నరకానికి పోవడం వాళ్లకి ఇష్టం లేదు... జావెద్ మియాందాద్కి అదిరిపోయే రిప్లై ఇచ్చిన వెంకటేశ్ ప్రసాద్...
ఆసియా కప్ 2023 టోర్నీ వేదిక గురించి ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్లో పెట్టి తీరాల్సిందేనని పీసీబీ, లేదు పాక్లో పెడితే తాము రాలేమని, వేరే దేశంలో నిర్వహించి తీరతామని బీసీసీఐ పట్టుబడుతుండడంతో వివాదం రేగింది...
India vs Pakistan
పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా, ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇండియా, పాకిస్తాన్కి రాకపోతే, పాక్ జట్టు కూడా ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడదని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యల కారణంగానే రమీజ్ రాజా, పీసీబీ ప్రెసిడెంట్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది...
అయితే రమీజ్ రాజా ప్లేస్లో వచ్చిన పీసీబీ కొత్త అధ్యక్షుడు నజం సేథీ కూడా ఇదే మాట మీద నిలబడ్డాడని టాక్. తాజాగా బెహ్రాయిన్లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇండియా, పాకిస్తాన్కి రాకపోతే... పాక్ జట్టు, ఇండియాలో వన్డే వరల్డ్ కప్ ఆడదని పీసీబీ స్పష్టం చేసినట్టు సమాచారం...
టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘పాకిస్తాన్లో క్రికెట్ ఆడడానికి రాకపోతే ఇండియన్ క్రికెట్ టీమ్ నరకానికి వెళ్తుంది. పాక్ టీమ్ బతకడానికి టీమిండియా అవసరం లేదు. అయినా పాక్కి వస్తే ఎక్కడ ఓడిపోతామోనని వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఫ్యాన్స్కి ముఖం చూపించలేమని భయపడి ఇక్కడికి రావడం లేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు జావెద్ మియాందాద్...
జావెద్ మియాందాద్కి తన స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్... ‘కానీ మావాళ్లు నరకానికి వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు...’ అంటూ నవ్వుతున్నట్టు ఎమోజీ జోడించాడు వెంకటేశ్ ప్రసాద్. పాకిస్తాన్కి వెళితే నరకానికి వెళ్లినట్టేనని పరోక్షంగా కౌంటర్ కామెంట్ చేశాడు ప్రసాద్...
పాక్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ సమయంలో పాకిస్తాన్లో బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల కారణంగా మ్యాచ్ని అర్ధాంతరంగా రద్దు చేసి, ప్లేయర్లను అక్కడి నుంచి తరలించారు. ఆసియా కప్ 2023 టోర్నీని పాక్లో నిర్వహిస్తే ఇలాంటి దృశ్యాలు చాలా చూడాల్సి వస్తుందని అంటున్నారు టీమిండియా అభిమానులు...