రోహిత్, కోహ్లీల టీ20 భవితవ్యమేమిటి..? గవాస్కర్ ఆన్సర్ ఇదే..
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత జరిగిన న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో పాటు ఇటీవలే భారత్ లో శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీలు కనిపించలేదు. తాజాగా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు కూడా వీరిని ఎంపిక చేయలేదు.
=
టీమిండియా వెటరన్ ఆటగాళ్లు తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్ లో ఆడలేదు. ఈ ఇద్దరూ వన్డే, టెస్టులకే పరిమితమవుతారని బీసీసీఐ కూడా ఇప్పటికే సంకేతాలిచ్చింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత జరిగిన న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో పాటు ఇటీవలే భారత్ లో శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో వీళ్లు కనిపించలేదు.
అయితే ఈ రెండు సిరీస్ లకు వీరికి విరామమిచ్చారని వార్తలు వినిపించినా త్వరలో న్యూజిలాండ్ తో జరుగబోయే టీ20 సిరీస్ లో కూడా సెలక్టర్లు వీరిని పక్కనబెట్టారు. దీంతో ఈ ఇద్దరి టీ20 కెరీర్ ముగిసినట్టేనని తెలుస్తున్నది. బీసీసీఐ కూడా వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని కుర్రాళ్లకు అవకాశమివ్వాలని భావిస్తున్నది.
రోహిత్, కోహ్లీల వయసు కూడా వాళ్ల టీ20 కెరీర్ కు అడ్డుగా వస్తున్నదని.. మరీ ముఖ్యంగా నిత్యం ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడే హిట్ మ్యాన్ ను టీ20ల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ పగ్గాలు ఇవ్వనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాను మాత్రం టీ20లను వదిలేయలేదని ఇటీవలే రోహిత్ చెప్పడంతో బీసీసీఐ కావాలనే సీనియర్లను సైడ్ చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా ఇదే విషయమై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ ఇద్దరూ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో కీలక సభ్యులుగా ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు కూడా అటుదిశగా ఆలోచించి కొత్త కుర్రాళ్లకు అవకాశాలిస్తున్నారని అభిప్రాయపడ్డాడు. టీ20లకు వాళ్లను ఎంపిక చేయనంత మాత్రానా రోహిత్, కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్టు కాదని సన్నీ అన్నాడు.
ఇండియా టుడే తో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నేను ఈ విషయాన్ని (రోహిత్, కోహ్లీలకు టీ20 జట్టులో చోటు లేకపోవడంపై) ఎలా చూస్తానంటే.. భారత్ టీ20 వరల్డ్ కప్- 2024ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచిస్తున్నది. సెలక్షన్ కమిటీ కూడా ఇందులో భాగంగానే యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తున్నది. అంటే దానర్థం రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి పూర్తిగా తప్పించినట్టు మాత్రం కాదు.
వాళ్లు ఈ ఏడాదంతా నిలకడగా ఆడి (వన్డేలు, టెస్టులలో) ఫిట్నెస్ నిరూపించుకోగలిగితే జట్టులోకి రావడానికి సమస్యేమీ లేదు. అదీగాక భారత్ ఈ ఏడాది కీలక టోర్నీలు, సిరీస్ లు ఆడాల్సి ఉంది. వచ్చే నెలలో భారత్.. ఆసీస్ తో ఆడనుంది. ఆస్ట్రేలియాను ఓడిస్తే భారత్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. దాని తర్వాత వన్డే వరల్డ్ కప్ ఉంది. అంతకంటే ముందే ఆసియా కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలలో రోహిత్ - కోహ్లీ చాలా కీలకం. అందుకే టీ20ల నుంచి విరామం ఇస్తున్నట్టుగా ఉంది..’అని అభిప్రాయపడ్డాడు.