విరాట్ కోహ్లీ దూకుడే అతని కెప్టెన్సీ పోవడానికి కారణమైందా... హెడ్కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఎంట్రీతో...
టీమిండియాకి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అయినా, మాహీకి కూడా సాధ్యం కాని విజయాలను, రికార్డులను నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ... భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి కోహ్లీ అగ్రెసివ్ క్యారెక్టరే కారణమట...
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచినా, ప్రత్యర్థ జట్లను భయపెట్టింది లేదు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా దాన్ని చేసి చూపించింది...
ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ టీమ్ను వణికించిన టీమిండియా, ఆస్ట్రేలియాలో అహంకారాన్ని నరనరాన నింపుకున్న ఆసీస్ ప్రేక్షకకుల మధ్య ఆస్ట్రేలియా జట్టును భయపెట్టగలిగింది. దీనికి కారణం విరాట్ కోహ్లీ దూకుడు మంత్రమే...
ఎమ్మెస్ ధోనీ మ్యాచ్ ఓడిపోయినా చాలా తేలిగ్గా తీసుకునేవాడు, అదే లక్షణం జట్టుకి కూడా ఉండేది. ఎవరైనా సెడ్జింగ్ చేసినా, భారత ప్లేయర్లలో ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లు పెద్దగా స్పందించేవాళ్లు కాదు...
అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీన్ మారిపోయింది... టీమిండియాను సెడ్జ్ చేయాలంటే భయపడెలా ఎదురుదాడి చేయడం మొదలెట్టాడు విరాట్ కోహ్లీ... ఇదే జట్టును టెస్టుల్లో టాప్ టీమ్గా నిలబెట్టింది..
వన్డే కెప్టెన్గా విరాట్ కహ్లీ తిరుగులేని రికార్డులు నమోదు చేశాడు. 2017 ఆరంభంలో ఎమ్మెస్ ధోనీ నుంచి వన్డే కెప్టెన్సీ తీసుకున్న విరాట్ కోహ్లీ, ఆ ఏడాది వన్డేల్లో 1460 పరుగులు చేశాడు...
ఓ క్యాలెండర్ ఇయర్లో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2007లో రికీ పాంటింగ్ చేసిన 1424 పరుగులను విరాట్ కోహ్లీ బ్రేక్ చేసేశాడు...
2018లో వన్డేల్లో 1202 పరుగులు,2019లో 1377 పరుగులు సాధించాడు. వరుసగా మూడేళ్లు వన్డేల్లో 1000+ పరుగులు చేసిన ఒకే ఒక్క సారథిగానూ రికార్డు క్రియేట్ చేశాడు...
వన్డే సారథిగా 91 ఇన్నింగ్స్ల్లో 5449 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా నిలిచాడు. కెప్టెన్గా 95 మ్యాచుల్లో 65 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, 27 మ్యాచుల్లో పరాజయాలను అందుకున్నాడు. ఓ మ్యాచ్ టైగా ముగియగా, మరో రెండు మ్యాచులు ఫలితం తేలలేదు...
వన్డే కెప్టెన్గా ఛేదనలో 48 ఇన్నింగ్స్ల్లో విరాట్ కోహ్లీ 13 సెంచరీలు చేయగా, మిగిలిన అందరు భారత కెప్టెన్ కలిపి 413 ఇన్నింగ్స్ల్లో కలిపి 11 సెంచరీలే చేశారు...
కెప్టెన్గా వన్డేల్లో 2017లో, 2018లో ఆరేసి సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్ననాళ్లు, టీమ్ మొత్తం విరాట్ కోహ్లీ కంట్రోల్లోనే ఉండేదని తీవ్రంగా ప్రచారం జరిగింది.
అదీకాకుండా భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేని అర్ధాంతరంగా హెడ్కోచ్ పదవి నుంచి తప్పించడానికి విరాట్ కోహ్లీ కారణమయ్యాడు. అన్నింటికీ మించి గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేకపోయాడు...
రాహుల్ ద్రావిడ్ హెడ్కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టుపై విరాట్ కోహ్లీ ప్రభావాన్ని తగ్గించాలని భావించాడట. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకోవడం కూడా బీసీసీఐకి కలిసొచ్చింది...
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా వంటి జట్ల మాదిరిగానే పరిమిత ఓవర్ల క్రికెట్కి ఓ కెప్టెన్, టెస్టు ఫార్మాట్కి ఓ కెప్టెన్ ఫార్ములాను అనుసరించాలని భావిస్తున్నట్టు విరాట్ కోహ్లీకి చెక్ పెట్టింది బీసీసీఐ.
అయితే ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా వన్డే, టీ20 కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్ శర్మ, అంతర్జాతీయ స్థాయిలో సారథిగా ఎంతవరకూ రాణిస్తాడనేది టీమిండియా ఫ్యాన్స్ను కలవరపెడుతున్న విషయమే.