ఆడినా ఆడకున్నా సెహ్వాగ్కు సపోర్ట్ దక్కింది.. అలా జరిగుంటే నేను కూడా .. మురళీ విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడినా ఆడకున్నా టీమ్ మేనేజ్మెంట్ మద్దతునిచ్చిందని, కానీ తనకు అలా జరగలేదని అంటున్నాడు భారత మాజీ ఆటగాడు మురళీ విజయ్..
గత కొన్నేళ్లుగా భారత జట్టుకు దూరమై అటు దేశవాళీతో పాటు ఐపీఎల్ కూడా కనుమరుగైపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ ప్రస్తుతం తనకు బీసీసీఐతో బంధాలు తెగిపోయినట్టేనని, విదేశీ లీగ్ లలో ఆడేందుకు యత్నిస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా విజయ్ తాను క్రికెట్ ఆడినప్పటి సహచర ఆటగాడు, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరూకు దక్కిన మద్దతు తనకు దక్కలేదని, అలాంటి మద్దతు తనకు కూడా దక్కి ఉంటే కథ మరోలా ఉండేదని తెలిపాడు. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కార్తీక్ మాట్లాడుతూ... ‘వాస్తవంగా చెప్పాలంటే నా కెరీర్ లో నాకు డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు దక్కిన మద్దతు దక్కలేదు. వీరూకు టీమ్ మేనేజ్మెంట్ నుంచి అన్ని విధాలా మద్ధతు లభించింది. తన మాట చెల్లుబాటు అయ్యేది.
కానీ నాకు అలా కాదు. అలాంటి స్వేచ్ఛ గనక నాకు దక్కి ఉంటే.. టీమ్ లో నా మాట వినిపించుకునే వాళ్లు ఉండుంటే నా కెరీర్ మరో విధంగా ఉండేది. అంతర్జాతీయ కెరీర్ లో రాణించాలంటే టీమ్ మేనేజ్మెంట్ మద్దతు తప్పనసరి. కొన్నిసార్లు విఫలమైనా వరుస అవకాశాలు వస్తేనే ఆటలో ప్రయోగాలు చేసే వీలు చిక్కుతుంది..’అని చెప్పాడు.
ఏదేమైనప్పటికీ వీరూతో కలిసి ఆడటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని విజయ్ అన్నాడు. అతడు అద్భతమైన ఆటగాడు అని కొనియాడాడు. ‘వీరూ మరో ఎండ్ లో ఉన్నాడంటే తనతో బ్యాటింగ్ చేయడం కష్టమే. అతడిలా మరొకరు బ్యాటింగ్ చేయలేరేమో అనిపిస్తుంది. టీమిండియాకు వీరూ ఎనలేని సేవలు చేశాడు.
వీరూతో కలిసి ఆడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. సెహ్వాగ్ సక్సెస్ మంత్ర చాలా సింపుల్. దొరికిన బంతిని దొరికనట్టుగా బాదడం. 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్ల బౌలింగ్ లో హాయిగా పాటలు పాడుకుంటూ భారీ షాట్లు ఆడటం అనేది మాములు విషయం కాదు. ఇది మరెవరికీ సాధ్యం కాదు...’ అని తెలిపాడు.