్యాచ్ లకు సంబంధించిన ఫోటోలు, అప్డేట్స్ ను కోహ్లీ తన ఖాతాలో పంచుకుంటాడు.
తాజాగా కోహ్లీ ఇన్స్టా స్టోరీస్ లో చేసిన పోస్టులు ఆసక్తికరంగా మారాయి. బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ టామ్ హంక్స్ లు తమ ఫేమ్, లైఫ్ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు అందులో ఉన్నాయి.
ఇర్ఫాన్ ఖాన్ ఫోటోతో షేర్ చేసిన కోట్ లో.. ‘ఫేమ్ ను కావాలనుకోవడం ఏదైనా వ్యాధి వంటిది. అయితే ఏదో ఒకరోజు నేను ఈ వ్యాధి నుంచి బయటపడతా. ఈ ఫేమ్ నుంచి నేను విముక్తి పొందాలనుకున్నా. పేరు, ప్రఖ్యాతుల మీద నాకు పట్టింపు లేదు. సాధారణ జీవితం గడిపితే చాలు..’ అని రాసి ఉంది.
మరో స్టోరీలో టామ్ హంక్స్ ఓ వీడియోలో మాట్లాడిన మాటలను కోహ్లీ షేర్ చేశాడు.. ‘దిస్ షల్ టూ పాస్ (ఈ దశ కూడా దాటిపోతుంది) అని నాకు తెలిసి ఉండే బాగుండేది. మీరు కోపంగా ఉన్నారా..? మీ మనోస్థితి బాగోలేదా..? ఇది కూడా గడిచిపోతే బాగుండు. మీరెప్పుడూ గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. మీకు అన్ని ఆన్సర్స్ తెలుసు. అందరూ మిమ్మల్ని అందుకుంటారు..’అని ఆ వీడియోలో ఉంది..
అయితే కోహ్లీ ఇవి ఇప్పుడు ఎందుకు షేర్ చేశాడన్నదే ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ పండితులకు అంతు చిక్కడం లేదు. గతేడాది ఆసియా కప్ ముందువరకూ ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డ కోహ్లీ ఇటీవల మళ్లీ గాడిలో పడ్డాడు. టీ20 తో పాటు వన్డేలలో కూడా సెంచరీలు చేశాడు. కుటుంబంపరంగా కూడా అనుష్కతో విభేదాలు వచ్చినట్టు వార్తలైతే రాలేదు.
మరి కోహ్లీ దేనిగురించి ఈ స్టోరీస్ షేర్ చేశాడనేది అంతుచిక్కకుండా ఉంది. అయితే దీనికి గల కారణాలు ఏంటో కోహ్లీకే తెలియాలి. బంగ్లాదేశ్ తో వన్డే, టెస్టు సిరీస్ లో పాల్గొన్న కోహ్లీ.. తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్ కు దూరంగా ఉన్నాడు. కానీ అతడు ఈనెల 10 నుంచి లంకతో మొదలుకాబోయే వన్డే సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉంటాడు.