టీమిండియా హెడ్కోచ్ రికార్డులను చెరిపేయడానికి దూసుకొస్తున్న పరుగుల యంత్రం..
IND vs AUS 1st T20I: రికార్డుల రారాజుగా పేరున్న కోహ్లీ.. నేడు ఆస్ట్రేలియాతో జరుగబోయే తొలి టీ20లో 63 పరుగులు చేస్తే చాలు. టీమిండియా హెడ్కోచ్ గా ఉన్న మిస్టర్ డిపెండెబుల్ రాహుల్ ద్రావిడ్ రికార్డులు..
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వెయ్యి రోజుల తర్వాత ఇటీవలే ఆసియా కప్ లో సెంచరీతో మెరిశాడు. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ తో కలిసి ఉన్న కోహ్లీ.. మరో రికార్డుపై కన్నేశాడు.
రికార్డుల రారాజుగా పేరున్న కోహ్లీ.. నేడు ఆస్ట్రేలియాతో జరుగబోయే తొలి టీ20లో 63 పరుగులు చేస్తే చాలు. టీమిండియా హెడ్కోచ్ గా ఉన్న మిస్టర్ డిపెండెబుల్ రాహుల్ ద్రావిడ్ రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయి.
ఆసీస్ తో తొలి మ్యాచ్ లో కోహ్లీ 63 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ద్రావిడ్ ను దాటనున్నాడు. ద్రావిడ్.. 509 అంతర్జాతీయ మ్యాచ్ లలో 24,064 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలున్నాయి.
కోహ్లీ.. ఇప్పటివరకు 468 మ్యాచ్ లలోనే 24,002 పరుగులు సాధించాడు. కోహ్లీ కెరీర్ లో ఇప్పటికే 71 సెంచరీలు ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ద్రావిడ్ సగటు 45.41 గా ఉండగా కోహ్లీ సగటు 53.81గా ఉంది.
ఇక అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ తన సుదీర్ఘ కెరీర్ లో 664 మ్యాచులలో 34,357 పరుగులు సాధించాడు. సచిన్ వంద సెంచరీలు పూర్తి చేసిన తొలి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
ఆసియా కప్ కు ముందు ఫామ్ కోల్పోయి క్రీజులో నిలబడటానికే ఇబ్బందులు పడ్డ విరాట్ కోహ్లీ.. ఈ టోర్నీలో మాత్రం రాణించాడు. టోర్నీ ఆసాంతం మెరుగ్గా రాణించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఈ టోర్నీలోనే కోహ్లీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్ లో తొలి సెంచరీ చేయడం విశేషం.