- Home
- Sports
- Cricket
- WI vs IND: వీసా సమస్యలతో గయానాలో ఆగినా.. అధ్యక్షుడి జోక్యంతో అమెరికాకు వెళ్లిన టీమిండియా..
WI vs IND: వీసా సమస్యలతో గయానాలో ఆగినా.. అధ్యక్షుడి జోక్యంతో అమెరికాకు వెళ్లిన టీమిండియా..
WI vs IND T20I: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టింది. వీసా సమస్యలతో నాలుగో టీ20 జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలతో ఉన్న టీమిండియాకు ఇది ఊరట కలిగించే వార్తే..

వెస్టిండీస్, టీమిండియా ఆటగాళ్లకు గయానా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీసా సమస్యలతో గయానాలోనే ఆగిన ఇరు జట్ల ఆటగాళ్లను స్థానిక ప్రభుత్వాధినేత చొరవ తీసుకుని అగ్రరాజ్యానికి పంపించారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఎట్టకేలకు బుధవారం రాత్రి ఫ్లోరిడాకు వెళ్లారు.
వెస్టిండీస్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా.. మూడు మ్యాచులను కరేబియన్ దీవుల్లో నిర్వహించిన విండీస్ క్రికెట్ బోర్డు, మిగిలిన రెండు మ్యాచులను అమెరికాలోని ఫ్లోరిడాలో జరిపించేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది.
అయితే అమెరికా వెళ్లేందుకు టీమిండియాతో పాటు వెస్టిండీస్ లోని సుమారు 14 మందికి (ఆటగాళ్లు, సహాయక సిబ్బంది) వీసా సమస్యలు తలెత్తాయి. మిగతావాళ్లు వెళ్లినా 14 మంది మాత్రం గయానాలోని జార్జిటౌన్ లో ఉన్న అమెరికా ఎంబసీలోనే ఆగాల్సి వచ్చింది. దీంతో మిగిలిన వాళ్ల వీసాలు సమస్యలు తొలగిపోతాయా..? మ్యాచ్ జరుగుతుందా..? అనే అనుమానాలు తలెత్తాయి.
కానీ గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ప్రత్యక్షంగా పరిస్థితిని పర్యవేక్షించారు. ఆయన చొరవ తీసుకుని ఇరు జట్ల ఆటగాళ్ల వీసా సమస్యలను తొలగించారు. ఎంబసీ అధికారులతో నేరుగా చర్చించి ఆటగాళ్ల వీసాకు సంబంధించిన ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్నారు.
ఈ క్రమంలో గయానా అధ్యక్షుడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. ‘గయానా ప్రభుత్వం చొరవతోనే ఇరు జట్ల ఆటగాళ్లకు వీసా సమస్యలు తొలిగిపోయి వాళ్లకు క్లీయరెన్స్ వచ్చింది. గయానా అధ్యక్షుడి నుంచి ఇది గొప్ప ప్రయత్నం..’ అని తెలిపాడు.
ఇక ఇరు జట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచులు జరగగా తొలి టీ20లో భారత్ నెగ్గింది. కానీ రెండో మ్యాచ్ లో విండీస్ విజయం సాధించినా మూడో మ్యాచ్ లో భారత్ తిరిగి పుంజుకుంది. సిరీస్ లో ప్రస్తుతం భారత్.. 2-1 ఆధిక్యంతో ఉంది. ఈనెల 6 (శనివారం) న నాలుగో మ్యాచ్, 7 (ఆదివారం) న చివరి మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి.