అదే నా చివరి సిరీస్ అని మా ఆవిడతో చెప్పా : అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
Ashwin: డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టులో చోటు దక్కకపోవడంతో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి చర్చనీయాంశమయ్యాడు.

ఇటీవలే కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భాగంగా భారత తుది జట్టులో చోటు కోల్పోయిన రవిచంద్రన్ అశ్విన్.. ఇక్కడికి తిరిగొచ్చాక ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వాస్తవానికి తాను మోకాలి నొప్పి కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తర్వాతే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిద్దామని తన భార్యతో చెప్పినట్టు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇదే విషయమై అశ్విన్ మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్ టూర్ (2022 డిసెంబర్ లో) నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఇదే విషయంపై నా భార్యతో కూడా చర్చించాను. నొప్పి ఎక్కువగా ఉండటంతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీయే నా చివరి సిరీస్ అవుతుందేమోనని తనకు చెప్పేశాను..
అంతేగాక మోకాలి గాయం కారణంగా నా బౌలింగ్ యాక్షన్ ను కూడా మార్చుకోవాలని ఆమెకు చెప్పా...’అని తెలిపాడు. గాయం కారణంగా మరీ ఎక్కువ పని ఒత్తిడి తీసుకోకుండా ఉన్నానని అశ్విన్ వెల్లడించాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత అశ్విన్.. ఐపీఎల్ - 16 లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్ లు ఆడటం గమనార్హం.
అశ్విన్ కు డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఎంపిక చేయకపోయేసరికి టీమిండియా దిగ్గజాలు.. రోహిత్ పై దుమ్మెత్తిపోశారు. చాలామంది ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడానికి అశ్విన్ ను తీసుకోకపోవడం కూడా ఒక కారణమని వాపోయారు. నాలుగో ఇన్నింగ్స్ లో బంతి టర్న్ అయిన సమయంలో ఆస్ట్రేలియాను అశ్విన్ బాగా కట్టడి చేసేవాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియడంతో భారత జట్టు 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్ లో తొలి టెస్టు సిరీస్ ను వెస్టిండీస్ తో ఆడనుంది. జులై 12 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. మరి కరేబియన్ దీవులలో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు అశ్విన్ అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.