తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్కి మళ్లీ నిరాశే... సాహా కోలుకోవడంతో భరత్ను ఇక్కడే వదిలేసి...
తెలుగు క్రికెటర్, ఆంధ్రా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్కి మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లాండ్ టూర్కి బ్యాకప్ వికెట్ కీపర్గా ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్లో క్వారంటైన్లో గడిపిన భరత్ను ఇంటికి పంపించేసింది భారత క్రికెట్ బోర్డు. వృద్ధిమాన్ సాహా పూర్తిగా కోలుకోవడంతో అతను భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ టూర్కి వెళ్లాడు.
కొన్నేళ్లుగా భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగు కుర్రాడు కెఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్ టూర్కి బ్యాకప్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్లో వృద్ధిమాన్ సాహాకి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
మే 4న కరోనా బారిన పడిన వృద్ధిమాన్ సాహా, దాని నుంచి కోలుకోవడానికి 14 రోజుల సమయం తీసుకున్నాడు. మే 18నే సాహాకి నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాతిరోజు అంటే మే 19 నుంచే ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే ప్లేయర్లకు ముంబైలోని బయో బబుల్లో క్వారంటైన్ మొదలైంది..
కరోనా నుంచి కోలుకున్న వృద్ధిమాన్ సాహా, ఆలస్యంగా బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్లోకి చేరాడు. అయితే క్వారంటైన్ పీరియడ్లో సాహా పూర్తిగా ఫిట్గా ఉన్నాడని ఫిజియో నమ్మకం వ్యక్తం చేయడంతో సీనియర్ వికెట్ కీపర్గా ఇంగ్లాండ్ టూర్కి వెళ్లాడు సాహా...
బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపికై, ముంబైలో 7 రోజుల కఠిన క్వారంటైన్ గడిపిన శ్రీకర్ భరత్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. అతన్ని ఇంటికి పంపించి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహాలతో ఇంగ్లాండ్ టూర్కి బయలుదేరింది భారత జట్టు.
దాదాపు రెండేళ్లుగా భారత జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న కెఎస్ భరత్, మరోసారి బ్యాకప్ ప్లేయర్గానే జట్టులోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఇంతకుముందు ఆసీస్ టూర్లో, ఇంగ్లాండ్ సిరీస్లో స్టాండ్ బై ప్లేయర్గా వ్యవహారించాడు భరత్..
రంజీ ట్రోఫీలో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేసిన కోన శ్రీకర్ భరత్, ఇప్పటిదాకా 69 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 3909 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్గా 232 క్యాచులు, 27 స్టంపౌంట్లు చేశాడు భరత్.
2019లో తొలిసారి బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో వృద్ధిమాన్ సాహాకి బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపికైన శ్రీకర్ భరత్, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో రిషబ్ పంత్కి బ్యాకప్గా వ్యవహారించాడు...
ఐపీఎల్ 2021 వేలంలో శ్రీకర్ భరత్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే సీజన్లో భరత్కి ఇప్పటిదాకా తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు...